యాదగిరిగుట్ట, అక్టోబర్31: సిరిసిల్ల చేనేత కార్మికుడు తను తయారు చేసిన బంగారు పట్టు చీరను యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామికి సమర్పించారు. మంగళవారం చేనేత కార్మికుడు విజయ్ అగ్గిపెట్టెలో ఒదిగిన బంగారు పట్టుచీర, స్వామివారికి పట్టుశాలువాను ఆలయ ఏఈవో రఘుకు అందజేశారు. స్వయంభూ నారసింహస్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన అనంతరం విజయ్ మాట్లాడుతూ.. తన తండ్రి నల్ల పరంధామయ్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని చేనేత రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించినట్టు చెప్పారు.
2 గ్రాముల బంగారాన్ని వినియోగించి 15 రోజుల పాటు శ్రమించి అగ్గిపెట్టెలో పొదిగే పట్టుచీరను తయారు చేశానని తెలిపారు. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి, తిరుమల శ్రీవారికి అగ్గిపెట్టెలో పొదిగిన వస్ర్తాలను బహూకరించినట్టు వెల్లడించారు. సీఎం కేసీఆర్.. స్వామివారి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని, ఈ నేపథ్యంలో స్వామి, అమ్మవార్లకు స్వయంగా నేసిన పట్టుచీరను బహూకరించానని విజయ్ తెలిపారు.