Congress | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ కొత్త కుట్రలకు తెరలేపుతున్నది. ఫేక్ సర్వేలు, పెయిడ్ కథనాలతో లేని బలం ఉన్నట్టు ప్రచారం చేసుకొంటున్న ఆ పార్టీ నేతలు.. పోలింగ్ వేళ ఓటర్లను అయోమయానికి గురిచేసే ప్రణాళికలను రచిస్తున్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్పై, సీఎం కేసీఆర్, వారి కుటుంబ సభ్యులపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలని ఆ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పన్నిన వ్యూహం బహిర్గతమైంది. కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడింది. ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటినుంచి బీఆర్ఎస్పై అసత్య కథనాలను సృష్టించి, ప్రచారం చేస్తున్న ఈ బృందం పోలింగ్ వేళ మరిన్ని కుట్రలకు సునీల్ కార్యాలయాన్ని అడ్డగా ఉపయోగిస్తున్నది.
పోలింగ్ సందర్భంగా ప్రజల్లో పెద్ద ఎత్తున భయాందోళనలు సృష్టించడం ద్వారా ఓటర్లను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం రాబోయే 48 గంటల్లో బీఆర్ఎస్పై తప్పుడు కథనాలను వ్యాప్తి చేసేందుకు ప్రణాళిక చేసింది. ప్రణాళికలో భాగంగా బీఆర్ఎస్ ఓడిపోతున్నదని, త్వరలో ఆ పార్టీ ఎన్డీఏలో చేరుతుందని ప్రచారం చేయాలని చూస్తున్నది. ఎమ్మెల్సీ కవిత ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రి అవుతారంటూ తప్పుడు కథనాలను సృష్టించేందుకు సిద్ధమైంది. ఎన్నికల్లో ఓడిపోతారని గుర్తించిన సీఎం కేసీఆర్ కుటుంబం ఫామ్హౌజ్లో స్కామ్లకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను తగులబెడ్తున్నదనే తప్పుడు వార్తలను విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సునీల్ బృందం సూచించినట్టు సమాచారం. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు కేసీఆర్ పంపారని, ఓటుకు రూ.10 వేలు పంచుతున్నట్టు పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్ ప్రచారం చేయాలని, బీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకొని కాంగ్రెస్కు ఓటు వేయాలని అడిగేందుకు ఐవీఆర్ఎస్ కాల్లను కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. సానుభూతితో ఓట్లను పొందేందుకు వీలుగా రెండురోజులు న్యూస్ పేపర్లలో మొదటి పేజీ, జిల్లా సంచికల్లో సోనియాగాంధీ రాసిన లేఖను ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
సునీల్ కనుగోలు బృందం రచించిన కుట్ర సమాచారం లీక్కావడంతో ‘మిషన్ తెలంగాణ’ అప్రమత్తమైంది. సునీల్ కనుగోలు బృందం చేసే కుట్రలు, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంతోపాటు వాస్తవాలతో తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తున్నది. కొంతమంది చేస్తున్న ఇలాంటి ఎత్తుగడలు, ఈ దుష్ప్రచారాలను నమ్మవద్దని మిషన్ తెలంగాణ సూచిస్తున్నది. బీఆర్ఎస్, పార్టీ నాయకులపై కొన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ఇలాంటి కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని ట్విట్టర్ వేదికగా సూచించింది. రెచ్చగొట్టే వార్తలు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఏదైనా సమాచారాన్ని తెలుసుకొనేందుకు బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా, అధికారిక వెబ్సైట్లను సంప్రదించాలని సూచించింది. ఇతర పార్టీలు సృష్టిస్తున్న అభూత కల్పనలు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని, బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు తెలంగాణ ప్రజలు అండగా ఉండాలని ‘మిషన్ తెలంగాణ’ పిలుపునిచ్చింది.