హ్మసత్యం జగన్మిధ్యేత్య పరోక్ష జ్ఞానాగ్ని నా!
బ్రహాద్వైశ్వర్యాశా సిద్ధ సంకల్ప బీజసన్తాపరూపం తపః
సత్యమూ, జ్ఞానమూ, ఆనందమూ – వీటి సమ్మేళనమైన పరబ్రహ్మమే, నారసింహ తత్వమే.. నిత్యమైంది. నిజమైంది.
తాత్కాలికమైన పేరు, ఆకారము, అసంకల్పిత చర్యలవంటి పనులూ.. ఇవన్నీ కూడా నశించిపోయేవే. ఈ స్వానుభవ దృష్టితో ఇహపర భోగములపై ఆసక్తిని, అత్యాశను, మమకారాన్ని, సంకెలల వంటి సంకుచిత సంకల్పాలను, చెడు విత్తనాలను నిప్పుల్లో వేసి మాడ్చి వేసినట్టుగా జ్ఞానమనే అగ్నిలో దహింపజేయాలి. పునీతమైన మనస్సుతో ఏకదృష్టితో లోక సంక్షేమం కోసం చేసేదే తపస్సు! కఠినమైన ఒక్కడి కష్టం.. అందరి కష్టాలను తొలగిస్తుంది. తపస్సు అంటే, కష్టమంతా తనది.. ఫలితమంతా లోకానిది. అందుకే అంటారు.. ‘లోకాస్సమస్తా సుఖినోభవంతు!’ అని సోమేశ్వరా ఇప్పుడర్థమైందా? తపస్సు అంటే ఎంత కష్టతరమయిందో.. ఎంతటి అసాధ్యమో..” చిరునవ్వుతో అడిగాడు బాల సంచారి.
బాల సంచారి మాటలు వింటుంటే.. చీకటి గదిలో సన్నని వెలుగు రేఖలు ప్రసరిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. అవును.. తాను తన బంధాలను వదులుకోలేడు. అసలు ఆ ఊహే భరించలేక పోయాడు. తపస్సు కాదు, దానిని అర్థం చేసుకోవడం కాదు.. అసలు అదేమిటో తెలుసుకోవడానికే తనకు సాధ్యం కావడం లేదు.
“బాల సంచారీ! క్షమించు. నేనేదో యాథాలాపంగా అన్నాను. మహాత్ములూ, కారణజన్ములు మాత్రమే తపస్సు చేయగలరు. వారే అందరి మంచినీ కోరుతారు. అలాంటి మహాత్ములూ, మహర్షులూ మార్గం చూపకపోతే మానవజాతి ముందుకు పోదు”
సోమేశ్వరుని మాటల్లో పశ్చాత్తాపం కనిపించింది.
అంతవరకూ మౌనంగా ఉన్న రామభట్టు చేతులు
జోడించి అన్నాడు..
“బాల సంచారీ! వయస్సులో చిన్న వాడివైనా, నీలో వెలుగుతున్న జ్ఞానజ్యోతికి నమస్కరిస్తున్నాను. పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని అంశ నీలో అణువణువునా గోచరిస్తున్నది. యాదరుషి తపస్సు ఎంతకాలం జరిగింది? ఎటువంటి ఆటంకాలూ ఎదురు కాలేదు కదా? వివరంగా చెప్పి మాకు పుణ్యం కలిగించు”
“రామభట్టు గారూ! మీరు పెద్దలు. నాకు నమస్కరించకూడదు. పైగా నన్ను మహాభక్తుడైన ప్రహ్లాదునితో పోల్చారు. సాక్షాత్తూ నారసింహుని అనుగ్రహం పొందిన గొప్పవాడు ప్రహ్లాదుడు. పరమ పవిత్రుడు. ఆయనకూ, నాకూ పోలికే కాదు. కిరీటం పెట్టుకొన్న ప్రతివాడూ ప్రభువు కాలేడు. దండం పెట్టిన ప్రతివాడూ మహాభక్తుడు కాలేడు. ఇకపోతే, ‘యాదరుషి తపస్సుకు ఆటంకాలు రాలేదా?’ అని అడిగారు. రాకుండా ఎలా ఉంటాయి? ఒకడు మంచి పనిచేయడానికి ముందుకొస్తే.. వాడిని ఆపడానికి పదిమంది చెడ్డవాళ్లు తయారవుతారుగా. యాదరుషి తపస్సును భగ్నం చేయడానికీ ఒక దుష్టశక్తి తల ఎత్తింది..”
యాదరుషి దివ్యగాథను వివరిస్తున్న బాల సంచారి ఒక్కసారిగా ఉద్విగ్నభరితుడయ్యాడు. అపూర్వ భావోద్వేగానికి లోనయ్యాడు. కనులముందు ఏదో అద్భుత దృశ్యం కదలాడుతున్నట్టుగా అతని చూపులు ఎక్కడో ఉన్నాయి. అది గమనించిన త్రిభువన మల్లుడు ఆశ్చర్యపోయి..
“బాల సంచారీ.. భక్త శిఖామణీ.. ఏమి చూస్తున్నావో మాకుకూడా చెప్పి కృతార్థులను చేయు..” అన్నాడు. ఆ మాటలతో బాల సంచారి ఈ లోకంలోకి వచ్చాడు.
“త్రిభువనమల్ల చక్రవర్తీ! అదిగో యాదరుషి ఏ సంకల్పంతో తపస్సు చేద్దామనుకొన్నాడో.. ఆ దృశ్యం నా కండ్లముందు కనిపిస్తున్నది. అంతేకాదు, దేవాధిదేవుడైన శ్రీ లక్ష్మీనరసింహుడు అపూర్వంగా ఆవిర్భవించిన అవతార ఘట్టం.. తలచుకొంటుంటేనే ఒళ్లు పులకరిస్తున్నది.
అదిగో.. అదిగో.. నారసింహా!
నమో శ్రీలక్ష్మీ నారసింహా..!”
నారసింహ నామస్మరణ వింటూనే భక్తితో చేతులు జోడించాడు రామభట్టు.
సోమేశ్వరుడు బాల సంచారినే నిశితంగా గమనిస్తున్నాడు. ప్రహ్లాదున్ని కటాక్షించిన శ్రీ లక్ష్మీ నారసింహుడి కథను వినాలని అతని హృదయం తహతహలాడుతున్నది.
నారసింహుడి ప్రియభక్తుడైన ప్రహ్లాదుని కథను.. అంటే తన కథను తానే చెప్పిపోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రహ్లాదుడేనేమో ఈ బాల సంచారి అనిపిస్తున్నది.
“మహాత్ముడైన యాదరుషి ఎవరికోసం తపస్సును సంకల్పించాడో.. ఆ స్వామి చరితను, ముఖ్యంగా ఆవిర్భావ ఘట్టాన్ని వినాలని నా మనస్సు కోరుతున్నది. వినిపించ వలసిందిగా ప్రార్థిస్తున్నాను” అన్నాడు సోమేశ్వరుడు.
బాల సంచారి చేతులు జోడించి నారసింహుడిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించాడు.
“సత్యం విధాతుం నిజభృత్య భాషితామ్
వ్యాప్తిం చ భూతేష్యఖిలేషు చాత్మనః
అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్
స్తంభే సభాయాం నమృగం న మానుషమ్
భగవంతుడైన శ్రీమన్నారాయణుడు, తన భక్తుడైన ప్రహ్లాదుడు చెప్పిన నిజాన్ని నిరూపించడం కోసం, అంతటా తానే వున్నాడని చాటి చెప్పడం కోసం.. ‘ఈ స్తంభంలో ఉన్నాడా? సర్వవ్యాపి అని నువ్వు చెప్తున్న నీ దేవుడు’ అని హిరణ్యకశిపుడు అన్నప్పుడు.. ఆ స్తంభంలో నుండే, ఒక మహాద్భుతరూపంతో ప్రత్యక్షమయ్యాడు. పూర్తిగా సింహం కాదు, పూర్తిగా నరుడు కాదు! అంటూ వేదవ్యాస మహర్షి శ్రీమద్భాగవతం, ఏడో స్కంధంలో అత్యద్భుతంగా వర్ణించాడు” అని చెప్పాడు బాల సంచారి.
“నరసింహావతారం అంటే ఏమిటి? అవతార రహస్యాన్ని, ఆరాధనా విధానాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? అని తీవ్రంగా అన్వేషించారు యాదరుషుల వారు. తపస్సుకై సంకల్పించినపుడు, వారికి ఏవేవో దృశ్యాలు కనులముందు కనిపించాయి. స్తంభం నుండి బయటకు వచ్చిన ఉగ్రనారసింహుడు ఏ విధంగా ఉన్నాడో.. ఆ రకంగా కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు యాదరుషి.
‘ఎక్కడ నీ శ్రీహరి. ఈ స్తంభంలో ఉన్నాడా?’ అని అహంకారపూరితంగా ప్రశ్నించాడు హిరణ్యకశిపుడు.
‘సర్వవ్యాపి అయితే నాకెందుకు కనబడడు. ఈ స్తంభంలోకూడా ఉన్నాడని లేనిపోని మాటలు చెప్తున్నావు. నిజంగా ఉండి ఉంటే, నీ దేవుడు నిన్ను రక్షించేవాడే అయితే.. వెంటనే ధైర్యంగా నా ముందుకు రావాలి. లేదంటే నీ తలను నరికి, నీ మొండెం నుండి వేరుచేసి పారేస్తాను’ అని హూంకరించాడు. పసివాడు ప్రహ్లాదుడు, తన మాటలకు బెదరకపోవడం చూసి, సలసల రగిలిపోయాడు హిరణ్యకశిపుడు. తన సింహాసనం నుండి గభాల్న లేచాడు. ఒరలోనుండి పెద్ద కత్తిని బయటకు లాగాడు. వేగంగా వెళ్లి ఆ స్తంభాన్ని పిడికిలితో బలంగా గుద్దాడు. ఎప్పడైతే స్తంభాన్ని ఆ రాక్షసుడి చేయి తాకిందో, అప్పుడే ఆ స్తంభం నుండి ఫట ఫట.. ఫెళ ఫెళ.. చట చట.. అంటూ భయంకరమైన శబ్దాలు వచ్చాయి. ఆ ధ్వనులు అంతకు ముందు ఎవరూ, ఎప్పుడూ విని ఉండలేదు.
బ్రహ్మాది దేవతలకు మొదట ఏమీ అర్థం కాలేదు. ఎక్కడన్నా భీకర ప్రళయం సంభవిస్తున్నదేమో అనుకొన్నారు. గజగజలాడి పోయారు.
హిరణ్యకశిపుడు ఉన్మాదంలో ఉన్నాడు. పసి పిల్లవాడు, తన కన్నకొడుకు.. ప్రహ్లాదుడిని రాక్షసంగా చంపడానికి ముందుకు ఉరికాడు. అదే సమయంలో తన గొప్ప సేన నాయకులు ఆ శబ్దాన్ని విని, భయంతో గడగడలాడి పోవడం చూశాడు. ఒక్క క్షణం ఆగి, వెనుకడుగు వేశాడు.
‘భీతికొలిపే ఈ శబ్దాన్ని చేస్తున్నదెవ్వరు?’ అనుకొంటూ అటూ ఇటూ చూశాడు. కానీ, ఎదురుగా.. చుట్టుపక్కలా, కిందా పైనా ఎవరూ కనిపించలేదు. ఏమీ కనిపించలేదు.
కానీ, ఆ స్తంభం.. ఫెటేల్మంటూ రెండు ముక్కలయ్యింది. అందులోనుండి ఆవిర్భవించాడు..
శ్రీ నారసింహుడు!
.. ఓమ్ నమో శ్రీ నారసింహాయ!
స్తంభం నుండి బయటకు వస్తున్న ఆ పరమాద్భుత రూపాన్ని చూశాడు.
‘ఓహో.. ఈ ప్రాణి మనిషి కాదు, రాక్షసుడు కాదు, మృగమూ కాదు. ఈ నరసింహరూపం ఏ అలౌకిక ప్రాణిది?’ రాక్షసరాజు అలా ఆలోచిస్తుండగానే.. నృసింహ భగవానుడు తలదించి చూశాడు.
ఏమి రూపమది?
కరాళ దంష్ట్రం కరవాల చంచల
క్షురాంత జిహ్వం భ్రుకుటీ ముఖోల్బణమ్
స్తబ్ధోర్ద్వకర్ణం గిరికందరాద్భుత
వ్యాత్తాస్యనాసం.. హను భేద భీషణమ్
నరసింహదేవుడి రూపం ఎవరికైనా భయం కల్పించేదిగా ఉంది. కనులు పుటం పెట్టిన అచ్చమైన బంగారు ముద్దల్లాగా, పచ్చగా భీతి కొల్పేట్టుగా ఉన్నాయి. విస్తారిత ముఖంతో నరసింహ స్వామి జూలు విదిలిస్తూ, మెడను అటూ ఇటూ తిప్పుతున్నాడు. దేవుడి కోరలు భయంకరంగా ఉన్నాయి.
నాలుక కత్తిలాగా మొనదేలి పదునుగా ఉంది. ఖడ్గంలా వాడిగా ఉన్న నాలుకను చాచి, మింగేయడానికి సిద్ధమైనట్టు తిప్పుతున్నాడు. ముడిచిన కనుబొమ్మముడితో ముఖం అతి భీకరంగా ఉంది. చెవులు నిశ్చలమై నిక్కబొడుచుకొని ఉన్నాయి. వెడల్పుగా ఉన్న ముక్కురంధ్రాలు, నోరు రాతి గుహలలాగా అద్భుతంగా కనిపిస్తున్నాయి.
విప్పుకొన్న దవడలతో స్వామి వదనం భీషణంగా ఉంది. శరీరం ఇంతై, అంతై.. ఆకాశాన్ని తాకుతున్నది. మెడ బలిష్టంగా బలంగా ఉంది.
వక్షస్థలం వెడల్పుగా ఉంది. నడుము సన్నగా ఉంది. చంద్రుడి కిరణాల్లాంటి తెల్లని కేశాలు శరీరంపైన మెరుస్తున్నాయి. భుజాలు అన్నివైపులా వ్యాపించి ఉన్నాయి. గోళ్లు ఆయుధాల్లా పొడవై పదునుదేలి ఉన్నాయి.
మహా విశ్వరూపుడైన నారసింహుడిని సమీపించడానికే కాదు.. తేరిపార చూడటానికి కూడా ఎవరికీ ధైర్యం చాలడం లేదు. సుదర్శన చక్రం, వజ్రాయుధం వంటి అతిశక్తివంతమైన ఆయుధాలతో నృసింహుడు భయంకరంగా గర్జించాడు. స్వామి ఉగ్రరూపాన్ని, ఆయుధ సంపత్తినీ చూస్తూనే రాక్షసుల పై ప్రాణాలు పైనే పోయాయి.
అప్పడర్థమైంది!
తనకు మూడిందని.. లోక కంటకుడైన హిరణ్యకశిపుడికి! అయినా, మూర్ఖుడూ, అహంకారీ కనుక..
దుస్సాహసంతో ముందుకొచ్చాడు.
-అల్లాణి శ్రీధర్