ఎంత స్వచ్ఛం అంటే?
స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు. ఎలాంటి ప్రదేశంలో నిల్వ చేసినా 3000 సంవత్సరాల వరకు తాజాగానే ఉంటుందని ఆయుర్వేదం చెబుతున్నది.
ఏం కావాలి? : పుట్టగొడుగులు (బటన్ మష్రూమ్): ఎనిమిది, మైదా పిండి: ఒక టేబుల్ స్పూన్, మక్కజొన్న పిండి: ఒక టేబుల్ స్పూన్, బియ్యప్పిండి: ఒకటిన్నర టేబుల్ స్పూన్, కారం: పావు టీ స్పూన్, పసుపు: చిటికెడు, గరం మసాలా: అర టీ స్పూన్, ఉప్పు: తగినంత, ఫుడ్ కలర్: నాలుగు చుక్కలు, నూనె: సరిపడా.
ఎలా చేయాలి?
ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి, పొడి బట్టతో తుడవాలి. తర్వాత ఒక్కోదాన్ని నాలుగు ముక్కలుగా తరగాలి. మరోవైపు ఒక గిన్నెలో మైదా, మక్కజొన్న, బియ్యపు పిండి వేయాలి. అందులోనే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఫుడ్ కలర్, కొన్ని నీళ్లు పోసి కలపాలి. అప్పుడు పుట్టగొడుగు ముక్కలను అందులో వేసి, వాటికి పిండి బాగా పట్టేలా కలుపుకొని, పది నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత పొయ్యి మీద కడాయిలో నూనె వేడి చేసి, పుట్టగొడుగులను అందులో వేయించాలి. అంతే, వేడివేడి మష్రూమ్ 65 సిద్ధం.
రంగు మారొద్దంటే!
యాపిల్ పండును ముక్కలు చేస్తే.. కొద్దిసేపటికే రంగు మారతాయి. దీంతో తినాలనిపించదు. ఎవరికైనా ఇవ్వాలనీ అనిపించదు. అలాకాకుండా చాలాసేపటి వరకు తాజాగా, రంగు మారకుండా ఉండాలంటే యాపిల్ ముక్కలకు నిమ్మరసం అద్దాలి. తినేటప్పుడు మళ్లీ
కడుక్కుని తింటే పులుపు తగలదు.
రుచికరమైన కబుర్లు!
ఈ మధ్య చాలామంది భోజనప్రియులు ఫుడ్ బ్లాగర్స్గా మారుతున్నారు. ఆహార విశేషాలను అందరితో పంచుకుంటున్నారు. హైదరాబాద్కు చెందిన స్నేహ కూడా ఈ కోవకే చెందుతుంది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘thegluttonjournal’ పేరుతో ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నది. పదివేల మందికిపైగా ఆమెను ఫాలో అవుతున్నారు. ఈ ఫుడ్బ్లాగ్లో వంటలపై కొత్తకొత్త విషయాలు వండి వారుస్తున్నదామె. తను వెళ్లొచ్చిన రెస్టరెంట్ సంగతులు, అక్కడ రుచి చూసిన పదార్థాల వివరాలను పొందుపరుస్తున్నది. అంతేకాదు, వివిధ పాకాలపై విశ్లేషణ చేస్తుంది. స్వయంగా తాను వండిన విభిన్నమైన వంటల తయారీ గురించి పంచుకుంటుంది. మొత్తంగా వంటింటి ఘుమఘుమలను తాజాతాజాగా పంచుకుంటున్నది స్నేహ.
ఓన్ కెచప్స్
రెస్టరెంట్లలో ఈమధ్య కొత్త ట్రెండ్ నడుస్తున్నది. ముఖ్యంగా ఆహార పదార్థాలతోపాటు అందించే కెచప్, సాస్, మయొనీస్, చీజ్, సిరప్, నట్ బట్టర్లను నిర్వాహకులే సొంతంగా తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ కంపెనీల ఉత్పత్తులను కస్టమర్లకు అందించేవారు. నాణ్యత ఒక కారణం అయితే, ఖర్చు తగ్గించుకోవడం మరో కారణం.
అప్నా రసోయ్
సికింద్రాబాద్లోని సరోజనీదేవీ రోడ్లో ఉంటుంది అప్నా రసోయ్ రెస్టరెంట్. మల్టీ క్విజీన్, బిర్యానీ, చైనీస్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ వంటకాలకు ప్రత్యేకం. పేరుకు తగ్గట్టే శుచికరమైన వంటింట్లో తయారైన రుచికరమైన వంటకాలకు భోజనప్రియులు ఫిదా అవుతున్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు రూ.600లకే కడుపు నిండా తినొచ్చు. అందుబాటు ధరలో నాణ్యతతో కూడిన రుచికరమైన పదార్థాలను ఆస్వాదించొచ్చు.
గులాబ్జామూన్ సమోసా
వినడానికి కొత్తగా ఉంది కదూ..తింటే కూడా కొత్త రుచి వస్తుందని అంటున్నాడు ఢిల్లీకి చెందిన ఫుడ్ బ్లాగర్ అభిషేక్. ఇటీవల ఆయన చేసిన ప్రయోగమే ఈ గులాబ్జామూన్ సమోసా. గుండ్రటి నోరూరించే గులాబ్ జామూన్లను సమోసా పిండిలో దూర్చి నూనెలో వేయించాడు. తర్వాత దాన్ని తింటూ ఆయన చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నది. ఏదేమైనా ఈ రెండిటినీ ఇష్టపడేవాళ్లకు.. ఒకే దెబ్బకు రెండు రుచులన్న మాట.
క్యాప్సికమ్
వీటినే బెల్ పెప్పర్స్ అంటారు. ఇవి ఆకుపచ్చ, పసుపుపచ్చ, నారింజ, ఎరుపు రంగుల్లో దొరుకుతాయి. వీటిలో క్యాలరీలు తక్కువ, విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు.. విటమిన్-ఎ, ఇ, బి6, కె1, పొటాషియం, ఫొలేట్ అపారం. తరచూ క్యాప్సికమ్ తినడంవల్ల కండరాల క్షీణత, శుక్లాలు మొదలైన కంటి సమస్యలు తగ్గుతాయి. పచ్చి క్యాప్సికమ్ను తరిగి సలాడ్స్లో తింటే, రక్తహీనత దరిచేరదు. క్యాప్సికమ్లోని కాప్సాంథిన్, వయొలాక్సాంథిన్, ల్యుటీన్, క్విర్సెటీన్, ల్యుటియోలిన్ మొదలైన పదార్థాలు వివిధ ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి.
ఫ్రైకికీ..
హైదరాబాద్కు చెందిన కృష్ణ స్ఫూర్తి ‘ఫ్రైకికీ’ అనే ఫుడ్ స్టార్టప్ను ప్రారంభించింది. ఇక్కడ అతిపొడవైన ఆలూ ఫ్రైస్ ప్రత్యేకం. ఒక్కో ఫ్రై 40 సెంటీమీటర్లు ఉంటుంది. భారతీయ మసాలా దినుసులను జోడించి.. ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఫుడ్ను నగరవాసులకు పరిచయం చేస్తున్నదామె. హబ్సిగూడలో ఉన్న మాస్టర్ బ్రాంచ్కు త్వరలోనే హైటెక్సిటీలో గానీ, సన్సిటీలో గానీ ఉపశాఖను ఏర్పాటు చేస్తానంటున్నది కృష్ణస్ఫూర్తి. 2020 నుమాయిష్లో ఫ్రైకికీకి ‘యంగెస్ట్
ఎంట్రప్రెన్యూర్ అవార్డు’ అందుకున్నది. దాదాపు 12 దేశాలు పర్యటించిన స్ఫూర్తి అక్కడి స్ట్రీట్ఫుడ్ వెరైటీల స్ఫూర్తితో రకరకాల చిరుతిండ్లు తయారుచేసేది. మొదట వ్యాపకంగా మొదలైనా, ఇప్పుడు వ్యాపారంగా ప్రారంభించి అదుర్స్ అనిపించుకుంటున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News