నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 5: పదోతరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాత్రపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రశ్న పత్రాలను లీక్ చేసి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని బీఆర్ఎస్తోపాటు వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన నిర్వాకాన్ని నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బండి దిష్టిబొమ్మలను దహనం చేశారు. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న బండికి వారి ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి బండి దిష్టిబొమ్మను దహనం చేశారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో బండి సంజయ్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. మంచిర్యాలతోపాటు మందమర్రి, కోటపల్లి మండలం నాగంపేట, కాగజ్నగర్లో బండి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆసిఫాబాద్లో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఖానాపూర్లో ఎమ్మెల్యే రేఖానాయక్ తదితరులు బండి వ్యవహారంపై మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఖమ్మం నగరంతోపాటు సత్తుపల్లి, వైరా, వేంసూరు, అశ్వారావుపేటలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు ఆర్మూర్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. సిద్దిపేటలోని పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యువత ఆధ్వర్యంలో బండి సంజయ్ ఫ్లెక్సీకి చెప్పుల దండ వేసి ర్యాలీ నిర్వహించి, ఆపై దహనం చేశారు.
నిజామాబాద్ నగరంలో పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోరం ప్రతినిధులు బీజేపీ నేత బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బండి సంజయ్ పేపర్ లీక్ చేసే నీచానికి దిగజారడం దారుణమన్నారు. పిల్లల జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. బండి సంజయ్ 5 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేయడం క్షమించారని నేరమని అన్నారు. ఈ కేసులో బండితోపాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.