హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ) : రాచకొండ గుట్టల్లో భైరవ శిల్పాన్ని గుర్తించారు ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ సభ్యులు. గుట్టల్లోని భోగందాని మంటపం, గణపతి శిల్పాల నడుమ పెద్ద రాతిగోడపై చెక్కి ఉన్న ఈ 9 అడుగుల ఎత్తయిన భైరవ శిల్పం ఎంతో ప్రత్యేకమైనదని బృందం స భ్యుడు కావలి చంద్రకాంత్ తెలిపారు. ఈ శిల్పంలో భైరవుడు ద్విభంగిమలో, వైతస్తిక పాదాలతో నిల్చున్న చతుర్భుజుడుగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
పరహస్తాల్లో ఢమరు కం, త్రిశూలాలు, నిజహస్తాల్లో బలిఖడ్గం, రక్తపాత, ఖండిత శిరస్సులున్నాయని చెప్పారు. శిరస్సు కింద రక్తం కోసం పైకి ఎగురుతున్న శ్వానం కనిపిస్తుందని, ఆ పక్కన ఓ భక్తుడు సాగిలపడి మొక్కుతున్నట్టుగా ఉందని చెప్పా రు. భైరవునికి కుడిపకన యోగబంధంతో కూర్చున్న రాజోపాసకుడు పాత్రలోని రక్తప్రసాదాన్ని స్వీకరిస్తున్నట్టు, అతడు పులిచర్మం మీద కూర్చున్నట్టు ఉన్నదని తెలిపారు. ఈ శిల్పం రాచకొండ వెలమల ‘రణంకుడుపు’లను గుర్తుచేస్తున్నదని బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు.