ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ అదరగొట్టారు. సురేశ్ రైనా(54:36 బంతుల్లో 3ఫోర్లు,4సిక్సర్లు) అద్భుత అర్ధశతకానికి తోడు మొయిన్ అలీ(36:24 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), శామ్ కరన్(34:15బంతుల్లో 4ఫోర్లు,2సిక్సర్లు) రాణించడంతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, క్రిస్ వోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ నాలుగు ఓవర్లు వేసి వికెట్ పడగొట్టి 47 పరుగులు సమర్పించుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లు షాకిచ్చారు. ఆవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో డుప్లెసిస్(0) ఔట్ కాగా.. క్రిస్ వోక్స్ వేసిన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(5) పెవిలియన్ చేరాడు. 6 ఓవర్లకు చెన్నై 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.
ఈ దశలో మొయిన్ అలీ, రైనా, రాయుడు(23) చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
దీంతో 8 ఓవర్లకు 48/2తో కష్టాల్లో ఉన్న జట్టు మెరుగైనస్థితికి చేరింది.
ఢిల్లీ పేసర్ ఆవేశ్ ఖాన్ కీలక సమయాల్లో వికెట్ల పడగొట్టి చెన్నైని దెబ్బకొట్టాడు. ఆవేశ్ వేసిన 16వ ఓవర్ మొదటి బంతికి రైనా రనౌట్ కావడంతో క్రీజలోకి వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎదుర్కొన్న రెండో బంతిని వికెట్ల మీదకు ఆడుకొని బౌల్డ్ అయ్యాడు. దీంతో మహీ డకౌట్గానే పెవిలియన్ చేరాడు. ఆఖర్లో టామ్ కరన్ వేసిన 19వ ఓవర్లో శామ్ కరన్ చితక్కొట్టాడు. ఆ ఓవర్లో జడ్డూ ఒక ఫోర్ బాదగా..శామ్ వరుసగా 6,6,4 కొట్టడంతో 23 రన్స్ వచ్చాయి. జడ్డూ(26), శామ్ జోడీ 50కి పైగా పరుగులు రాబట్టడంతో చెన్నై అనూహ్యంగా 180 మార్క్ దాటింది.