హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ)/కీసర: బెట్టింగ్ మోజులో పడి ఉద్యోగమిచ్చిన సంస్థకే కుచ్చుటోపి పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. తమ సంస్థకు చెందిన 14.40 కిలోల బంగారాన్ని మరో సంస్థలో కుదువ పెట్టి రూ.3.30 కోట్లతో జూదమాడిన నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. దమ్మాయిగూడ ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ సంస్థలో తోట రాజ్కుమార్ బంగారం భద్రపర్చే వాల్ట్ ఆపరేషన్ నిర్వహిస్తుంటాడు. ఇటీవల సంస్థలో జరిగి న ఆడిట్లో దాదాపు 14.40 కిలోల బంగారం మాయమైనట్టు గుర్తించారు. బంగారం మొత్తా న్ని వాల్ట్ ఇంచార్జిగా ఉన్న రాజ్కుమార్ తీసినట్టు అనుమానించి ఐఐఎఫ్ఎల్ సంస్థ మేనేజర్ మల్లేశ్ యాదవ్ కీసర పోలీసులకు ఫిర్యాదుచేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాజ్కుమార్ 14.40 కిలోల బంగారు ఆభరణాలను తీసి వాటిని వివిధ ప్రాంతాల్లోని మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో కుదవపెట్టి రూ.3.30 కోట్ల రుణం తీసుకొన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీటిని 1xBET యాప్ ద్వారా ఆన్లైన్లో జూదంతోపాటు క్రికెట్ బెట్టింగ్ ఆడాడు. ఏకంగా ఒక బాల్పై లక్ష బెట్టింగ్ పెట్టాడు. ఆ బాల్లో సిక్స్, ఫోర్, వికెట్, క్యాచ్, వైడ్, నో-బాల్, రనౌట్, స్టంప్, సింగిల్ రన్, ఇలా అనేక అంశాలపై లక్ష వరకు బెట్టింగ్ పెట్టాడు. ఏదో బాల్కు టర్నింగ్ పాయింట్ వస్తుందని ఎదురుచూస్త్తూ రూ.3.30 కోట్లను గాయబ్ చేశాడు. రాజ్కుమార్ను అరెస్టు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.