అడవి.. అంటేనే ఆనందం. అడవి.. అంటేనే స్వేచ్ఛకు ప్రతిరూపం. అందుకే, అడవి తల్లి ఒడిలో మరింత స్వేచ్ఛగా విహరించేందుకు ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా’లో వాలిపోయాం. చారిత్రక ప్రదేశాలను సందర్శించి, పచ్చని ప్రకృతిలో సేదతీరి.. అడవి గుండెను స్పృశించాం. అడుగుకో సంబురం, అడుగుకో స్ంరభ్రమంతో.. అందమైన జ్ఞాపకాలను మూటగట్టుకొన్నాం.
ఫేస్బుక్ వేదికగా ‘తెలంగాణ పదాలు,ఇసిరెలు – సంస్కృతి’ అనే గ్రూప్ నడుపుతున్నది మా మిత్ర బృందం. ఇటీవల రెండు రోజులపాటు పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు, జలపాతాల అందాలను సందర్శించేందుకు బయల్దేరాం. హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల తదితర ప్రదేశాల నుండి ఒక్కొక్కరినీ కలుపుకొంటూ మా తొలి మజిలీ.. ‘గాంధారి ఖిల్లా’కు చేరుకున్నాం. ఎత్తయిన ఈ గుట్ట ఎక్కడం చాలా కష్టమనీ, చాలామంది పైవరకూ ఎక్కలేక ముఖద్వారం వద్ద ఉన్న దేవతకు మొక్కుకొని తిరుగు ప్రయాణమవుతారనే ప్రచారం ఉన్నది. కానీ, మా బృందంలోని స్నేహితుడొకరు తెచ్చిన వెదురు కర్ర.. మా అనుమానాలను పటాపంచలు చేసింది. దాని సాయంతో అంతెత్తు గుట్టనూ అలవోకగా ఎక్కేశాం.
అద్భుత శిల్పకళ
మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గ్రామానికి దగ్గరలోని కొండమీద నిర్మితమైంది పురాతన గాంధారి ఖిల్లా. రాజ్ గోండులు ఈ కోటను నిర్మించారు. ఇక్కడ మైసమ్మ తల్లి కొలువై ఉన్నది. కోట ఆవరణంతా ఆకట్టుకునే అనేక శిల్పకళా రూపాలు కనువిందు చేస్తాయి. ప్రధాన ద్వారం దగ్గర గోడకు ఇరువైపులా రాతితో చెక్కిన ఏనుగు బొమ్మలు, హనుమంతుడు, కాలభైరవుడి విగ్రహాలు అబ్బురపరుస్తాయి. కోట పరిసరాల్లోని మొక్కలు చాలా ఔషధ విలువలు కలిగినవట.
ఆసక్తికరం.. ఈస్గాం
మా తదుపరి మజిలీ పెంచికల్పేట్ అటవీ ప్రాంతం. అక్కడికి వెళ్లే దారిలో మాకో ఆసక్తికరమైన గ్రామం తారసపడింది. అదే ఈస్గాం! బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన బెంగాలీ కాందిశీకులకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో నివాసం కల్పించింది. చాళుక్య రాజులు నిర్మించిన శివ మల్లన్న ఆలయానికి దగ్గరగా వీరి నివాస స్థలాలు ఉన్నాయి. ‘ఆలయంలో కొలువైన శివుడే తమ రక్షకుడు’ అనే నమ్మకంతో తమ గ్రామానికి ఈస్గాం (ఈశ్వరుని గ్రామం) అనే పేరు పెట్టుకున్నారట. వ్యవసాయంతో పాటు, చిన్న చిన్న హోటళ్లు నడుపుతుంటారు. స్వతహాగా శాంతి ప్రియులు.
ఆనుపానులు తెలుసుకొంటూ..
ఈస్గాం మల్లన్న దర్శనం అనంతరం పెంచికల్పేట్ అడవికి బయల్దేరాం. ఫారెస్ట్ ఆఫీసర్ సూచనలు తీసుకుంటూ అడవి ఆనుపానులు తెలుసుకొంటూ ముందుకు సాగాం. తెలంగాణ రాష్ట్రం వచ్చి, పెంచికల్ పేట్ రేంజ్ ఏర్పడిన తరువాత స్మగ్లింగ్, జంతువుల వేటను పూర్తిగా రూపుమాపగలిగామని అధికారులు చెప్పిన మాటలు సంతోషం కలిగించాయి. రేంజ్ పరిధిలో పులి స్వేచ్ఛగా తిరగడానికి అడవి లోపల తగినంత ప్రదేశాన్ని సృష్టించారు. అడవి జంతువులకు తాగునీరు అందించేందుకు చెక్ డ్యాములు ఏర్పాటుచేశారు. స్థానిక గిరిజనులకు భరోసా కల్పించడం కోసం అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
అడవి గుండెను తడిమి..
ఇప్పటికే ఎన్నోసార్లు అడవి గురించి విన్నాం. చూశాం. కానీ అడవి హృదయంలోకి వెళ్లడం మాత్రం ఇదే మొదటిసారి. లోపలికి చొచ్చుకుపోయేకొద్దీ తల్లి మెత్తటి ఒడిలోకి పోతున్నట్లే అనిపించింది. కండ్లతో చూస్తున్న ఆనందాన్ని మనసుతో తనివితీరా అనుభవించాం. తీరొక్క తీగలు, మొక్కలు, వృక్షాలు చూస్తూ.. వాటి ఉపయోగాలు తెలుసుకొంటూ మా ప్రయాణం సాగింది. అడవికి చివరి పాయింట్ బోల్మెత్తం దగ్గర కాసేపు ఆగాం. ఎటువంటి కృత్రిమత్వం లేని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడం, మాటల్లో చెప్పలేని అనుభూతి.
అలవికాని అందాలు..
..ఆ తర్వాత ‘గుడ్డేని లొద్ది వ్యూ పాయింట్’ను సందర్శించాం. ఆ అలవికాని అందాలను చూసి కాసేపు అందరం మంత్రముగ్ధులైపోయాం. సందెపొద్దు ఛాయలు కనిపించేసరికి వెనుదిరిగాం. సూర్యాస్తమయాన అడవిలో దారిపక్కనున్న ‘రేగిచెట్టు మడుగు’ మమ్మల్ని ఆకట్టుకుని వాహనాన్ని ఆపేలా చేసింది. మడుగు అవతల ఉన్న లోహా గ్రామానికి, ఇటువైపు ఉన్న కొండెంగల లొద్దికి మధ్య పులి తిరుగుతుందని మా డ్రైవర్ చెప్పాడు. సుమారు గంటన్నర ప్రయాణించి రాత్రికి గోలేటికి చేరుకొన్నాం. అక్కడే బస చేశాం. మరుసటి రోజు ఓ అద్భుతమైన వ్యక్తిని కలిశాం. ఆయనే కెరమెరి మండలం, ధనోరా గ్రామానికి చెందిన కేంద్రే బాలాజీ. దక్షిణ భారతదేశంలోనే సేంద్రియ పద్ధతిలో ఆపిల్ను సాగు చేస్తున్న మొదటి వ్యక్తి. ఇక్కడి నుంచి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్విగ్నభరిత ప్రదేశాన్ని తలచుకుంటూ బయల్దేరాం.
ఆనందాల ఝరి..
నీళ్లు స్పృశించని ఏ ప్రయాణమైనా అసంపూర్ణమే కదా! అందుకే, చివరి అంకంగా బాబేఝరి జలపాతాన్ని సందర్శించాం. సాధారణంగా జలపాతాలు కిందకి దిగి చూస్తేనే వాటి అందం తెలుస్తుంది. కానీ, బాబేఝరిని పైనుంచి చూస్తేనే అసలైన అందం కనిపిస్తుంది. సిసలైన ఆనందం కలుగుతుంది. అంతెత్తు నుంచి జాలువారే క్షీర ధారల్లాంటి జలపాతాన్ని చూడగానే.. అప్పటిదాకా కలిగిన ఆ కాస్త అలసట కూడా మాయమైపోయింది. ‘నీ గమ్యం ఒక్కటే కాదు.. నీతో ప్రయాణించే వారిని బట్టి కూడా నీ ఆనందం ఆధారపడి ఉంటుంది’ అని నాతో కలిసి నడిచిన మా మిత్ర బృందాన్ని చూస్తే అర్థమైంది. కొన్ని మధురానుభూతులను, మరికొన్ని భావోద్వేగాలను మదిలో దాచుకొని, ఫొటోలు, వీడియోలుగా మూటగట్టుకొని ఎవరిండ్లకు వాళ్లు బయలుదేరాం.
అమరవీరుడి స్మృతిలో..
తారురోడ్డుకు ఇరువైపులా పరచుకున్న పచ్చదనం. అక్కడక్కడా మంచెలు. ‘కొండల్ని తాకుతున్నాయా’ అనిపించేలా మబ్బు తునకలు. మొత్తంగా ఒక కాన్వాసులా అనిపించి, వాటిని అందుకోవాలనే ఆరాటం కలిగింది మాకు. మధ్యలో స్వచ్ఛమైన అడవిబిడ్డలతో మాటా-ముచ్చట కలుపుకొంటూ జోడేఘాట్ చేరుకున్నాం. ‘జల్-జంగల్-జమీన్’ అని నినదించి అమరుడైన కుమ్రం భీమ్ నిలువెత్తు విగ్రహం చూడగానే మా అందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అందరం ఆయనకు నమస్కరించి, ఎనిమిది దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలను కాసేపు మననం చేసుకున్నాం. ఇంతలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. జోరువానతో కొత్తందాలు సంతరించుకున్న పరిసరాలు.. ఊటీ, కొడైకెనాల్ను మరిపించాయి. పక్కనే ఉన్న ట్రైబల్ మ్యూజియంలోకి పరిగెత్తాం. అక్కడ నెలవైన కుమ్రం భీమ్ వారసుల చిత్తరువులు, వారు వాడిన పనిముట్లు, అలంకరణ వస్తువులు, ఆహార ధాన్యపు వివరాలు, పూజా విధానాలు చూస్తూ మరొకసారి మైమరచిపోయాం.
-స్వర్ణ కిలారి, క్యాతం సంతోష్కుమార్