హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛతలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు మరో మూడు అవార్డులు వరించాయి. ఇండియన్ స్వచ్ఛత లీగ్(ఐఎస్ఎల్) అవార్డుకు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, అలంపూర్, కోరుట్ల మున్సిపాలిటీలు ఎంపికైనట్టు కేంద్రం ప్రకటించింది. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపామిశ్రా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమందించారు. ఈ అవార్డులను ఈ నెల 30న ఢిల్లీలో ప్రదానం చేస్తారు. చెత్తరహిత పట్టణం (గార్బేజ్ ఫ్రీ సిటీస్)లో భాగంగా ఇండియన్ స్వచ్ఛత లీగ్ ఈ మూడింటిని అవార్డులకు ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి ఇప్పటికే 16 పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కగా, ప్రస్తుతం ప్రకటించిన మూడింటితో కలిపి 19కి చేరాయి.
ఎంపిక ఇలా..
ఈ నెల 17న ఇండియన్ స్వచ్ఛత లీగ్ పోటీలు నిర్వహించగా, దేశవ్యాప్తంగా 1850 పట్టణాలు పాల్గొన్నాయి. వీటిలో తెలంగాణ నుంచి మూడు పట్టణాలు ఎంపికయ్యాయి. పోటీల్లో భాగంగా పురపాలక బృందాలు పరిశుభ్రతపై చేపట్టిన కార్యక్రమాలు, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛ పరిసరాలపై అవగాహన, మాస్ శానిటేషన్, చెరువుల పరిసరాల శుభ్రత, జియోగ్రాఫికల్ ప్రాంతాలు, ర్యాలీలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించాయి. వీటన్నింటి ఆధారంగా అవార్డులకు ఎంపిక చేస్తూ కేంద్రం ప్రకటించింది.
మంత్రి కేటీఆర్ అభినందనలు
రాష్ర్టంలోని మూడు పట్టణాలకు స్వచ్ఛ అవార్డులు రావడంపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, పురపాలక సిబ్బందిని ఆయన అభినందించారు.