బంజారాహిల్స్, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో వీరశైవ లింగాయత్ల కోసం రంగారెడ్డి జిల్లా కోకాపేటలో రూ.10 కోట్లతో నిర్మించనున్న బసవేశ్వరభవన్కు అక్టోబర్ రెండో తేదీన భూమి పూజ నిర్వహించనున్నట్టు బసవ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ చెప్పారు. బంజారాహిల్స్లోని జింఖానా క్లబ్లో గురువారం నిర్వహించిన బసవ సంఘాల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
వీరశైవ లింగాయత్ల గౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించడం, ట్యాంక్బండ్పై బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు వంటివి చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలని గుర్తు చేశారు. భూమి పూజకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్, సబితాఇంద్రారెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతారని చెప్పారు.
సమావేశంలో వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీ హనుమంతు, ఉపాధ్యక్షులు గౌరీశంకర్, మాడపు వీరమల్లేశ్, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప, మాజీ అధ్యక్షుడు సంగమేశ్వర్, రాష్ట్రీయ బసవదళ్ అధ్యక్షుడు శంకర్ పాటిల్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పాటిల్, సీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.