బెజ్జంకి/వీణవంక, మార్చి 27: ఓ వైఫు సాగునీళ్లు లేక చేతికందే దశలో పంటలు ఎండిపోయి.. మరోవైపు అకాల వర్షంతో ఉన్న కాసి న్ని పంటలు దెబ్బతిని రైతులు అవస్థలు పడుతుంటే బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించాలని రైతులను వేధిస్తున్నారని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను బ్యాంకర్లు అప్పులు అడగకుండా జీవో జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బుధవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మం డలం లక్ష్మీపూర్లో నీళ్లులేక ఎండిన, అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వెంటనే రూ.2 లక్షల రుణమాఫీని ప్రకటించాలని కోరారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాపర్ డ్యాం నిర్మించినట్లయితే రాష్ట్రంలో కరువు వచ్చే పరిస్థితి వచ్చేది కాదని, ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం కుట్రపూరితంగా మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేపట్టకుండా బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని పంటలకు సాగునీరందించి కాపాడే అవకాశం ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ మోటర్లు, ట్రా న్స్ఫార్మర్లు కాలే పరిస్థితి మొదలైందని, గ్రామా ల్లో మళ్లీ మోటర్ వైండింగ్ దుకాణాలు తిరిగి ప్రారంభమయ్యాయని చెప్పారు.
కాగా.. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ఓ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హాజరై వస్తుండగా బస్టాండ్ ఆవరణలో మోటర్ వైండింగ్ చేస్తున్న శ్రీనివాస్ కనిపించాడు. దీంతో వినోద్కుమార్ శ్రీనివాస్ వద్దకు వెళ్లి మాట్లాడారు. గతంలో మోటర్లు ఎన్ని కాలేది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని మోటర్లు కాలుతున్నాయి? అని అడగగా.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాణ్యమైన కరెంట్ రావ డం వల్ల మోటర్లు కాలకపోయేదని, మొన్నటి సంది మోటర్లు చాలా కాలిపోయి రిపేర్కు వస్తున్నాయని శ్రీనివాస్ బదులిచ్చాడు.
‘కాంగ్రెస్కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంట’
కోటి ఆశలతో యాసంగి పంట సాగు చేస్తే నిరాశే ఎదురైంది. కేసీఆర్ సార్ పాలనలో పదేండ్లుగా పంటలు సాగు చేసిన. అట్లనే ఉంటదని యాసంగికి నారు పోసిన. డిసెంబర్లో డీబీఎం 38 కాల్వ ద్వారా నీళ్లొత్తున్నాయని మూడు ఎకరాల్ల వరి వేసిన. 3 బస్తాలు వరి నారు అలికిన. జనవరిలో 10 రోజులపాటు మళ్ల నీళ్లొత్తున్నాయని నాట్లేసిన. కూలీలు దొరక్కున్నా అప్పు చేసి ఎక్కువిచ్చి పంటలు సాగు చేసిన.
కాల్వ నీళ్లు రాకపోవడంతో బాయి నీళ్లు పొలానికి పెట్టిన. బాయిల కూడ నీరు అడుగంటింది. వరి పంట పొట్ట దశకు చేరినంక నీరులేక మొత్తం ఎండిపోయింది. రూ.78 వేల పెట్టుబడి బూడిదిల పోసినట్లయ్యింది. పదేండ్లుగా కాల్వలొస్తాంటే రెండు పంటలు పండించిన. అదే ఆశతో యాసంగి సాగు చేస్తే పంట ఎండిపోయింది. కేసీఆర్ సార్కు రైతు బాధలు తెలుసు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు నాకు నేను చెప్పుతో కొట్టుకుంటూ శిక్ష వేసుకుంటున్న. రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే దిక్కు.
– వెన్నల శ్యాం, రైతు, రేగొండ