మేడారం సమ్మక్క – సారలమ్మను దర్శించుకొనేందుకు బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. తలనీలాలు సమర్పించి, జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజలు చేసి, మొక్కులు చెల్లించుకొన్నారు. సుమారు లక్ష మందికిపైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకొన్నట్టు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.