Social media | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : స్మార్ట్ఫోన్ వచ్చిన తర్వాత కంటికి కనిపించని నేరాలు విస్తృతంగా పెరిగాయి. బాధితులతోనే బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పిస్తూ.. ఏటేటా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్దొంగలు. వారి ప్రకటనలకు ఆకర్షితులైనా, వారు పంపిన లింక్లపై క్లిక్ చేసినా, కస్టమర్ కేర్ పేరుతో ఫోన్ చేసినప్పుడు ఎత్తి మాట్లాడినా.. ముగ్గులోకి దింపుతారు. తర్వాత సర్వం దోచేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 22వరకు తెలంగాణలో టాప్-10 సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం.
2023 జనవరి 1 నుంచి ఏప్రిల్ 22 వరకు టాప్ టెన్ సైబర్మోసాల్లో బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ మొదటిస్థానంలో ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్పి, తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే పదింతల లాభాలు అంటూ ప్రచారం చేస్తున్నారు సైబర్నేరగాళ్లు. మొదట రూ.వెయ్యితోనే ఇన్వెస్ట్ చేయించి, దానికి రూ.10 వేలు వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ సమయంలో అత్యాశకుపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు పెట్టిన డబ్బులు వసూలు చేసుకునేందుకు కొత్త టార్గెట్లు పెడతారు. ఆ టార్గెట్ కూడా లక్షల్లో ఉంటుంది. అంత డబ్బు పెట్టిన తర్వాత మీకు కేటాయించిన అకౌంట్ బ్లాక్ అవుతుంది. అప్పటికీ కూడా తేరుకోకపోతే.. ఆ బ్లాక్ అయిన అకౌంట్ను యాక్టివేట్ చేయించేందుకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు మాయగాళ్లు. ఈ మూడు నెలల వ్యవధిలోనే తెలంగాణ వ్యాప్తంగా ఇట్లాంటి కేసులు 3,743 నమోదయ్యాయి.
సైబర్మోసాల్లో అమ్మాయి లేదా అబ్బాయి పేరిట నమ్మించి వంచించటం సర్వసాధారణమైంది. మ్యాట్రిమోనియల్ సైట్స్ నుంచి అమ్మాయిలు, అబ్బాయిల వివరాలు సేకరించి, వారి ప్రొఫైల్స్ను అధ్యయనం చేసి, తమని తాము డబ్బున్నవారిగా పరిచయం చేసుకుంటారు. మెల్లిగా మాయమాటలు చెప్పి.. పర్సనల్ ఫొటోలు, వీడియోలు సేకరించి ఆనక డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మనకు పరిచయం లేని వ్యక్తులు మన వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతున్నారంటే జాగ్రత్త వహించాలంటున్నారు సైబర్నిపుణులు. ఇట్లాంటి మో సాలు ఈ మూడు నెల ల్లో సుమారు 1,982 నమోదు అయ్యాయి.
చాలా మంది అమాయకులు గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర ఈ-కామర్స్ వెబ్సైట్స్కు సంబంధించిన కస్టమర్కేర్ నంబర్లను సెర్చ్ చేస్తుంటారు. ఇలా ఎవరైనా గూగుల్లో వెతికిన వెంటనే కాల్ చేసి, వారు వెతికిన సర్వీస్ ప్రొవైడర్గా పరిచయం చేసుకుంటారు. సమస్య పూర్తిగా తెలుసుకున్న తర్వాత.. పరిష్కారం కోసం తమదైన శైలిలో మాటల్లో పెడతారు. సర్వీసుచార్జీ కొంత చెల్లించాలనో, బ్యాంకు సమాచారమైతే అకౌంట్ డీటైల్స్, ఓటీపీలు వారితోనే చెప్పిస్తూ.. డబ్బులు దండుకుంటారు. ఈ తరహా కేసులు 1,902 నమోదు అయ్యాయి.
ఈ మధ్య ఈ తరహా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు అవినీతిపరులైన కొందరు బ్యాంకు సిబ్బంది నుంచి క్రెడిట్ కార్డుల దరఖాస్తు వివరాలు సేకరించి.. జారీకి సిద్ధంగా ఉన్న క్రెడిడ్కార్డుల వివరాలతో వినియోగదారులకు కాల్ చేస్తారు. తమని తాము బ్యాంకు సర్వీసుప్రొవైడర్లుగా నమ్మిస్తారు. ఆ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేసి, వినియోగదారునితోనే ఓటీపీలు చెప్పించి, కార్డు అతని చేతికి వెళ్లకమునుపే అందులోని డబ్బులను కాజేస్తున్నారు. ఈ తరహా కేసులు కూడా 1,544 నమోదు అయ్యాయి.
ఈ తరహా మోసాన్ని ప్రత్యేకంగా మధ్య తరగతి ప్రజలపై ప్రయోగిస్తున్నారు సైబర్ దొంగలు. ఉద్యోగాలు చేసేవారికి, ఇంట్లో ఖాళీగా ఉండేవారికి, చేతివృత్తులు చేసుకునేవారికి ఇంట్లో నుంచే పనిచేసుకునే పార్ట్టైమ్ జాబ్స్ ఉన్నాయని సోషల్ మీడియాల్లో ప్రకటనలతో ఊదరగొడుతున్నారు. ఆ ప్రకటనలకు ఆకర్షితులైతే మోసాలకు తాళం చెవి ఇచ్చినట్టే. మొదట యూట్యూబ్ క్లిక్ పేరిట కొంత అమౌంట్ ఇప్పిస్తారు. తర్వాత కొంత డిపాజిట్ చేయమంటారు. అందుకు ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసి, డబ్బులు వేస్తారు. వాటిని విత్ డ్రా చేసుకోవాలంటే కొంత ఇన్వెస్ట్ చేయాలి. అందుకు టార్గెట్ పెట్టి మనతోనే ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టించి ఆ ఆన్లైన అకౌంట్ను బ్లాక్ చేస్తారు. దానిని యాక్టివ్చేయడానికీ డబ్బులు వసూలు చేస్తారు. మన అకౌంట్లో నగదును క్రిప్టోగా మార్చుకొని కొత్త ఎరతో మరో అమాయకుడి కోసం ఎదురు చూస్తుంటారు. ఈ తరహా కేసులు తెలంగాణలో 1,079 నమోదయ్యాయి.
ఓఎల్ఎక్స్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్లలో తక్కువ రేటుకే మేలైన వస్తువులు ఉన్నాయని, వాటిని విక్రయిస్తామని యాడ్స్తో ప్రచారం చేస్తారు. ఎవరైనా అమయాకులు వారిని సంప్రదిస్తే.. డబ్బులు ముందుగా చెల్లించమని, ఆ తర్వాత లావాదేవీలో సమస్యలున్నాయని కథలు చెప్తూ.. మరింత డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి కేసులు 872 నమోదయ్యాయి.
ఈ మధ్య సోషల్ మీడియాలో సమాజంలో పేరున్న వ్యక్తులు, ప్రముఖుల పేరిట, ఆఖరికి పోలీసు ఉన్నతాధికారుల పేరిట కూడా నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆ నకిలీ ఖాతాల నుంచి రిక్వెస్టులు పంపి.. ఆనక అత్యవసరం అని, యాక్సిడెంట్ అయిందని, వెంటనే డబ్బులు కావాలని.. సాయంత్రమే తిరిగి ఇస్తానని మెసేజ్లు చేస్తారు. తెలిసిన ప్రముఖులు డబ్బులు అడిగితే కాదనలేరు కాబట్టి.. నిజమే అనుకొని వారు అడిగినంత నగదు వారిచ్చిన ఫోన్ నంబర్కు బదిలీ చేస్తారు. ఇలాంటి నకిలీ ఖాతాలు ఈ మధ్య బాగా పెరిగాయి. ఈ తరహా కేసులు 833 నమోదయ్యాయి.
సోషల్ మీడియాలో ఎక్కువగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. తక్కువ వడ్డీకే పర్సనల్, కారు, హోమ్లోన్లు ఇప్పిస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు సైబర్ దొంగలు. డబ్బు అవసరం ఉన్నవారు వారిని సంప్రదించగానే.. వివరాలు వారితోనే చెప్పించి, ఇచ్చిన అకౌంట్లో ఉన్న మొత్తాన్ని స్వాహా చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు సంబంధించి ఈ ఏడాది 1,220 కేసులు నమోదయ్యాయి.
తక్కువ వడ్డీకే లోన్లు ఇప్పిస్తామని బల్క్గా వాయిస్ స్మిషింగ్లు పంపుతారు. ఇవి ఎక్కువగా వాట్సాప్ వంటి మాధ్యమాల్లో కనిపిస్తాయి. ఒక వాయిస్తో పాటు, కింద మెసేజ్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేశామంటే.. ఆర్థికంగా మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా మోసాలు 1,148 నమోదయ్యాయి.
క్రెడిట్, డెబిట్, ఆధార్ కార్డులు పాన్కార్డు లింకు చేసుకోవాలని కొందరి కస్టమర్లను టార్గెట్ చేసి, వారందరికీ బల్క్గా షిషింగ్ ఎస్ఎంఎస్లు పంపుతారు. ఈ మెసేజ్ల కింద బ్లూ కలర్లో ఓ లింక్ ఉంటుంది. ఆ లింక్ను క్లిక్ చేసి, పాన్కార్డును లింక్ చేసుకోవాలని రిక్వెస్టులు పంపుతారు. పొరపాటున ఎవరైనా ఆ ఫిషింగ్ లింకులు క్లిక్ చేస్తే.. మన బ్యాంకు ఖాతాల వివరాలు తెలిసిపోతాయి. ఒక్కోసారి వైరస్ చొప్పించి ఫోన్ను హ్యాక్ చేస్తారు. పాన్కార్డు లింకేజీ సర్వీసు పేరుచెప్పి తక్కువమొత్తంలో చార్జీలు చూపించి.. ఓటీపీ ద్వారా ఎక్కువ మొత్తంలో దోచుకుంటారు. ఇలాంటి కేసులు తెలంగాణలో 1,157 నమోదయ్యాయి.
స్మార్ట్ఫోన్ వాడుతున్న ప్రతీ ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి. ఫోన్ను ఎలా వాడుతున్నాం? ఏం చూస్తున్నాం? ఏ లింక్స్ను క్లిక్ చేస్తున్నాం? అవి మనకు ఎలా ఉపయోగ పడతాయి? ఒకడు డబ్బులు అడిగితే గుడ్డిగా ఎందుకు పంపాలి? అనే విషయాలపై సరైన స్పష్టత అవసరం. చాలా మందికి సైబర్ నేరానికి గురైతే 1930 హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేయాలని తెలియదు. సైబర్ నేరాలపై అవగాహనే ఆయుధం. కంటికి కనిపించి ఇలాంటి మోసాలపై ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సేఫ్గా ఉంటారు. ఏ రూపంలోనైనా సైబర్ నేరాలకు గురైనా వెంటనే 1930కి కాల్ చేయాలి, లేదంటే https://cybercrime.gov.in/లో ఫిర్యాదు చేయాలి. అలా చేస్తే మీ డబ్బు సైబర్ నేరగాళ్లకు చేరకుండా పోలీసులు అడ్డుకుంటారు.
– అనిల్ రాచమల్ల, సైబర్ నిపుణుడు, ఎండ్నౌ ఫౌండేషన్