హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. వారికి 5% కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మందితోపాటు 2019 జూలై నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఇటీవల బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొన్న ఆర్టీసీ యాజమా న్యం.. వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. ఆర్టీసీ చార్జీలను రౌండ్ ఫిగర్ చేయ డం, డీజిల్ సెస్సు విధించడం ద్వారా సంస్థ ఆదాయం స్వల్పంగా పెరగడంతో కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న 6 డీఏల్లో ప్రస్తుతానికి ఒకదాన్ని ఇవ్వాలని సోమవారం నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి తరఫున టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.