హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా జీ అనుపమ చక్రవర్తి గురువారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఉన్న ఆమెను రిజిస్ట్రార్ జనరల్గా హైకోర్టు బదిలీ చేసింది. ఇప్పటివరకు రిజిస్ట్రార్ జనరల్గా ఉన్న ఏ వెంకటేశ్వర్రెడ్డి (ఈయనను హైకోర్టు న్యాయమూర్తిగా చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది) హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బదిలీఅయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జీవీ సుబ్రహ్మణ్యం హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. ఈ పదవిలో ఉన్న డీ నాగార్జున్ హైదరాబాద్లోని మహిళలపై అత్యాచారాల నిరోధక కేసుల ప్రత్యేక సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. హైకోర్టు ఐటీ రిజిస్ట్రార్గా ఉన్న డీ రమాకాంత్ మహబూబ్నగర్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల విచారణ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యారు. సిద్దిపేటలో సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణ చౌహాన్ హైకోర్టు ఐటీ రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న టీ మాధవికి తాత్కాలికంగా సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి కల్పించి హైదరాబాద్లోని 13వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్గా హైకోర్టు బదిలీ చేసింది. ఈ ఉత్తర్వులను గురువారం రాత్రి హైకోర్టు వెలువరించింది.