హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీకి దింపుడు కల్లం ఆశలు కూడా చెదిరిపోయాయి. బీఆర్ఎస్ నుంచి భారీ చేరికలు ఉంటాయన్న ఎదురుచూపులకు తెరపడింది. చివరికి కాంగ్రెస్ నుంచి కూడా ఆ పార్టీలో చేరేందుకు ఎవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మొదలు రాష్ట్ర నాయకత్వం మొత్తం వరుసగా సంప్రదింపులు జరుపుతున్నా మాజీ సర్పంచులు వంటివారు తప్ప పేరున్న నేతలెవరూ చేరడం లేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటున్నది. కాంగ్రెస్ మాదిరిగానే ‘దరఖాస్తులు’ అంటూ హడావుడి చేసేందుకు సిద్ధమైంది.
ఇప్పటివరకు బీజేపీలో ఎమ్మెల్యే టికెట్లకు దరఖాస్తుల సంస్కృతి లేదు. మొదటిసారిగా ప్రజల నోట్లో నానేందుకు ఈ పద్ధతిని ఎంచుకున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవల ఖమ్మంలో సభ అనంతరం కేంద్ర మంత్రి అమిత్షా సైతం ముఖ్యనేతలతో భేటీ అయిన సందర్భంలో ‘అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఉన్నారా?’ అని ప్రశ్నించగా దీనికి రాష్ట్ర నేతలంతా నీళ్లు నమిలినట్టు సమాచారం. మూడునాలుగు నెలల్లో ఎన్నికలు పెట్టుకొని కనీసం అభ్యర్థులను సిద్ధం చేసుకోలేని దుస్థితిలో ఉన్నారా? అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. దీంతో రాష్ట్రంలో తమకు రాజకీయంగా పలుకుబడి ఉన్నదని నిరూపించుకునేందుకు బీజేపీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
ముఖ్యంగా ఈటల రాజేందర్ కాళ్లకు బలపం కట్టుకొని చేరికల కోసం తిరుగుతున్నారు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఔట్ డేటెడ్ నేతలు తప్ప ఎవరూ స్పందించడం లేదు. వీరు ఎమ్మెల్యే అభ్యర్థులుగా కాదు కదా.. కనీసం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ పదవికి కూడా పోటీ చేసే స్థితిలో లేరు. దీంతో కాంగ్రెస్ మాదిరిగానే హడావుడి చేయాలని నిర్ణయించింది. అయితే దరఖాస్తు ఫీజు పెడితే ఒక్కరు కూడా దరఖాస్తు చేయరని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అర్థమైంది. అందుకే ఉచితంగా దరఖాస్తు చేయాలని సూచించింది. గతంలో బీజేపీ ఎప్పుడూ ఇలాంటి పద్ధతిని అవలంబించలేదు. దరఖాస్తుల తతంగంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత వెతికినా 20-30 నియోజకవర్గాలకు మాత్రమే నేతలు సిద్ధంగా ఉన్నారన్నది బహిరంగ రహస్యం. మరి మిగతా నియోజకవర్గాలకు దరఖాస్తులు ఎక్కడి నుంచి తెస్తారని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ దరఖాస్తులు రాకపోతే పరువుపోదా? అని మండిపడుతున్నారు.