Telangana | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): దశాబ్దాల చీకట్లను చీల్చుకుని తెలంగాణ వెలుగుల వైపు పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధిస్తే పరిపాలనే చేతకాదన్నోళ్లకు సుపరిపాలన అంటే ఎట్లుంటదో ప్రత్యక్షంగా చూపిస్తున్నది. ‘ఆర్థికమంటే వాళ్లకేం తెలుసు’ అన్నోళ్లకే ఆర్థిక పాఠాలు బోధించే స్థాయికి ఎదిగింది. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ఆర్థిక సంవత్సరం (2014-15)లోని మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్-జూలై మధ్య కాలంలో) రూ.6,562 కోట్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రాబడి.. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లోని తొలి నాలుగు నెలల్లో రూ.67,494 కోట్లకు పెరిగింది. అంటే కేవలం పదేండ్లలోనే రాష్ట్ర రాబడి 10 రెట్లు వృద్ధి చెందింది. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ వృద్ధిరేటు నమోదు కాలేదు. దీంతో తెలంగాణ ఆర్థిక ప్రగతిని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తన తాజా నివేదికలో కొనియాడింది.
నాలుగు నెలల్లో 26 శాతం రాబడి
2014-15 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.97,563 కోట్ల రాబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా.. తొలి నాలుగు నెలల్లో (జూలై వరకు) రూ.6,562 కోట్లు వచ్చింది. ఇది మొత్తం అంచనాలో 6.73 శాతం మాత్రమే. దీంతో రాబడిని పెంచుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగా పలు సంస్కరణలు ప్రవేశపెట్టింది. వాటి ఫలితం మరుసటి సంవత్సరంలోనే కనిపించింది. 2015-16లో మొత్తంగా రూ.1,11,974 కోట్ల రాబడి వస్తుందని రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేసిన ప్రభుత్వం.. తొలి 4 నెలల్లోనే రూ.25,211 కోట్ల రాబడి సాధించింది. ఇది బడ్జెట్ అంచనాలో 22.52 శాతానికి సమానం. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన రాబడి కంటే మూడు రెట్లు (రూ.18,649 కోట్లు) అధికం. ఆ తర్వాత ఆర్థికంలో తెలంగాణ ఎన్నడూ వెనకడుగు వేయలేదు. చివరికి కొవిడ్ సంక్షోభంతో ప్రపంచమంతా కుదేలైనా రాష్ట్ర రాబడి ఆశాజనకంగానే ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.2,59,861 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలి నాలుగు నెలల్లో రూ.67,494 కోట్ల రాబడి సాధించింది. ఇది మొత్తం అంచనాలో దాదాపు 26 శాతానికి సమానం.
రాష్ట్ర రాబడిలో జీఎస్టీ కీలకం
తెలంగాణ రాబడిలో సింహభాగం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల ద్వారానే వస్తుస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై వరకూ వచ్చిన మొత్తం రూ.67,494 కోట్ల రాబడిలో జీఎస్టీ వాటా రూ.15,224 కోట్లుగా ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపేణా మొత్తం రూ.50,942 కోట్లు రావచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా.. తొలి నాలుగు నెలల్లోనే 30 శాతం రాబడి సమకూరింది. ఆ తర్వాత అమ్మకం పన్ను రూపంలో రూ.10,171 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూపేణా రూ.6,074 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4,686 కోట్లు, కేంద్ర పన్నుల వాటా కింద రూ.4,026 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ.2,317 కోట్లు, పన్నేత రాబడి కింద రూ.1,815 కోట్లు సమకూరాయి.