హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చే హామీల సంగతి ఎలా ఉన్నా ‘మా పార్టీ అధికారంలోకి వస్తే చేసే తొలిసంతకం ఇదే’ అని ఇచ్చే హామీ మాత్రం చాలా బలంగా ఉండాలి. అది ఆ పార్టీని గెలుపువైపు తీసుకెళ్లేలా.. ప్రజల్లోకి బలంగా వెళ్లే నినాదం కావాలి. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగాలు ఆయన అజ్ఞానాన్నే బయట పెడుతున్నాయి. ఇటీవల హుస్నాబాద్లో జరిగిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఓ భారీ ప్రకటన చేసినట్టు బిల్డప్ ఇచ్చా రు. రాష్ట్రంలో ఇప్పటికే ఈ రెండూ సమర్థంగా అమలవుతున్న విషయం ప్రజల అనుభవంలోనే ఉన్నది. తాను ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్ముతారని బండి చేసిన వ్యాఖ్యలు వికటించాయి.
మార్పు కండ్లముందే..
విద్యారంగంలో తెలంగాణ ఏర్పాటుకు ముందున్న దుస్థితి, స్వరాష్ట్రంలో జరిగిన మార్పులు ప్రజల కండ్ల ముందే ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం 625 గురుకులాలను ప్రారంభించి ప్రాథమిక స్థాయినుంచే నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో కలిపి నాలుగు లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంచేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నది. దేశంలోనే తొలిసారి మహిళల కోసం ప్రత్యేకంగా 53 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ప్రారంభించింది. మైనార్టీ గురుకులాల్లో సగం సీట్లు బాలికలకే కేటాయించారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద విదేశాల్లో చదువుకొనే వారికి రూ.వందల కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యావిధానం ద్వారా సాధించిన గుణాత్మక మార్పును హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒక కేస్ స్టడీగా స్వీకరించింది. ఈ విషయాలన్నీ బండి సంజయ్ మరిచిపోయారా? అని బీజేపీ శ్రేణులే విస్మయం వ్యక్తంచేస్తున్నాయి.
వైద్యం మెరుగుపడలేదా?
బండి సంజయ్ ఇచ్చిన మరో హామీ ఉచిత వైద్యం. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ దవాఖానలు ఎంతో మెరుగయ్యాయని అనేక సర్వేలు ఇప్పటికే ప్రకటించాయి. విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం 224 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసింది. ఇందులో 196 రకాల మందులు, 57 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నది వాస్తవం కాదా? 25 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసింది కండ్లకు కనిపించడం లేదా? డయాలసిస్ పేషెంట్ల బాధలు తీర్చేందుకు 49 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటుచేసి, 11 వేల కుటుంబాలపై ఒక్క పైసా భారం పడకుండా కంటికి రెప్పలా కాపాడుకొంటున్నది నిజం కాదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో రాష్ట్రంలో నాలుగు మెడికల్ కాలేజీలుంటే, ఏడేండ్లలో ఐదు కొత్త కాలేజీలు ప్రారంభించింది.
ఇప్పుడు మరో 8 కాలేజీలను ఏర్పాటు చేస్తున్నది. ఇవన్నీ కండ్లముందే జరుగుతున్నా.. పసలేని హామీలతో బండి.. ప్రజల్లో పలుచనయ్యారని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. రాష్ట్రం పచ్చగా ఎక్కడుంది అంటూ బండి చేసిన విమర్శలకు ‘ఒక్కసారి ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లోనే షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు చూస్తే సమాధానం వస్తుంది’ అని నెటిజన్లు పేర్కొంటున్నారు. యాత్ర మొత్తంలో ఒక్కసారైనా ఎంపీగా తెలంగాణకు, కనీసం కరీంనగర్కు ఎన్ని నిధులు తెచ్చారు? ఎన్ని పనులు మంజూరు చేయించారో చెప్పారా? అని ప్రశ్నిస్తున్నారు. 36 రోజులు.. 8 జిల్లాలు.. 19 అసెంబ్లీ, 6 లోక్సభ నియోజకవర్గాల నుంచి పాదయాత్ర సాగిందని చెప్పుకోవడానికి బాగానే ఉన్నది. కానీ దాని వల్ల ఒరిగింది మాత్రం శూన్యమని బీజేపీ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి.