బెల్లంపల్లిరూరల్, డిసెంబర్ 12: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) ఎల్తూరి సురేఖ.. తన పరిధిలోని 13 మంది ఉద్యోగుల వేతనాలను ప్రాసెస్ చేయాలని మంగళవారం సబ్ట్రెజరీ కార్యాలయంలో నేలపై కూర్చొ ని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ ఉద్యోగులు, సిబ్బందికి వేతనాల బిల్లులను ఆమోదించకుండా సబ్ట్రెజరీ కార్యాలయ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి నెలా తన పరిధిలోని 13 మంది ఉద్యోగుల వేతనాల నివేదికలను తయారు చేసి సబ్ట్రెజరీ కార్యాలయంలో సమర్పిస్తానని, నవంబర్ వేతనాల నివేదికను కూడా గత నెల 20న అందజేసినా ఇప్పటి వరకు వాటిని పరిశీలించలేదని చెప్పారు. వేతనాల బిల్లుల విషయంలో కార్యాలయ ఎస్టీవో, ఏటీవోలు తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇదేమని అడిగితే సంబంధిత పేపర్లు తన ముఖం మీద విసిరేశారని వాపోయారు. ఈ విషయమై స్థానిక మీడియా ప్రతినిధులకు సమాచారం ఇవ్వడంతో సబ్ట్రెజరీ అధికారులు ఆగమేఘాల మీద వ్యవసాయ ఉద్యోగుల వేతనాల బిల్లులను పాస్చేశారు. గతంలో కూడా సబ్ట్రెజరీ అధికారులు ఇలాగే వ్యవహరించారని ఏడీఏ సురేఖ జిల్లా ట్రెజరీ అధికారికి ఫిర్యాదు చేశారు.