హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా వ్యాపార మండలి ఆసక్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించేందుకు ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ బృందం మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నది. కౌన్సిల్ చైర్పర్సన్ జోడీ మెక్కాక్ నేతృత్వంలోని ఈ బృందం పరిశ్రమల భవన్లో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో సమావేశమైంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న ప్రోత్సాహకాలపై ఈ భేటీలో చర్చించారు. తెలంగాణలో ఇప్పటికే జపాన్, కొరియా, అమెరికా, తైవాన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందిన ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులు పెట్టాయని బాలమల్లు వారికి వివరించారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని, అందులో భాగంగా పెట్టుబడిదారులకు సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎర్రతివాచీ పరుస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఆస్ట్రేలియా బిజినెస్ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి, అర్షనపల్లి రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.