Narayanpet | నారాయణపేట : చేతికొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల కళ్ల ముందే చనిపోతే ఆ బాధ వర్ణణాతీతం. కని పెంచిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తారు. బిడ్డల జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ కుమిలి పోతుంటారు. ఓ తండ్రి తన బిడ్డ మరణాన్ని తట్టుకోలేక.. ఆమె జ్ఞాపకాలను మరిచిపోలేక.. ఏకంగా ఆమె సమాధి వద్ద రోదిస్తూ పడుకున్నాడు. ఆ సమాధిని గట్టిగా కౌగిలించుకుని తన బిడ్డ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఈ హృదయ విదారక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బాధ మరెవరికి రావొద్దంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
నారాయణపేట జిల్లా పరిధిలోని గోపాల్పేట వీధికి చెందిన లక్ష్మీ ప్రణీత(12) తన ఫ్రెండ్స్తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నది. ఓ వాటర్ ట్యాంక్ వద్ద ఆడుకుంటుండగా అది ప్రమాదవశాత్తు కూలిపోయింది. దీంతో ఇటుకలు చిన్నారులపై పడ్డాయి. లక్ష్మీ ప్రణీతతో పాటు మరో అమ్మాయికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రణీత ప్రాణాలు కోల్పోయింది.
అదే రోజు సాయంత్రం ప్రణీత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె తండ్రి రమేశ్ స్నానం చేసి వెంటనే బయటకు వెళ్లాడు. రాత్రి 11:30 గంటల వరకు కూడా ఆయన ఇంటికి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో వెతికారు. ఆయన ఆచూకీ లభించలేదు. అనుమానం వచ్చి ప్రణీతను పూడ్చిపెట్టిన ప్రాంతానికి వెళ్లగా, అక్కడ ఆమె సమాధి వద్ద పడుకుని రోదిస్తూ ఉన్నాడు. రమేశ్ను కుటుంబ సభ్యులు సముదాయించి ఇంటికి తీసుకొచ్చారు.