హైదరాబాద్, ఆగస్టు 26, (నమస్తే తెలంగాణ): ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా ట్రాఫిక్ చలాన్లను ఆటో డెబిట్ విధానంలో వసూలు చేయాలని యోచించడం రాజ్యాంగ విరుద్ధమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ నిబంధనల అమలు ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, చట్టబద్ధమైన ప్రక్రియలను పక్కన పెట్టి పౌరుల ఖాతాల నుంచి తీసుకోవడం సమర్థనీయం కాదని తెలిపారు. చలాన్ అనేది కేవలం ఒక ఆరోపణ మాత్రమే తప్ప, నేర నిర్ధారణ కాదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడికీ వివరణ ఇచ్చే, అప్పీల్ చేసుకొనే, కోర్టును ఆశ్రయించే ప్రాథమిక హకులు ఉంటాయని ఆయన గుర్తుచేశారు. నేరం రుజువు కాకముందే శిక్ష విధించే విధానం ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాసినట్టేనని మండిపడ్డారు.
ఆర్టికల్ 21, 300 ఏ ఉల్లంఘన
భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఆర్టికల్ 21 (జీవన హకు), ఆర్టికల్ 300 ఏ(ఆస్తి హకు)లను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నదని శ్రవణ్ పేర్కొన్నారు. ప్రజల ఖాతాల్లో ఉన్న సొమ్ము వారి వ్యక్తిగత ఆస్తి అని, కోర్టు ఆదేశాలు, స్పష్టమైన చట్టబద్ధత లేకుండా ప్రభుత్వం ఆ డబ్బును స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఆర్బీఐ నిబంధనలు, బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఖాతాదారుడి స్పష్టమైన అనుమతి లేదా కోర్టు ఆదేశం లేకుండా డబ్బును డెబిట్ చేయడం ముమ్మాటికీ అక్రమమని తెలిపారు. సుప్రీంకోర్టు పుట్టస్వామి తీర్పు ప్రకారం గోప్యతా హకుకు కూడా ఇది భంగం కలిగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 200 ప్రకారం చలాన్ చెల్లించాలా?, కోర్టులో సవాలు చేయా? అనే హకు పౌరుడిదేనని పునరుద్ఘాటించారు. ఆటో డెబిట్ విధానాన్ని అమలు చేస్తే అది ఒక అధికారిక దోపిడీ(లైసెన్స్డ్ ఎక్స్టార్షన్)గా మారే ప్రమాదం ఉన్నదని తెలిపారు. ఈ దుర్మార్గమైన ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చండి
2027 జాతీయ జనగణనలో కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, ప్రశ్నావళిలోని 10వ ప్రశ్నను సవరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్షాకు బుధవారం ఆయన ఒక లేఖ రాశారు. ఆగస్టు 14న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో 10వ ప్రశ్నను ‘షెడ్యూల్డ్ క్యాస్ట్/షెడ్యూల్డ్ ట్రైబ్/క్యాస్ట్ ’ అని ఓపెన్ ఎండెడ్గా రూపొందించడంతో ఓబీసీల కచ్చితమైన వివరాల సేకరణపై అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ కేటగిరీని స్పష్టంగా చేర్చి, ఓసీలు, ఓబీసీలతో కూడిన సమగ్ర కులాల జాబితాను రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రామాణిక కోడింగ్ విధానాలు అమలు చేయాలి
ఓబీసీ/బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జాబితాల ఆధారంగా డిజిటల్ డ్రాప్ డౌన్, ప్రామాణిక కోడింగ్ విధానాన్ని అమలు చేయాలని దాసోజు సూచించారు. ప్రాంతీయ మాండలికాలు, ఉపకులాల నమోదుపై మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. సరైన సాంకేతిక విధానాలు పాటించకపోతే ప్రస్తుతం కేటాయిస్తున్న రూ.11,718 కోట్ల ప్రజాధనం నిరూపయోగంగా మారే ప్రమాదం ఉన్నదని ఆం దోళన వ్యక్తంచేశారు. 2021లో కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్కు విరుద్ధంగా ప్రస్తుత విధానం ఉండకూడదని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం జరగాలంటే శాస్త్రీయంగా కచ్చితమైన కుల గణాంకాలు సేకరించడం అత్యంత అవసరమని శ్రవణ్ స్పష్టంచేశారు.