కొంతమంది విమర్శ, మరికొందరు సమర్థన
హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘విరాటపర్వం’ సినిమా హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. ఆమె వ్యాఖ్యలను కొంతమంది విమర్శిస్తున్నా, మరికొందరు సమర్థిస్తున్నారు. “కశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో పండిట్స్ను ఎలా దారుణంగా చంపారో చూపించారు. కొద్ది నెలల క్రితం గోవులను రవాణా చేస్తున్నాడని ఓ డ్రైవర్ను తీవ్రంగా కొట్టడంతో పాటు జై శ్రీరామ్ అనాలని బలవంతం చేశారు. మత సంఘర్షణ కోణంలో చూస్తే ఈ రెండు సంఘటనలకు తేడా ఏమీ లేదు’ అని సాయిపల్లవి ఇంటర్వ్యూలో పేర్కొన్నది.
ఇదిలావుండగా, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సాయిపల్లవిపై అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ప్రతినిధులు, బజరంగ్దళ్ నాయకులు సైదాబాద్, సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సాయిపల్లవిని అరాచక శక్తులు బెదిరిస్తూ, ఆమెపై అక్రమ కేసులు బనాయించడాన్ని కుల వివక్షత వ్యతిరేక పోరాట కమిటీ (కేవీపీఎస్) ఖండించింది. ఆమెపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ, ప్రధానకార్యదర్శి టీ స్కైలాబ్ డిమాండ్ చేశారు.