లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) కింద యాసంగికే నెర్రెలుబారే నేలలిప్పుడు ఎండాకాలంలో కూడా తడి ఆరుతలేవు! కాళేశ్వరం జలాలతో ఆ పల్లెలిప్పుడు పచ్చబడ్డయి. ఉచిత కరెంటు పాతాళ గంగను పైకి తెచ్చిప్రతి పాదుకీ నీళ్లు తాపి, రైతును సేదతీర్చింది. జేబులో రైతుబంధు పైసలు.. జేబు వెనకాల గుండెకు ధైర్యమిచ్చినయ్! అరటి సాగుకు రాయితీలొచ్చినయ్. ఇల్లందకుంట పల్లెల్లో అరటి పంట పండింది. ‘కేసీఆర్ నీళ్లు పారించిండు! కేసీఆర్ కరెంటు తెచ్చిండు! కేసీఆర్ రైతుబంధు డబ్బులిచ్చిండు! లాభం మాత్రం మా ఇంటికొచ్చింది. అందుకే.. కేసీఆర్ మా బతుకు పంట’ అంటున్నరు ఇల్లందకుంట రైతులు.
ఒకప్పుడు ఈ పల్లెలన్నీ నీటి ఎద్దడితో ఇబ్బందులు పడ్డవే. ఎల్ఎండీ నుంచి కాలువల పారే నీళ్ల కోసం రైతులు కొట్టుకున్న రోజులున్నై. వారం నీళ్లొస్తే. వారం బందయ్యేది. రెండెకరాల మెట్టకు నీరు పెట్టాల్నంటే నాలుగు రోజులు పగలు, రాత్రి తిరిగేటోళ్లు. ఇప్పుడట్ల లేదు. మొక్కలకు ఎప్పుడు నీళ్లు పెట్టాలనుకొంటే అప్పుడు పెట్టొచ్చు. ఎండాకాలంలో నెలన్నర రోజులు తప్ప ఏడాదంతా కాలువ పారుతనే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యామ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోని భూగర్భ జలాలు పెరిగినయ్. రోహిణీ కార్తెల కూడా పచ్చని అరటి తోటలు ఇల్లందకుంటలో కళకళలాడుతున్నయ్. ఎండాకాలంల చెరువులు నిండుకుండల్లెక్క ఉండేసరికి బాయిల నీళ్లు చేతికందేటట్టు ఉన్నయ్! గిప్పుడు పల్లెకు పచ్చని తోటల శోభ వచ్చింది! తెలంగాణ వచ్చిన ఎనిమిదేండ్లల్లో పల్లె బతుకు ఎట్లా బాగువడ్డదో చెప్తున్నరు ఇల్లందకుంట రైతులు. వాళ్లకిప్పుడు.. నీటి కోసం రంది లేదు. పంట ఏమయితదోనన్న దిగులూ లేదు. ఉన్నదల్లా.. ఏ పంట ఏస్తే ఎక్కువ లాభమొస్తదనే ఆలోచనే!
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): హుజూరాబాద్ డివిజన్ల ఉన్న ఆరు మండలాల్లో నాలుగైదేండ్ల సంది అరటి పంట ఏస్తున్నరు. ఇందులో ఇల్లందకుంట మండలంలోనే ఎక్కువ సాగు చేస్తున్నరు. ఈ డివిజన్ల మొత్తం 80 మంది రైతులు అరటి సాగు చేస్తున్నరని వ్యవసాయశాఖ లెక్కలు చెప్తున్నయ్. తెలంగాణ వచ్చినంక సాగునీటికి ఢోకా లేదనే ధీమా ఈ ప్రాంత రైతుల ఆలోచననే మార్చింది. రైతుల కృషితో ఇప్పుడు ‘ఇల్లందకుంట అంటే అరటి పంట’ అంటున్నరు జనం!
అప్పుల తిప్పల్లేవ్
ఒక్కపాలి దుక్కి దున్ని, చదును చేసి అరటి మొక్కలు నాటితే సాలు.. ఎకరానికి నలుగురు కూలీలను పెట్టి రెండుసార్లు కలుపు తీయిస్తే మూడేండ్ల దాకా పంట తీసుకోవడమే పని! నెలకు రెండుసార్లు గెలలు కోసేప్పుడు ఎకరానికి ఇద్దరు కూలీలు అవసరం పడతరని రైతుల అనుభవాలు చెప్తున్నయ్. అరటి నాటిన మొదట రెండుసార్లు పురుగుమందు కొట్టాలే. ‘పువ్వు నుంచి గెల వస్తున్నప్పడు గెలకు పురుగు పట్టకుండా మందు కొట్టాలే. అట్లనే పాదుల ఎరువు ఎయ్యాలే. కైకిళ్లకు, పురుగుమందుల కోసం జేబుల పైసలు పెట్టాల్సిందే లేదు. అరటి పంట మీద వచ్చే పైసలతోనే అన్నీ తీరుతయ్. అప్పుల తిప్పలు తప్పి, వడ్డీల ఇబ్బందులు పోయినయ్’ అని ఇల్లందకుంట మండల అరటి రైతులు ఆనందంగా చెప్తున్నరు.
అరటి సాగుకు ‘సై’
తెలంగాణ ప్రభుత్వం ఐదేండ్ల కింద అరటి సాగుకు రాయితీలిచ్చింది. అప్పుడు ఇంతమంది రైతులు ముందుకు రాలే. అరటి సాగు ఇల్లందకుంట ప్రాంతంలో ఎప్పుడో మొదలైనా.. రాష్ట్ర ప్రభుత్వం 2020-21లో ప్రకటించిన రాయితీలతోనే ఊపందుకున్నది. 2021-22లో రాయితీలు అందుకున్న రైతుల సంఖ్య అంతకు ముందు ఏడాది కంటే 40 శాతం పెరిగింది. ‘తెలంగాణ వచ్చినంక ప్రభుత్వం సాగునీటి కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం చేసిన పనుల వల్లే మేమిట్ల సంబురంగ ఉన్నం. ఏడాదంతా నీరుండబట్టే అరటి తోట ఎయ్యడానికి ధైర్యం చేసినం. ఉచిత విద్యుత్తు, సాగునీళ్లు, మాకు లాభాల దారి చూపినయ్’ అని సీతంపేట గ్రామ అరటి రైతు శ్రీనివాస్ చెప్తున్నడు. ఆయన చెప్పినట్టే బావి, బోరు ఉన్న రైతులు అరటిసాగుకు ‘సై’ అంటున్నరు.
సాగుచేసే గ్రామం (అరటి రైతులు)
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని ఇల్లందకుంటలో ఇద్దరు రైతులు, సీతంపేట, భోగంపాడులో 12 మంది చొప్పున, సిరిసేడులో ఆరుగురు, గడ్డివానిపల్లిలో ఒకరు, మల్లనపల్లెలో ఎనిమిది మంది, బుజునూరు ఒకరు, భూపాలపల్లి జిల్లా పర్లపెల్లిలో 11 మంది, మొట్లపల్లిలో కొంత మంది రైతులు అరటి సాగు చేస్తున్నరు.
కేసీఆర్ వచ్చినంకనే
ఈ రైతు పేరు అన్నం మధుకర్రెడ్డి. భూపాలపల్లి జిల్లా పర్లపెల్లి ఆయన ఊరు. రెండెకరాల్లో అరటి సాగు చేస్తున్నడు. ‘అరటి సాగెట్లున్నది? రైతు బతుకెట్లున్నది? అని అడిగితే.. ‘బాగున్నది సారు. ఎన్నో పంటలేసి ఆగమైనం. అరటి వేసినంకనే బాగుపడుతున్నం’ అన్నడు. ‘ఆదాయమెట్లున్నది?’ అని అడిగితే.. తొవ్వపొంటి పోయే ఓ రైతు ఆగి.. ఉన్నది ఉన్నట్టు చెప్పొద్దని సైగ జేసిండు. అప్పుడందుకున్నడు మధుకర్రెడ్డి..
‘అరే ఉన్నది ఉన్నట్టు జెప్పాలే.
భయమెందుకు? ఒకలు బాగుపడుతరని భయమేంది. ఆళ్లూ రైతులే. మనమూ రైతులమే. అందరూ బాగుండాలే. అందరూ బాగుపడాలే.
నేను రెడ్డి. నాది టీఆర్ఎస్ పార్టీ సారు. కులాన్ని బట్టి, పార్టీని బట్టి మాట్లాడగూడదు. ఉన్నది ఉన్నట్టు జెప్పాలే. అంతే. అరటి పండిస్తే మొదటి ఎడాదిలనే ఎకరానికి లక్షా అరవై వేల ఆదాయం వచ్చింది. కావాల్నంటే అమ్మిన రసీదులన్నీ సూపిత్త. నాకు లాభం వచ్చిందని ఇంకెవలో అరటి పెడుతరు. గిరాకీ పోతదనే భయం లేదు. పండించుకోనీ, మేం బాగుపడ్డట్టే బాగుపడనీ’ అన్నడు.
‘తెలంగాణ వచ్చినంక ఎవుసం ఎట్లుంది?’
అంటే.. మా నాయిన ఇచ్చిన భూమిల ఒక బాయి ఉండె. నేను ఇంకోటి తవ్విచ్చిన. కొన్న భూమిల ఇంకో బాయి ఉన్నది. ఈ మూ డు బాయిల కింద ఎవుసం చేస్తున్న సారు. ఇరవై ఏండ్ల కింద ఈ బాయి కింద ఎవుసం జేయలేక అరిగోసపడ్డం. నీళ్లు లేక ఒక కష్టమైతే.. నీళ్లు ఉన్నప్పుడు పురుగులు, తెగుళ్లతోని ఆగమాగం అయినం. అదృష్టం బాగుండి పండితే రేటు లేకుండె. రైతుకు ఎన్ని బాధలు సారు? పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ ఎన్నడూ రాలే. చేసిన చాకిరంతా దండగ. ఎంతోమంది దండగలొచ్చి అప్పుల పాలైండ్రు. నాకు ఆ గతి పట్టలే. కానీ, ఎన్నడూ లాభం రాలే.
‘అరటి ఎట్ల పరిచయమైంది?’ అని అడిగితే.. పదేండ్ల కింద ఈ ఏరియాల ఆకుల రాజయ్య అనే రైతు అరటి తోట వెట్టిండు. నేనూ పెడదామనుకున్న. కానీ, అప్పుడు అంత నీటి సౌలత్ లేకుండె. నాకున్న 8 ఎకరాలల్ల రెండెకరాలు అరటి పెట్టిన. మొదటి ఏడాదిలనే ఎకరానికి లక్షా అరవై వేల రూపాయల ఆదాయం వచ్చింది. ఏది పండించినా కొనేటోడి కోసం తిరగాలె. కానీ అరటి పంటను తోటకొచ్చి కొంటున్నరు. కాళేశ్వరం నీళ్లతోని మా బావులు కళకళలాడుతున్నట్టే, మా బతుకులు కళకళలాడుతున్నయ్. మూడు, నాలుగేండ్ల సంది శానామంది రైతులు అరటి సాగు చేస్తున్నరు. ఒక్క మా ఊళ్లనే గిప్పుడు 11 మంది అరటి పండిస్తున్నరు. కాళేశ్వరం నీళ్లు, ఫ్రీ కరెంటు, రైతుబంధుతోనే రైతులిట్లున్నరు. ఈ మూడింటితోని మా రైతులకు గోస తప్పింది. కేసీఆర్ వచ్చినంకనే రెండు పంటలు పండుతున్నయ్. కేసీఆర్ నీళ్లు.. కేసీఆర్ కరెంటు.. కేసీఆర్ డబ్బులు.. పంట మాత్రం మాది. కేసీఆర్ మా బతుకు పంట! ఆరేండ్ల కింద పెద్దబిడ్డ పెండ్లి జేసిన. నిరుడు చిన్న బిడ్డ పెండ్లి జేసిన. ఇద్దరి పెండ్లికి (కల్యాణలక్ష్మి) పైసలొచ్చినయ్. నా కొడుక్కు సాఫ్ట్వేర్ కొలువొచ్చింది. ఇప్పుడు టాటా కంపెనీల కొలువు చేస్తున్నడు. మంచిగ బతుకుతున్నం సారు!
బతుకు మార్చిన పంట మార్పిడి
‘పదేండ్ల కింద మా ఊళ్లె బక్కతట్ల రాజయ్య ఒక్కడే అరటి పంట ఏసిండు. చుట్టుముట్టు ఏ ఊళ్లె అరటి పంట లేకుండె. గప్పుడు నేను గూడ ఏద్దామనుకున్న. 2012ల బాయి తవ్విన. ఒక్క పంటకే నీరందింది. ఐదేండ్ల కింద మా ఊరికి చుట్టుపక్కల పది చెక్ డ్యామ్లు కట్టిచ్చిన్రు. అవి కట్టినంక బాయి ఎండిపోలే. కాళేశ్వరం నీళ్లతోని లోయర్ మానేరు డ్యామ్ నింపుతున్నరు. ఎండాకాలం దాంక కాలువ పారింది. ఏడాదంతా బాయిల నీళ్లుంటున్నయ్. పదేండ్ల కింద ఎయ్యలేకపోయిన అరటి పంటను అయిదేండ్ల కింద పెట్టిన. నాకు ఆరోగ్యం బాగలేకుండె. ఆ ఏడు నష్టమొచ్చిందని తీసేసిన. మూడు ఎకరాలల్ల పత్తి పెట్టిన. గులాబీ రంగు పురుగొచ్చి మూడేండ్లు దండగొచ్చింది. ఏడాదికి లక్ష రూపాయలు అప్పు జేసిన. నగలు తాకట్టుపెట్టిన. పత్తి మానుకొని నిరుడు అరటి పెట్టిన. మొదటి ఏడాదే ఎకరానికి 50 వేల ఆదాయం వచ్చింది! రైతుబంధుతో లాభాల సేధ్యం చేసుకుంట గిప్పుడు కొంచెం కొంచెం అప్పులు తీరుస్తున్న.
– బక్కతట్ల రాజు, భోగంపాడు, ఇల్లందకుంట మండలం
ఇన్ని పైసలు ఎన్నడూ రాలే!
ఇంతకు ముందెన్నడూ అరటి ఎయ్యలే. ఏడాది కిందనే ఎకరం పది గుంటల భూమిల అరటి పెట్టిన. నలుగురు కూలీలతోని మొక్కలు పెట్టినం. పంట తీసినప్పుడు ఇద్దరు కూలీలుంటే సాలు. రెండు నెలల్లో రెండు సార్లు కలుపుతీయ్యించిన. ఇగ మూడేండ్ల దాక కలుపు తీశే పనేలేదు. రెండు సార్లు పురుగుమందు కొట్టిన. ఏడాదిల 14 సార్లు పంట తీసినం. 20 టన్నులకు ఎక్కువే దిగుబడొచ్చింది. ఎకరంబావు భూమిల ఏడాదిలనే లక్షా ఇరవై వేల రూపాయల ఆదాయం అచ్చింది. ఇన్ని పైసలు ఎన్నడూ రాలే.
– పోశమల్లు, అరటి రైతు, సీతంపేట
లక్ష గ్యారంటీ!
అరటి ఎకరానికి 20 టన్నుల సగటు దిగుబడి వస్తుంది. ఇప్పటి మార్కెట్ ధరలతో చూస్తే ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం వస్తున్నది. కిలోకు ధర రూ.10 ఉన్నా ఆదాయం బాగుంటది. రూ.7 ఉన్నా ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తది. ధర అంతకంటే తగ్గితేనే నష్టాలొస్తయ్. ఐదేండ్ల కింద తెలంగాణ ప్రభుత్వం రాయితీలిచ్చినప్పుడు 40 ఎకరాల వరకు అరటి సాగు అయ్యింది. అరటి సాగుకోసం హెక్టారుకు రూ.40 వేలు (ఒక రైతుకు గరిష్ఠంగా) ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. పోయిన ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అరటి సాగు 40 శాతం పెరిగింది. అరటిలో పసుపు, అల్లం అంతరపంటగా సాగు చేసుకోవచ్చు. అరటి నాటిన కొత్తలో మూడు, నాలుగు నెలలకే కాపుకొచ్చే పెసర, మినుము వంటివి అంతర పంటగా సాగుచేస్తే లాభాలు రెట్టింపవుతయ్.
– బీ మంజుల, ఉద్యానవవన శాఖ అధికారి, హుజూరాబాద్ డివిజన్