తక్షణ సాయం కింద సర్కారు భరోసా
వైరస్ బాధితులకు సత్వర ఆర్థికసాయం
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): కరోనా బారినపడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.2 లక్షల చొప్పున అందించి ఆదుకోనున్నది. మరోవైపు వైరస్ బారినపడిన జర్నలిస్టులకు తక్షణ ఆర్థిక సహాయం అందించనున్నది. ఈ విషయాన్ని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబసభ్యులు మే 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరణ ధృవీకరణ పత్రం, అక్రెడిటేషన్ కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్టులతోపాటు ఆయా జిల్లాల డీపీఆర్వోలు ధృవీకరించాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. పదిరోజుల వ్యవధిలోనే 15 మంది జర్నలిస్టులు మృతిచెందడంపై ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా బారినపడిన 200 మంది జర్నలిస్టులకు తక్షణ ఆర్థికసాయం చేస్తున్నట్టు ప్రకటించారు. విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధిత జర్నలిస్టులకు పూర్తిగా అండగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారమందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించి ప్రత్యేకంగా కరోనా పరీక్షా కేంద్రాలు, దవాఖానల్లో ప్రత్యేక వైద్యసదుపాయాలు కల్పించాలని, పాత్రికేయులందరికీ ప్రత్యేకంగా టీకా కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైరస్ బారినపడిన బాధితులు, మృతుల కుటుంబసభ్యులు ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయా జర్నలిస్టు సంఘాలు బాధితులకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా..
కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్, ఇంటి నంబర్ 10-2-1, సమాచార భవన్, రెండో అంతస్తు,ఏసీ గార్డ్స్, మసాబ్ట్యాంక్, తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్కు దరఖాస్తులను పంపాలి. ఇతర వివరాలకు 040- 23298672, 74 నంబర్లలో సంప్రదించాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు.