హైదరాబాద్: తెలంగాణ మూడో శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. సభలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత శాసనసభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీదర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరయ్యారు.
స్పీకర్ ఎంపికకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ను పార్టీ అధిష్ఠానం ఇప్పటికే స్పీకర్గా నిర్ణయించింది. ఈనేపథ్యంలో ఆయన ఎంపిక నామమాత్రమే కానుంది. కాగా, సాధారణంగా సభలో సీనియర్ అయిన సభ్యుడు ప్రొటెం స్పీకర్గా వ్యవహరిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.