సూర్యాపేట : మంచి పనులు చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ వై జంక్షన్ వద్ద కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణమంటపాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. “సర్వేజనాః సుఖినో భవంతు” అనే భావనతో సమాజం వసుధైక కుటుంబంగా ఉండాలని ఆకాంక్షించారు. సంపదకు మనం ధర్మకర్తలమని, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పనినే ధర్మమని పేర్కొన్నారు.
ఇష్టపడి, కష్టపడి పని చేస్తే ఎవరూ నష్టపోరన్నారు. ప్రకృతిని ప్రేమించి కాపాడాలన్నారు. కులం ఉండవచ్చని, కానీ కులపిచ్చి ఉండకూడదని స్పష్టం చేశారు. సేవా భావంతో అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కళ్యాణ మండప నిర్మాణానికి భూరి విరాళాలు అందించిన దాతలను అభినందించారు. అనంతరం సేవ సమితి ఆధ్వర్యంలో ప్రతిభ కలిగి న విద్యార్థులకు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నగదు పురస్కారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, రావెళ్ళ సీతారామయ్య, సంఘం కోదాడ అధ్యక్షులు పెదనాటి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వేమూరి సురేష్, కోశాధికారి పోటు రంగారావు, ఉపాధ్యక్షులు మార్తి మాధవరావు, సంయుక్త కార్యదర్శి కనగాల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్సీ తొండాపూ దశరథ జనార్దన్ రావు, మాజీ ఎమ్మెల్యే కోటేశ్వరరావు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, కమ్మ సేవా సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు బొడ్డు రవిశంకర్, కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.