తెలంగాణ గడ్డపై వేలాది జానపద కళారూపాలు, సాహిత్య ప్రక్రియలు పురుడు పోసుకున్నాయి. వాటిలో కొన్ని పండితుల్ని రంజింపజేస్తే.. మరికొన్ని పామరులను అలరించాయి. అయితే, ఒక్క యక్షగానం మాత్రమే.. పండిత పామరుల్ని ఏకకాలంలో మెప్పిస్తున్నది. నృత్యం, నాటకం, సంగీతం, వేషభాషల సమాహారంగా ఈ కళారూపం ఖ్యాతికెక్కింది.
సకల కళల సమాహారం.. యక్షగానం పుట్టింది తెలంగాణలోనే. తదనంతరం ఆంధ్ర, రాయలసీమతోపాటు తమిళనాడులోని తంజావూరు, కర్ణాటకలోని మైసూరు వరకూ విస్తరించింది. అక్కడి రాజుల పోషణలో గౌరవాన్ని అందుకొన్నది. గానరూపం నుంచి క్రమక్రమంగా సంవాద రూపంలోకి మారింది. క్రీ.శ.14వ శతాబ్దం నాటికే తెలంగాణలో ఎంతో వైభవాన్ని సంతరించుకున్నది. రాచకొండ పాలకుడైన సర్వజ్ఞ సింగ భూపాలుడు ‘సారంగధర’ అనే యక్షగానాన్ని రాసినట్లు ఆచార్య బిరుదురాజు రామరాజు నిరూపించారు. పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్రము’లో ఈ కళను ప్రస్తావించాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన కందుకూరి రుద్రకవి 16వ శతాబ్దంలో రాసిన ‘సుగ్రీవ విజయం’ లిఖిత వాఙ్మయంలో లభిస్తున్న తొలి యక్షగానం. అందువల్ల యక్షగానానికి తెలంగాణే పుట్టినిల్లని నిర్ధారిస్తున్నారు.
యక్షగాన ప్రదర్శన సాయంత్రం ప్రారంభమై, కథను బట్టి ఉదయం దాకా సాగుతుంది. ఒక్కో బృందంలో 10 మంది వరకూ కళాకారులు ఉంటారు. తమ పాత్రలకు అనుగుణంగా ముఖానికి భారీగా రంగులు అద్దుకొంటారు. మెరిసే దుస్తులు, తలపై కిరీటం, భుజకీర్తులను ధరిస్తారు. స్త్రీ పాత్రలనూ సాధారణంగా పురుషులే పోషిస్తుంటారు. పాత్రలకు తగ్గట్టుగా విల్లు, కత్తి, గద, డాలు, చక్రంలాంటి ఆయుధాలను తయారు చేసు కొంటారు.
యక్షగానంలో ఎక్కువగా పురాణ గాథలు చెబుతారు. హరిహర, జగన్మాత ప్రార్థనతో కథను ప్రారంభిస్తారు. ఆ తరువాత సూత్రధారి వేదిక మీదికి ప్రవేశిస్తాడు. ప్రదర్శనలోని అంశాన్ని, పాత్రలను పరిచయం చేస్తాడు. కథను అనుసరించి వివిధ పాత్రల ప్రవేశాన్నీ సూచిస్తాడు. కథకుడు కథను వివరిస్తుంటే, వెనుక నుండి వాద్యగాళ్లు సంగీతం అందిస్తుంటారు. సూత్రధారి వర్ణనలకు అనుగుణంగా కళాకారులు నృత్య ప్రదర్శనలు చేస్తారు. దుఃఖ, రౌద్ర, కరుణ, హాస్య రసాలను పండిస్తూ, వీక్షకులను కథలో లీనం చేస్తారు. ఈ కళా రూపంలో మద్దెల, మృదంగం, తాళాలు, హార్మోనియం, గజ్జెలు, డప్పులు ప్రధాన వాద్యాలు. గాన ప్రధానమైన ద్విపదలు, అర్ధ చంద్రికలు, ధవళ శోభనాలు, వచనం, పద్యం, శ్లోకాలు, చూర్ణికలు, అష్టకాలు, దండకాలు ప్రముఖంగా కనిపిస్తాయి.
యక్షగాన కళారూపాన్ని వృత్తిపరంగా ప్రదర్శించే వారిలో చిందు కళాకారులు, దాసరి కులస్తులు, బహురూపులు, మాల అయ్యవార్లు, గొల్ల భోగం వారు ముఖ్యులు. గతంలో ఎంతోమంది ఈ కళ ద్వారా ఉపాధి పొందారు. ఆధునిక యుగంలో యక్షగానాన్ని బతికించుకోలేక,వారంతా వేరే బతుకు దెరువు ఎంచుకొన్నారు.
తెలంగాణలో యక్షగాన ప్రక్రియ 14వ శతాబ్ది నుంచి పరిణామం చెందుతూ 17వ శతాబ్ది నాటికి పూర్ణరూపాన్ని సంతరించుకొన్నది. క్రీ.శ. 1780 నాటికే శేషాచలకవి రాసిన ‘ధర్మపురి రామాయణం’, రాపాక శ్రీరామకవి రాసిన ‘అధ్యాత్మ రామాయణం’ అనే యక్షగానాలు జనబాహుళ్యంలో ఉన్నాయి. వీరశైవ కథాంశాలతో కానూరి వీరభద్రకవి రాసిన ‘బసవ మహిమామృత విలాసము’, చెల్వూరు సన్యాసి కవి రచించిన ‘బసవ కల్యాణము’ వంటి యక్షగానాలు ప్రదర్శితమయ్యాయి. మొదట్లో పురాణ పఠనం మాదిరిగా ఉన్న యక్షగాన ప్రదర్శనలు.. 19వ శతాబ్ది ప్రారంభం నుంచి వేదికపై ప్రదర్శించడం ప్రారంభమైంది. 1930 నుంచి 1980 వరకూ తెలంగాణ యక్షగానానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక అంశాలతోపాటు ఆనాటి ఆచార వ్యవహారాలు, సాంఘిక, మత, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను యక్షగానాలు కండ్లకు కట్టాయి. 20వ శతాబ్దం నాటికి రచనలోనూ, ప్రదర్శనలోనూ మరింత పరిణతి చెందాయి. కాంభోజ రాజు, బాల నాగమ్మ, పెద్ద బొబ్బిలిరాజు కథ, ఆరె మరాఠీల కథ మొదలైన యక్షగానాలు బహుళ ప్రచారాన్ని పొందాయి.
–అరవింద్ ఆర్య
7997 270 270