చిక్కడపల్లి, జనవరి 18: రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులందరూ ఈ-శ్రమ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కార్మికశాఖ అదనపు కమిషనర్ డాక్టర్ గంగాధర్ సూచించారు. ఇప్పటివరకు 40 లక్షల మంది పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. బుధవారం ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.
18 నుంచి 59 ఏండ్లు ఉండి, ఆదాయం పన్ను పరిధిలోకి రానివారు, పీఎఫ్, ఈఎస్ఐ లేని ప్రతి అసంఘటిత రంగ కార్మికుడు ఈ-శ్రమ్లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. తద్వారా ప్రమాద బీమా కింద రూ.2 లక్షలతోపాటు ఇతర ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి భవన నిర్మాణ కార్మికులకు మాస్టర్హెల్త్ చెకప్ నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్మికులు పనిచేసే చోటకు వైద్య బృందం చేరుకొని బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలతోపాటు పూర్తి బాడీచెకప్ చేస్తుందని పేర్కొన్నారు.