తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రారంభించిన రైతుబంధు కాంగ్రెస్ పాలనతో రైతుభరోసాగా మారి నెలల తరబడి రైతులను ఎదురుచూపులకు గురిచేసినట్లే..ఆసరా పింఛన్ పథకం ‘చేయూత’గా పేరు మార్చుకొని ‘కోత’లకు సిద్ధమవుతున్నది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీల్లో చేయూత పథకం ఒకటి. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు రూ.4 వేలు ఇస్తామని పాలకులు ఎంతో గొప్పగా నమ్మబలికిన హామీ ఇప్పుడు రెండున్నరేండ్ల తర్వాత లబ్ధిదారుల ఏరివేత రూపంలో ఇప్పుడు ముందుకు వచ్చింది. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేయూత పథకం కింద మరో రెండు లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తామని అన్నారు. కానీ ప్రభుత్వ అడుగులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
కేసీఆర్ ఎంతో గొప్ప ఆశయంతో 2014 నవంబర్లో ప్రారంభించిన తర్వాత తొమ్మిదిన్నరేండ్ల పాటు నిరాఘాటంగా కొనసాగిన ఆసరా పథకం కాంగ్రెస్కు ఎన్నికల్లో ఆసరా అయింది కానీ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదు. 2014కు ముందు ఉన్న ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛన్ పేరిట నెలకు కేవలం రూ.200 ఇచ్చేవి. ఇందుకోసం ఏటా రూ.88 కోట్లు ఖర్చు పెట్టేవి. కానీ కేసీఆర్ ఆసరా పథకం ద్వారా మరిన్ని పేద వర్గాలవారు ఈ గొడుగు కిందికి వచ్చారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, బీడీ కార్మికులు, కల్లు గీత కార్మికులు, బోదకాలు బాధితులు, ఎయిడ్స్ రోగులు..ఇలా మొత్తం 24 లక్షల మంది ఈ పథకం కింద లబ్ధ్ది పొందారు. ఇందుకోసం ఏటా రూ.3,350 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగేది. పింఛన్ సాయాన్ని కేసీఆర్ రూ.200 నుంచి రూ.1,000, దివ్యాంగులకు రూ.1,500కి పెంచారు. 2018లో పింఛన్ సాయం రూ.1,000 రూ.2,016గా, దివ్యాంగులకు రూ.3,016గా పెంచారు. ఆయా పథకాల వర్తింపునకు అర్హత వయసు 57కు తగ్గించటం వల్ల లబ్ధిదారుల సంఖ్య 39 లక్షలకు చేరింది. దీంతో ఆయా పథకాల అమలుకు బడ్జెట్ ఏడాదికి రూ.12,067 కోట్లకు చేరింది.
గత లబ్ధిదారుల్లో సుమారు 3 లక్షల మంది చనిపోవడంతో కొత్తగా 2 లక్షల మంది లబ్ధిదారులు చేరినా మొత్తం పింఛన్దారులు లక్ష వరకు తగ్గే అవకాశం ఉన్నది. అంటే, రాష్ట్ర ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుంది. కొత్త పింఛన్లో ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ మధ్య సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒంటరి మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని మహాలక్ష్మి పథకం కింద గల ఆరు గ్యారెంటీల్లో ఉన్నది. వాస్తవానికి మహాలక్ష్మి, చేయూత వేర్వేరు పథకాలు. ఒంటరి మహిళలకు ఇవ్వవలసింది ఆర్థిక సాయమే తప్ప పింఛన్ కాదు.
జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చేయూత పెన్షన్ పంపిణీ మొదలవుతుందని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. నిజానికి ఈ సర్వే జూన్ 15 వరకు సాగుతుంది. కొత్త లబ్ధిదారుల దరఖాస్తు ప్రక్రియ ఇంకా నడుస్తున్నది. సమాచార సేకరణ తప్ప అర్హులైన లబ్ధిదారుల జాబితాపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత లేదు. మరి చేయూత ఎలా పంపిణీ చేస్తారో అనూహ్యం. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఎన్నికల హామీలో పేర్కొన్న విధంగా ఈ పథకం కింద నెలకు రూ.4,000 ఇస్తామని పాలకవర్గంలోని ఏ మంత్రి లేదా నాయకుడు కూడా ఇంతవరకూ ప్రకటించలేదు.
మరోవైపు విడతలవారీగా రూ.500 చొప్పున చేయూత పింఛన్ను పెంచుతూ పోవాలనే ప్రణాళిక ఒకటి ప్రభుత్వం వద్ద ఉన్నదనే ప్రచారం బయటికి వచ్చింది. అదే నిజమైతే కాంగ్రెస్ హయాంలో మిగిలిన రెండున్నరేండ్లలో ఆ సొమ్ము రూ.4,000కి చేరుతుందన్న గ్యారెంటీ లేదు. వాస్తవం ఏమిటంటే పింఛన్దారులు గత రెండున్నరేండ్లుగా సుమారు రూ.25 వేల కోట్లు కోల్పోయారు. అదీ అసలు విషయం!
– బద్రి నర్సన్