Sampath Kumar | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా తానే అన్నివిధాలా అర్హుడినని, తక్షణమే జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి లేఖ రాశారు. వాస్తవాలను దాచిపెట్టి తనకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మాదిగ ఉపకులానికి చెందిన తానే నాగర్కర్నూల్ స్థానానికి అన్ని అంశాల్లో అర్హత కలిగిన, గెలవగల అభ్యర్థినని వివరించారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 17,30,781 మంది కాగా అందులో మాదిగ ఓటర్లు 3,75,532, మాల ఓటర్లు 62,801 మంది ఉన్నారని వివరించారు.
ఖమ్మం నాయకులు, ఏఐసీసీ నాయకులు కలిసి వాస్తవాలను అణచిపెట్టి, అదే నియోజకవర్గంలో నాలుగుసార్లు ఓడిపోయిన, మాల కులానికి చెందిన మల్లు రవి పేరును ఖరారు చేశారని, హార్డ్కోర్ కార్యకర్తనైన తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మల్లు రవికి ఇదివరకే ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ హోదా కల్పించారని గుర్తుచేశారు. తాను ఇన్చార్జి సెక్రటరీగా మహారాష్ట్ర స్రీనింగ్ కమిటీ సమావేశాల్లో బిజీగా ఉన్న సమయంలో మల్లు రవి పేరును సీఈసీకి ప్రతిపాదించారని పేర్కొన్నారు.