హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రోజుకో కొత్త రకం సైబర్ మోసం వెలుగులోకి వస్తున్నది. అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకోకుండా ఉండేందుకు సైబర్ నేరాలపై అవగాహన, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండడమే మేలని సూచిస్తున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన సైబర్ నేరాలు, నేర విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్బీఐ ఓ పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసింది. ఆర్బీఐ అంబుడ్స్మెన్ (ముంబై-2శాఖ) రూపొందించిన ఈ పుస్తకంలో మొత్తం 40 రకాల సైబర్ నేరాలను పొందుపర్చారు. సైబర్ నేరగాళ్లు ఎలా మోసాలకు పాల్పడుతున్నారు? నేర విధానం ఏమిటి? వారు మన నుంచి ఏ సమాచారం సేకరిస్తున్నారు? తదితర అంశాలను వివరించారు. దీనికి ‘రాజు అండ్ ది ఫార్టీ థీవ్స్’అని పేరు పెట్టారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రూపొందించినట్టు ఆర్బీఐ అధికారులు తెలిపారు. లాటరీ, ఓఎల్ఎక్స్, కేవైసీ అప్డేషన్ వంటి నేర విధానాలతోపాటు కార్డు క్లోనింగ్, పేమెంట్ స్నూపింగ్ అప్లికేషన్స్ వరకు సైబర్ నేర విధానాలు పుస్తకంలో వివరించినట్టు పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి.