హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు చాపకింద నీరులా పెరుగుతూ కలకలం రేపుతున్నాయి. మొన్నటివరకు పదుల సంఖ్యలో నమోదైన కేసులు రెండు మూడు రోజులుగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. విద్యాసంస్థల్లో కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొద్ది రోజులుగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పట్టించుకోకపోవడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్నది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ తదితర రాష్ర్టాల్లో కేసుల సంఖ్య పెరగడం, ఆయా రాష్ర్టాల నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటడంతో మన రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే గ్రేటర్ హైదరాబాద్వ్యాప్తంగా 400 పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారవర్గాలు తెలిపాయి. రాజేంద్రనగర్లోని ఎస్టీ బాయ్స్ హాస్టల్లో 22 మంది విద్యార్థులతోపాటు ఇద్దరు హాస్టల్ సిబ్బందికి వైరస్ సోకింది. ఉస్మానియా వర్సిటీ లేడీస్ హాస్టల్లో ఆరుగురు విద్యార్థినిలకు పాజిటివ్ వచ్చింది. మల్లేపల్లి ఐటీఐలో ఇద్దరు సిబ్బందితోపాటు ఒక విద్యార్థికి పాజిటివ్గా తేలింది. ఇప్పటికే గాంధీ దవాఖానలో 70 మంది చికిత్స పొందుతున్నట్టు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. జగిత్యాల జిల్లా భవానీనగర్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 17 మందికి, ఐదుగురు ఉపాధ్యాయులకు, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలోని కసూర్బా విద్యాలయంలో 15 మంది విద్యార్థులకు కరోనా అంటుకున్నది. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయ ఈవోకు వైరస్ సోకడంతో దేవాలయాన్ని 25వ తేదీ వరకు మూసివేశారు.
గురువారం 313 కేసులు
రాష్ట్రంలో గురువారం 62,972 నమూనాలను పరీక్షించగా, 313 మందికి పాజిటివ్గా తేలినట్టు శుక్రవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 47, రంగారెడ్డి జిల్లాలో 29, నిర్మల్లో 25, మేడ్చల్ మల్కాజిగిరిలో 20, కామారెడ్డిలో 16, నిజామాబాద్లో 15, సంగారెడ్డిలో 13, రాజన్న సిరిసిల్లలో 12, ఆదిలాబాద్, మంచిర్యాలలో 10 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ఏపీలో ఒక్కరోజే 246 కేసులు నమోదయ్యాయి.
దండం పెడుతా.. జాగ్రత్తగా ఉండాలి
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తిచేశారు. శుక్రవారం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలోని కొవిడ్ హెల్త్కేర్ సెంటర్ను తనిఖీచేశారు. అనంతర మాట్లాడుతూ.. ‘చేతులెత్తి మొక్కుతున్నా.. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించంండి’ అంటూ దండం పెడుతూ కోరారు. – మహబూబ్నగర్ మెట్టుగడ్డ