అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తెలుగువారిని ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన ప్రముఖ సంస్థ అమెరికా తెలుగు సంఘం (ఆటా) హైదరాబాద్లో బిజినెస్ సెమినార్ 2021ను నిర్వహించింది. వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనలను ప్రోత్సహించడం, యువ వాణిజ్యవేత్తలకు మెంటరింగ్, వెంచర్ క్యాపిటలిస్టులకు ఒక వేదిక కల్పించడం, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో అమెరికా, భారత్కు చెందిన దాదాపు 100 మంది మెంటర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, వాణిజ్యవేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆటా వేడుకల బిజినెస్ కమిటీ ఛైర్ కాశీ కొత్త మాట్లాడుతూ.. ఈ బిజినెస్ సెమినార్ ఎజెండా బహుముఖం. అమెరికాలో స్థిరపడిన తెలుగు వాణిజ్యవేత్తలు, తెలంగాణలోని వ్యాపారవేత్తల మధ్య అనుసంధానం, అనుబంధం పెంచడం, ముఖ్యంగా తెలంగాణలోని స్టార్టప్ కంపెనీలకు మెంటరింగ్ చేసి, వాటిలో పెట్టుబడులు పెట్టడం, ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ లాంటి టైర్-2 నగరాలకు మరిన్ని కంపెనీలను ఆకర్షించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలు.. అని ఆయన అన్నారు.
సెమినార్ గురించి అమెరికా తెలుగు సంఘం కాన్ఫరెన్స్ సలహా కమిటీ ఛైర్ జయంత్ చల్లా మాట్లాడుతూ.. తెలుగు వాణిజ్యవేత్తలు అమెరికాతో పాటు ప్రపంచమంతా మంచి గుర్తింపు పొందుతున్నారు. భారత్-అమెరికా భాగస్వామ్యాలను ప్రోత్సహించి, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్యవేత్తలను ప్రోత్సహించడానికి ఈ ఆటా బిజినెస్ సెమినార్ ఒక మంచి ప్రయత్నం. 2014 నుంచి హైదరాబాద్లో ప్రతి రెండేళ్లకోసారి ఆటా ఇలాంటి సెమినార్లు నిర్వహిస్తోంది. వాటి ద్వారా ఇప్పటివరకు భారతీయ స్టార్టప్లలో దాదాపు 20 మిలియన్ డాలర్లు (రూ. 150 కోట్లకు పైగా) పెట్టుబడులు వచ్చాయి. ఈ బిజినెస్ సెమినార్ల వల్ల పలు సంస్థలు టైర్-2 నగరాలకు తరలాయి. ఖమ్మం పట్టణంలో టీ-హబ్ ప్రారంభించడం ఆటా బిజినెస్ కో-ఛైర్ లక్ష్ చేపూరి సాధించిన ఓ అతిపెద్ద విజయం.. అని చెప్పారు.
మెంటరింగ్, పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు, వాణిజ్యవేత్తల మధ్య పెట్టుబడులకు సంబంధించిన మంచి చర్చలు నిర్వహించడంతో పాటు ఈ బిజినెస్ సెమినార్ అనేది ద్వితీయశ్రేణి నగరాలకు తరలాలనుకునే వివిధ కంపెనీలకు, తెలంగాణ ప్రభుత్వ అధికారులకు మధ్య నిరంతర చర్చలకు కూడా ఒక వేదికగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ ఐటీ పెట్టుబడుల విభాగం సీఈవో విజయ్ రంగినేని, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈవో శ్రీకాంత్ సిన్హా తదితరులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం, ద్వితీయశ్రేణి నగరాలకు తరలాలని భావించే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం పలు ప్రోత్సహకాలను ప్రతిపాదించింది.
అమెరికా వ్యాప్తంగా ఉన్న 5 లక్షల మందికి పైగా తెలుగువారికి ప్రాతినిధ్యం వహించేందుకు 1990లో ఏర్పాటైన ప్రధాన జాతీయ సంస్థ అమెరికా తెలుగు సంఘం. ఇందులోని ప్రతినిధుల్లో ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడేవారిలో అమెరికాకు వచ్చిన తొలితరం వారు. సమాజ సేవ, వ్యాపారం, సంస్కృతి, సామాజిక కార్యకలాపాలు, విద్యార్థులకు సాయం, తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణ, ప్రోత్సాహం తదితరాలను అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ నిర్వహిస్తుంది.