ఆర్మూర్, జూన్ 7: బీజేపీ ఎంపీ అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్లు రాకుండా ఓడిస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వెద గ్రామానికి చెందిన 500 మందికిపైగా యువకులు, గ్రామస్థులు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం జీవన్రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ అడ్డగోలుగా వాగితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. దమ్ముంటే ఆర్మూర్ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎంపీ అర్వింద్ నాలుగేండ్లుగా ముఖం చాటేసి ఇప్పుడు ఆర్మూర్కు వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఆర్మూర్లో అర్వింద్ చేసింది రోడ్ షో కాదని, మ్యాడ్ షో, అదొక బ్యాడ్ షో అని ఆయన పేర్కొన్నారు.