మహిళా బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పటికీ.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాత్రం సందిగ్ధం నెలకొన్నది. 2024 తర్వాత జనాభా లెక్కలతోపాటు పునర్విభజన చేపడుతామంటూ అమిత్షా పార్లమెంటులో చేసిన ప్రకటనతో ఈ చర్చ మొదలైంది. ప్రభుత్వం చెప్తున్నదాన్నిబట్టి చూస్తే జనగణన ఇప్పట్లో ఉండేలా కనిపించడంలేదు. మరి దానితో ముడిపడి ఉన్న పునర్విభజన సంగతేంది? అది ఎప్పడు? ఏ ప్రాతిపదికన? అన్నీ సందేహాలే! అంతా సందిగ్ధతే!
-ఇనగంటి రవికుమార్, సీనియర్ జర్నలిస్ట్
Delimitation | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మరోసారి చర్చ మొదలైంది. 2024 తర్వాత జనాభా లెక్కలతోపాటు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడుతామని అమిత్షా చెప్పారు. నిజానికి జనాభా లెక్కలు 2021లోనే జరగాలి. కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. కరోనా ముప్పు తొలగిపోయిన తర్వాతైనా సెన్సస్ నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ, అలా జరుగలేదు. అమిత్ షా ప్రకటనతో ఇక ఇప్పట్లో జనగణన ఉండదని తేలిపోయింది. ఎందుకు వాయిదా వేశారో ఎవరికీ తెలియదు. దీనిపై అనేక అనుమానాలున్నాయి. ఇదంతా ఇప్పుడెందుకంటే జనగణనతో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అనుసంధానమై ఉన్నది. 2024 తర్వాత జనగణన అన్నారు కానీ, కచ్చితంగా ఎప్పుడు ఉంటుందో అమిత్ షా చెప్పలేదు. 2025లోనా, 2026లోనా, 2027లోనా అనేది ఎవరికీ తెలియదు. మరి జనగణన తర్వాత ఏం జరుగుతుంది? నియోజకవర్గాల పునర్విభజన ఏ ప్రాతిపదిక ఉంటుంది? పునర్విభజన వల్ల లాభం ఎవరికి? నష్టం ఎవరికి? అనే అంశాలపై ప్రముఖ జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ విశ్లేషణ..
రెండు ప్రతిపాదనలు
జన గణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఎలా చేయాలన్నదానిపై ఇప్పటికే రెండు ప్రతిపాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
2024 తర్వాత నిర్వహించబోయే జన గణనను అనుసరించి లోక్సభ నియోజకవర్గాలను 888కి పెంచటం. ఈ ప్రతిపాదనను బీజేపీ ముందుకు తెచ్చింది. నియోజకవర్గాలను 888కి పెంచినపుడు పునర్విభజన ఎలా అంటే… 2024 తర్వాత చేపట్టబోయే జనగణనలో తేలిన మొత్తం దేశ జనాభాని 888తో భాగిస్తారు. తద్వారా వచ్చేది దేశ పార్లమెంట్ స్థానం సగటు జనాభా. నియోజవర్గంలోని ఈ జనాభా సంఖ్యతో ఒక రాష్ట్ర మొత్తం జనాభాను భాగిస్తే వచ్చేది ఆ రాష్ట్రంలోని లోక్సభ స్థానాల సంఖ్య. ఇలా చేసినప్పుడు ఆ రాష్ట్రంలో తుది కేటాయింపులో ఒక స్థానం తగ్గవచ్చు లేదా పెరగవచ్చు.
2023 జనాభా అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్లో ఒక పార్లమెంటు స్థానం జనాభా సగటున 23 లక్షలు ఉన్నది. బీహార్లో 31లక్షలు, పశ్చిమబెంగాల్లో 23 లక్షలు, రాజస్థాన్లో 32 లక్షలు (అత్యధికం), ఆంధ్రప్రదేశ్లో 21 లక్షలు, తెలంగాణలో 22 లక్షలు, మేఘాలయలో 16 లక్షలు, చండీగఢ్లో 12 లక్షలు, హిమాచల్ప్రదేశ్లో 18 లక్షల జనాభా ఉన్నది. మొదటి మూడు పునర్విభజనలు జనాభా ప్రాతిపదికన చేసినప్పటికీ పైన పేర్కొన్న విధంగా దేశంలో జనాభా (టీఎఫ్ఆర్) పెరుగుదల, తగ్గుదల వివిధ రాష్ర్టాల్లో భారీ హెచ్చు తగ్గుదలతో ఉన్నది.
బీజేపీ ప్రతిపాదన ప్రకారం నియోజకవర్గాలను పునర్విభజిస్తే 2026 జనాభా ప్రకారం లోక్సభ స్థానాలు ఉత్తరప్రదేశ్లో 143, బీహార్లో 79, పశ్చిమబెంగాల్లో 60, మహారాష్ట్ర 76, ఉభయ తెలుగు రాష్ర్టాల్లో కలిపి 54, తమిళనాడు 49, రాజస్థాన్ 50, గుజరాత్లో 43కు చేరుకొంటాయి. ఈ విధానం వల్ల దక్షాణాదిలో మొత్తంగా సీట్ల సంఖ్య 130 నుంచి 165కు పెరుగుతుంది. కానీ, పార్లమెంటులో నిష్పత్తి ప్రకారం చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు లోక్సభలో దక్షిణాది రాష్ర్టాల ఎంపీల శాతం 23.19. పై విధానంలో పునర్విభజిస్తే అది 19 శాతానికి పడిపోతుంది. అంటే పార్లమెంటులో దక్షిణాది రాష్ర్టాల మాట ఏ మేరకు చెల్లుబాటు అవుతుందో అర్థం చేసుకోచ్చు.
ఇక రెండో ప్రతిపాదన ఏంటంటే.. లోక్సభ స్థానాలను ప్రస్తుతం ఉన్న 545కే పరిమితం చేసి 2024 తర్వాత చేపట్టబోయే జనాభా లెక్కల ప్రకారం పునర్విభజించటం. ఇలా చేసినా నష్టపోయేది దక్షిణాది రాష్ర్టాలే. ఈ విధానంలో దేశ జనాభాను 545తో భాగిస్తారు. అప్పుడు జనాభా అధికంగా పెరిగిన రాష్ర్టాల్లో లోక్సభ స్థానాలు కూడా పెరుగుతాయి. జనాభా తక్కువ ఉన్న రాష్ర్టాల్లో తగ్గిపోతాయి. ఈ లెక్కన తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్సభ స్థానాలు 14కు పడిపోతాయి. అంటే మూడు స్థానాలు ఎగిరిపోతాయి. అలాగే దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్లో 5, తమిళనాడులో 8 సీట్లు తగ్గిపోతాయి. కేరళ పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం 20 లోక్సభ స్థానాలుండగా, అవి 12కు తగ్గిపోతాయి. బెంగాల్ 4, ఒడిశా 3, కర్ణాటక 2, పంజాబ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఒక్కో సీటు నష్టపోతాయి. ఈ రాష్ర్టాలు నష్టపోయే సీట్లు జనాభా అధికంగా పెరిగే రాష్ర్టాలకు లభిస్తాయి. ఉత్తరప్రదేశ్లో 11, బీహార్లో 10, రాజస్థాన్లో 6, మధ్యప్రదేశ్, గుజరాత్లో ఒక్కో సీటు పెరుగుతాయి. రెండింటిలో ఏ విధానంలో నియోజకవర్గాలను పునర్విభజించినా లాభపడేది బీజేపీ ప్రాబల్యం అధికంగా ఉన్న ఉత్తరాది రాష్ర్టాలే. దీంతో హిందీ భాషా రాష్ర్టాల అధిపత్యం దేశంలో శాశ్వతంగా స్థిరీకరించబడుతుంది. అందువల్ల ఇప్పుడున్న పార్లమెంటు స్థానాల సంఖ్య మార్చకుండా పునర్విభజన చేయాలి.
జనాభా నియంత్రణే శాపం
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరించింది. ప్రస్తుతం భారత జనాభా 140 కోట్లు అని అంచనా. జనాభా నియంత్రణకు 1950 దశకం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. దక్షిణాది రాష్ర్టాలు ప్రగతిపథంలో దూసుకుపోతూ జనాభాను విజయవంతంగా నియంత్రించాయి. ఉత్తరాది రాష్ర్టాలు మాత్రం ఇబ్బడిముబ్బడిగా జనాభాను పెంచుకొంటూ పోతున్నాయి. దీంతో 70 ఏండ్లయినా జనాభా నియంత్రణలో భారత్ విజయం సాధించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వాల నిర్దేశం ప్రకారం జనాభా నియంత్రను పాటించిన దక్షిణాది రాష్ర్టాలు ఇప్పుడు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా బాగా పనిచేసినవారికి ప్రోత్సాహకాలుంటాయి. కానీ, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో అందుకు విరుద్ధంగా భారీ కోతలు పడనున్నాయి. సంతానోత్పత్తి రేటులో ఇప్పటికీ ఉత్తరాది రాష్ర్టాలు.. ముఖ్యంగా హిందీ భాషా రాష్ర్టాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది. ఒక ఆరోగ్యవంతమైన మహిళ ఎంతమంది బిడ్డలకు జన్మనిస్తున్నది అన్నదానిని సంతానోత్పత్తి రేటు అంటారు.
గతంలో పునర్విభజన ఇలా..
దేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1951లో 400 లోక్సభ స్థానాలున్నాయి. 1957లో 403 స్థానాలుకు పెరిగాయి. ఆ సమయంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన స్థానాలు కాకుండా 91 జనరల్ సీట్లు ఉన్నాయి. ఈ 91 సీట్లను ద్విసభ్య స్థానాలుగా మార్చారు. అంటే ఒకే ఎంపీ నియోజకవర్గానికి ఒక జనరల్ సభ్యుడు ఉండగా, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి మరో సభ్యుడు కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. దీనివల్ల స్థానాల సంఖ్య 403లో మార్పు లేకున్నా ప్రాతినిధ్య సభ్యుల సంఖ్య 494కి పెరిగింది. ఎస్సీ, ఎస్టీలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ ఏర్పాటు చేశారు. 1962లో జరిగిన ఎన్నికల్లో ద్విసభ్య స్థానాలను తీసివేసి 494 స్థానాలు ఏక సభ్య నియోజగవర్గాలుగానే ఎన్నికలు జరిగాయి.
1961లో 45 కోట్ల జనాభా ప్రకారం జరిగిన పునర్విభజన వలన 1967 నాటికి లోక్సభ స్థానాల సంఖ్య 520కి పెరిగింది. 1971 జనాభా లెక్కల ప్రకారం 1977 నాటికి 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1976లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2021 జనగణన వరకు లోక్సభ స్థానాలను పెంచకుండా చట్టం చేశారు. దీనికి ప్రధాన కారణం దేశంలో జనాభా నియంత్రణ ప్రణాళిక అమలు చేస్తున్న రాష్ర్టాలు నష్టపోకూడదని, నియంత్రణ అమలు అన్ని రాష్ర్టాలు పాటించాలని. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చేసి 2026 తరువాత జరిగే తొలి జనాభా లెక్కల ప్రకారం స్థానాల సంఖ్య పెంచాలని నిర్దేశించింది. అలాగే 87వ సవరణ ద్వారా 2003లో వివిధ రాష్ర్టాల్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల సంఖ్య మారకుండా జిల్లాలో పెరిగిన, తగ్గిన జనాభకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులు మార్చాలని నిర్దేశిచింది. దాని ఫలితంగా జస్టిస్ కుల్దీప్సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన ఢీలిమిటేషన్ కమిషన్ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల పరిధిలో జనాభా సమానంగా ఉండేలా పునర్విభజన చేసింది. ఈ మార్పులు 2008లో అమల్లోకి వచ్చాయి.
జన గణనలో జాప్యమెందుకు?
జనగణను కేంద్రం సుదీర్ఘంగా వాయిదా వేయటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021లోనే జన గణన జరగాల్సి ఉన్నా కొవిడ్-19 కారణంగా వాయిదా పడింది. 2022 నాటికి పరిస్థితి చక్కబడింది. కానీ, జన గణనపై కేంద్రం ఏమాత్రం కసరత్తు చేయలేదు. అమిత్ షా ప్రకటనతో ఇప్పట్లో జనగణన ఉండదని తేలిపోయింది. 2027లో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉన్నది. ఆలోపు జనగణన చేపడుతారన్న నమ్మకం లేదు. అదే జరిగితే 2026 తరువాత అందుబాటులో ఉన్న జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేసేలా రాజ్యాంగ సవరణ చేసి 2027లో ఆ తంతు పూర్తిచేసే అవకాశం ఉన్నది. ఆ తర్వాత రెండేండ్లకే అంటే 2029లో లోక్సభ ఎన్నికలు ఉంటాయి. ఆలోపు సీట్లను పెంచి ఉత్తర భారతంలో ప్రత్యేకించి హిందీ భాషా ప్రాంతంలో పెరిగే సీట్లతో లబ్ధి పొంది అధికారాన్ని శాశ్వతంగా తన చేతిలో ఉంచుకోవాలని బీజేపీ సుదూర ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ చర్యతో భవిష్యత్తులో తమకు ఉత్తరాదివారు ద్రోహం చేస్తున్నారని దక్షిణాది రాష్ర్టాల ప్రజల్లో బలంగా నాటుకుపోయే ప్రమాదం ఉన్నది. అదే జరిగితే దేశ సమగ్రతకే ముప్పు ఏర్పడవచ్చు. ఇదంతా కాకుండా జనగణన 2031లో నిర్వహిస్తే వాటిని ప్రచురించేందుకు మరో మూడేండ్లు పడుతుంది. అప్పుడు డీలిమిటేషన్ కమిషన్ను నియమిస్తే, ఆ కమిటీ కనీసం రెండేండ్ల కాల వ్యవధి తీసుకుంటుంది. 2039 సాధారణ ఎన్నికల వరకు సీట్లు పెంచి పునర్విభజన చేయడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు.
అన్ని రాష్ర్టాల్లో పెంచితే మంచిది
ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న రెండు విధానాల్లో కాకుండా అన్ని రాష్ర్టాల్లో నియోజకవర్గాలను పెంచేలా చర్యలు చేపడితే మంచిది. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న లోక్సభ స్థానాల సంఖ్యకు అదనంగా 33 శాతం పెంచడమే ఈ ప్రతిపాదన. ఈ లెక్కన ఉత్తరప్రదేశ్లో 27 స్థానాలు పెరుగుతాయి. తమిళనాడులో 13, ఆంధ్రప్రదేశ్లో 8, తెలంగాణలో 5 లోక్సభ స్థానాలు పెరుగుతాయి. ఈ ఫార్ములా వల్ల లోక్సభ స్థానాల సంఖ్య అన్ని రాష్ర్టాల్లో పెరగడంతోపాటు ఇప్పుడున్న జనాభా- పార్లమెంట్ స్థానాల నిష్పత్తి దాదాపు కొనసాగుతుంది. ఈ పెంచిన 33 శాతం సీట్లలో మహిళా కోటాను అమలు చేయవచ్చు.