సిద్దిపేట : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రైతులకు ఓ వరం. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రైతుల దశ, దిశ మార్చి కొత్త రూపునిచ్చారు. ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) కమిటీదే. ఆత్మ కమిటీ రైతు సేవకే పునరంకితం కావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు.
సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో శుక్రవారం ఆత్మ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఆత్మ కమిటీ ఛైర్మన్గా లక్కరసు ప్రభాకర్ వర్మ, 24 మంది కమిటీ మెంబర్లు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఆత్మ పథకం రైతులకు అభివృద్ధి, శిక్షణ, నూతన ప్రదర్శన క్షేత్రాలు వంటి కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
సమైక్య రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు, కరెంట్ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి హరీష్ రావు చెప్పారు. రైతులు ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేసేవారని, ఇప్పుడు అలాంటి సమస్యలు లేవన్నారు. ఈ యేడు 60 లక్షల 83 వేల 793 మంది రైతులకు రూ.7300 కోట్లు పెట్టుబడి సాయం కింద బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. గతేడాది రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా, పంజాబ్ రాష్ట్రంలో 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది. ధాన్యపు రాశులను దేశానికే తెలంగాణ రాష్ట్రం అందించింది అని స్పష్టం చేశారు.
తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రతి ఏటా రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రైతుబంధు కోసం రూ. 15 వేల కోట్లు, రైతుభీమా కోసం రూ. 13 వేల కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. ఏడేండ్లలో తెలంగాణలో ఆశ్చర్యపోయే పని జరిగిందని, ఈ యేడు 90 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది అని మంత్రి పేర్కొన్నారు.
రైతులను పామాయిల్, సెరికల్చర్ సాగువైపు మళ్లించేలా రైతులను చైతన్య పరచాలని హరీష్ రావు సూచించారు. భవిష్యత్లో రైతులకు అధిక ఆదాయాలు ఆర్జించేందుకు పంట మార్పిడి తప్పదన్నారు. వరి వెదసాగు, మల్బరీ సాగు, ఆయిల్ ఫామ్ తోటలు విరివిగా పెంచేలా రైతన్నలకు ఆధునిక పద్ధతుల గురించి అవగాహన కల్పించాల్సిన పెద్ద బాధ్యత ఆత్మ కమిటీ పై ఉన్నది. జిల్లాలో 50 వేల ఎకరాల్లో పామాయిల్, విత్తన సాగు చేసేలా రైతులను ఆత్మ కమిటీ ప్రోత్సహించాలి అని సూచించారు. రైతులకు బ్యాంకుల్లో అప్పులు కాదు.. నిల్వ ఉండేలా రైతు శ్రేయస్సుకై ఆత్మ కమిటీ, రైతుబంధు సమితి నాయకులు కృషి చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.