‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ.
“వసుమతీ! అన్నం తిందువురా!” అని పిలిచింది ఎంకటమ్మ. సమాధానం రాలేదు. టైమ్ చూసింది. రాత్రి
ఎనిమిదైంది.
“ఏందిమే! మెత్తగుండావే? జరమేమన్నా వచ్చిందా?”.. బడి నుంచొచ్చి కాళ్లయినా కడుక్కోకుండా, అంతసేపూ ఒదుక్కొని పడుకున్న కూతుర్ని చూసి అడిగింది.
పలక్క పోయేసరికి దగ్గరికొచ్చి చెయ్యి పట్టుకుని చూసింది. వేడిగా తగిలింది.
“జరమొచ్చినట్టుంది. రోంత శారన్నం మెత్తంగ పిసికిస్చా.. తిను! ఈలోపల మాత్తర దెచ్చిస్చా. ఏసుకోని దుప్పటి గప్పుకోని గమ్మున పనుకో! వొల్లంతా సెమట పట్టిందంటే అదే తగ్గిపోతాది. రేపు బడికేం బోవద్దులే!”.. అన్నది.
అన్నం తినే గిన్నెలో అప్పటికే వేసిపెట్టిన ఊరిమిండి, కొంత అన్నం తీసేసి, మిగిలిన అన్నంలో చారు వేసి బాగా మెత్తగా పిసికిచ్చి, తినమని చెప్పి బయలుదేరింది. ఆర్ఎంపీ వాళ్లింటికి పోయి జ్వరం మాత్ర తీసుకుని వచ్చేసరికి అర్ధగంటైంది. వసుమతికి అన్నం సహించలేదు కాబోలు.. ఇంకా చారన్నం కెలుకుతూనే ఉంది.
పక్కింట్లో నుంచి టీవీలో ప్రధానమంత్రి ప్రసంగం వినిపిస్తున్నది. కొన్ని నిమిషాలు గడిచేసరికి కాస్త బిగ్గరగా మాటలు వినిపించాయి. ఏమైందోనని అటు కదలబోయిందల్లా ఆగి.. ముందు పాపతో మాత్ర మింగించి పడుకోబెట్టిన తర్వాత, నిదానంగా కనుక్కోవచ్చు లెమ్మనుకుంది. చారన్నం తినిపించి, మాత్రను సగానికి తుంచి చేతిలో పెట్టి, గ్లాసుతో నీళ్లు అందించింది. పాప నీళ్లు తాగి పడుకున్నాక తన పనిలో పడి పక్కింటి నుంచి వినిపించిన గోల విషయమే మర్చిపోయింది. ఆ రోజు 2016 నవంబర్ 8. అప్పుడు సమయం దాదాపు ఎనిమిదిన్నర.
మరుసటి రోజుకల్లా తగ్గిపోతుందని అనుకున్న జ్వరం రెండు రోజులైనా తగ్గలేదు. ఆలోచిస్తూ కూర్చుంది. మూడు పూటలా వెయ్యమని రెండు రోజులకూ మాత్రలిచ్చిన ఆర్ఎంపీ కూడా.. ఇది మాత్రలతో తగ్గేటట్టుగా లేదని, టౌనుకు తీసుకుపోయి ఆసుపత్రిలో చూపించమని చెప్పాడు.
‘ఆసుపత్రికి తోడ్కబొవ్వాలంటే రొండు మూడు నూర్లన్నా గావాల. ఏమన్నా పరీచ్చలు జేపియ్యడానికి ఇంగొక యెయ్యి రూపాలన్నా గావాల. యాడుంది అంత లెక్క? యాన్నించి దేవాల?’ అని దిగులుపడుతూ కూర్చుంది.
ఎవరిని చేబదులు అడగబోయినా.. అందరూ లేదనే అన్నారు. వాళ్లు, వీళ్లు అని లేకుండా అందరినీ అడిగి చూసింది. ఎవరి దగ్గరా సమయానికి డబ్బు లేదు. ఒక్క రూపాయి అప్పు పుట్టలేదు.
“ఏమి ఉపద్రమొచ్చిందర్రా! ఎవరికాడా లెక్క లేకండా పొయ్యేదాన్కి? నాకిచ్చేదాన్కే ఎవురికి సేతులాడ్డం లేదే?” అని నడివీధిలో అంగలార్చింది. ఆమె మాటలిన్న ఒకాయన..
“మ్మోవ్.. ఎంకటమ్మా! నిజంగానే దేశంలో ఉపద్రమే వొచ్చినట్టుండాది రొండ్రోజుల నుంచీ. ఎయ్యి, ఐదు నూర్ల నోట్లు ఎవురికాడ ఉన్నా చెల్లవని, అయ్యన్నీ దెచ్చి బ్యాంకీల్లో ఇచ్చి కొత్తనోట్లు దెచ్చుకోమనీ ఆర్డరేసింది గవుర్మెంటు. ఇంగ మిగిలిండేది చిల్లర నోట్లే. ఎవురికి వాళ్లు పెద్దనోట్లు బ్యాంకీల్లో కట్టేసి, చిన్ననోట్లు తెచ్చుకుండేదాంట్లో తలమునకలై ఉండారు. నీకిచ్చేదానికి చేతుల్రాగ్గాదు ఇయ్యంది. ఎవురికాడా లెక్క లేకనే. ఎవురికి వాళ్లు వాళ్ల దగ్గరుండే చిన్ననోట్లు వాళ్ల అవసరాల కోసం పెట్టుకోనుండారు. ఉండే ఆ రోంత లెక్కా నీకిస్చే రేప్పొద్దున వాళ్ల అవసరాలకెట్టా?” అని చెప్పి వెళ్లిపోయాడు.
అది ఆమెకు అర్థం కాలేదు. ‘ఒకేరోజులో లెక్క చెల్లకుండా పొయ్యేదేందబ్బా? యాడా ఇన్లేదే!’ అని విచిత్రపడుతూ నిలబడిపోయింది.
ప్రతి కరెన్సీ నోటూ ‘గ్యారంటీడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా’ అని, ఆ గ్యారంటీని ఆ ప్రభుత్వమే తూచ్ అనేసి వెనక్కి తీసేసుకున్నదని ఆమెకు తెలియదు. ప్రస్తుతం ఆమె ఆలోచనల్లా ఒకటే..
“అమ్మిని ఆసుపత్రిలో జూపియ్యాలంటే ఎయ్యి, పదైదు నూర్లన్నా గావాల. అంత లెక్క నా కాడ యాడుంది? ఏ బ్యాంకీలో అన్నా దొంగతనానికి బోవాల్సిందే!”.. మనసులో మాటనే బయటికి అనేసింది.
“దొంగతనానికెందుకూ? బ్యాంకీలో నీ అకౌంటే ఉంది గదా?”.. ఆ దారిన పోతూ, ఆమె మాటలు విన్న జన్మభూమి కమిటీ మెంబరు గుర్తుచేశాడు.
అప్పుడు గుర్తొచ్చింది రెండేండ్ల కింద తన పేరుమీద బ్యాంకులో అకౌంటు తెరిచిన సంగతి. దానిపేరు ‘జన్ ధన్’ అకౌంట్.
* * *
“నాకెందుకు బ్యాంకకౌంటు?”.. ఊర్లో బ్యాంక్ అకౌంట్లు లేనోళ్లందరికీ అకౌంట్లు తెరిపించాలని వచ్చిన జన్మభూమి కార్యకర్తను అడిగింది.
“ఇప్పుడు నువ్వు ఉపాధి హామీ పనికి పోయినప్పుడు అదేరోజు నీకు లెక్క ముట్టలేదనుకో.. నువ్వు రోజూ పని మానుకొని కోఆర్డినేటరు చుట్టూ ఎప్పుడిస్తాడోనని తిరగనవసరం ల్యాకండా జీతం పడినట్టే నేరుగా నీ అకౌంట్లో వచ్చి పడతాది”.
“ఆ నా బట్ట ఏసిందీ లేన్దీ నాకెట్టా తెలుస్చాది?”.
“నీ ఫోనుకు మెసేజొస్చాది. ఎవురన్నా నీ అకౌంట్లో లెక్క ఏసినా తీసినా.. టింగు టింగుమని బెల్లు కొడ్తాది”.
“అది రోజుకు ముప్ఫైసార్లు ఒకటే మొఖాన కొడ్తానే ఉంటాది. ఎన్నిసార్లని జూసుకునేది?”.
“చూసుకోవాల. ‘డీఎన్డీ’ అని ఒకటుందిలే! అది బెట్టుకుంటే అన్ని ఫోన్లూ, మెసేజీలూ రావు. నీగ్గావాలంటే నేను సెట్ జేసిస్చా”.
“ముందాపని జేసిబెట్టు నాయనా! నీకు పున్నెముంటాది”.
“సరే.. సేస్చాలేగానీ నీ ఆధార్ కార్డు తీసకరా”.
“అద్దేనికి?”.
“రామాన్నెమంతా యిని నీ యట్టాట్దే అడిగిందంట.. రామునికి సీతేమైతాదని. ఇంగెందుకు నేనొచ్చింది? బ్యాంకీలో నీకు అకౌంటు తెరిసేదానికి”.
“నాకు రావాల్సిన లెక్కంతా బొయ్యి బ్యాంకీలో గూచ్చుంటే నేను దెచ్చుకుండేదెట్టా?”.
“నీకు అకౌంటుతో బాటే ఏటీఎం కార్డు గుడకా ఇస్చారు. అదుంటే నువ్వు బ్యాంకీకి బొవ్వాల్సిన పన్లా. టౌన్లో ఈదికొకటుండాయి ఏటీఎం మిసన్లు. అయ్యి ఇరవై నాలుగ్గంటలూ తెరిసే ఉంటాయి. నీకెప్పుడు గావాలంటే అప్పుడు బొయ్యి ఆ కార్డు ఆ మిసన్లో బెట్టి.. నాకింత లెక్కగావాలని బటన్లు వొత్తుతే నోట్లు మిసన్లోనుంచి వస్చాయి”.
“యా బటనొత్తాలో నాకెట్ట దెలుస్చాది?”.
“ఒక్కసారి జూస్చే అన్నీ నీకే దెలుస్చాయి. ఒకటి మాత్రం బాగ గుర్తుబెట్టుకో! ఎవురికే గానీ.. ఆకిరికి ఆ బ్యాంకీవోడే అడిగినా గానీ నీ కార్డు మీదుండే నంబర్లు గానీ, నీకు మెసేజ్లో వొచ్చే నంబర్లు గానీ చెప్పనేవొద్దు”.
“ఆ నంబర్లేమన్నా బాగ్గెమా? సెప్తే ఏమైతాది?”.
“నీ అకౌంట్లో ఉండే లెక్క మొత్తం ఊడ్సుకోని బోతాది”.
“ఓయమ్మా! ఈ అకౌంటు జేసియ్యమని నేన్నిన్ను అడిగినానా? ఇప్పుడు నాకెందుకియ్యన్నీ?”.
“కేంద్రంలో ప్రభుత్వం మారిపోయిండ్లా? ఇంతకు ముందున్నె కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మనిషికీ ఆధార్ కార్డ్ ఇచ్చింటే తీసుకున్నారా లేదా? పనికి ఆహార పథకం అని రోజు కూలీకి ఉపాధి హామీ పనులు ఇస్చే సేస్చండారా లేదా? ఇప్పుడు మోడీ ప్రభుత్వమొచ్చింది. ఇన్నేండ్లూ పెద్దపెద్దోళ్లు విదేశాల్లో దాసిపెట్టుకోనుండే లప్పలన్నీ తీసుకచ్చి అందరికీ పంచుతారంట. తర్వాత ఎవరికీ పనికి ఆహార పథకాలు పెట్టాల్సిన పన్లే!”.
“అయ్యన్నీ అయ్యే పనులు గావులేగానీ.. ఇదో ఆదార్ కారటు”.
“ఇదో ఈ ఫారమ్మింద సంతకంబెట్టు!”.
‘ఎంకటమ్మ’ అని సంతకాలు పెట్టించి, తీసుకుపోయి రెండ్రోజుల తర్వాత పాసుబుక్కు, ఏటీఎం కార్డు తెచ్చి ఇచ్చాడు.
“నీకు రోజూ ఏదో ఒకదానికి లెక్క అవసరమైతానే ఉంటాది. కానీ, ఎప్పుడో ఒకసారి మాత్రం పానం మిందికొస్చాది. అది అత్యవసరం. అప్పుడు వాడుకోవడానికి నీ చేతిలో లెక్కలేకుండా పోయే పరిస్థితి తెచ్చుకోకుండా అప్పుడప్పుడూ రోంత లెక్క ఈ అకౌంట్లో ఏసుకుంటా ఉండు. అది అత్యవసరమైన పరిస్తితుల్లో నీకు అక్కరకొస్చాది”.. అని అతడు చెప్పిన మాట వంటబట్టించుకుని, మొదట్లో చేతికి డబ్బు వచ్చినప్పుడల్లా ఎంత వీలైతే అంత అతనికే ఇచ్చి.. అకౌంట్లో వెయ్యమని చెప్పింది. ఆ అకౌంట్లో దాదాపు రూ.1,500/- జమజేసి పెట్టింది. తర్వాత మెల్లగా దాని గురించి మర్చిపోయింది.
* * *
‘ఈ రొండేండ్లల్లో దాని మిందొచ్చిన వొడ్డీ దగ్గర దగ్గర నూర్రూపాయలైనా అయ్యింటాది. రేబ్బొయ్యి అద్దెచ్చుకోవాల!’ అనుకుంది.
అప్పుడట్లా అనుకుని ధైర్యం తెచ్చుకుంది గానీ, మరుసటిరోజు టౌనుకు పోయి అక్కడి పరిస్థితి చూసేసరికి ఆమెకు దిమ్మ తిరిగిపోయింది. బస్టాండుకు దగ్గరగా ఉండి, తనకు బాగా తెలిసిన ఏటీఎం దగ్గరికి పోయి చూసింది. ఎవ్వరూ లేరు. కాసేపు అక్కడే నిలబడింది. ఈలోపు ఆ దారెంట ఎవరో పోతూ ఉంటే దగ్గరికి పోయి పిలిచింది.
“అన్నా! అకౌంటులో నుంచి లెక్క దీసుకోవాల”.. ఆమె చెప్పేది ఇంకా పూర్తికాక ముందే అతను సమాధానం ఇచ్చాడు..
“ఏ ఏటీఎంలో గానీ లెక్క లేదు మ్మో! దాని గురించే మూడ్రోజుల్నించి దేశమంతా అగ్గయితా ఉంది. నీకు తెలియదా?”.
“ఏందీ? ఈ మిసన్లలో గుడకా లెక్క లేదా? అయితే ఇప్పుడెట్ట జెయ్యాలన్నా? లెక్క బ్యాంకీకి బొయ్యి దెచ్చుకోవాల్నా?”..
ఒకవేళ అవునంటే బ్యాంకులో ఎట్లా తెచ్చుకోవాలో తెలియకపోయినా అయోమయంగా అడిగింది. అతను విసుక్కోకుండా పెద్దనోట్ల రద్దు గురించి వివరంగా చెప్పాడు.
అక్కడినుంచి మొదలుపెట్టి టౌన్లో ఉండే ఏటీఎం సెంటర్లన్నీ చుట్టబెడుతూ కాలుగాలిన పిల్లిలా రోజంతా తిరుగుతూనే ఉంది. యర్రముక్కపల్లెలో ఎక్కడో ఏటీఎంలో డబ్బు నింపారని విని ఆపసోపాలు పడుతూ అక్కడికి పరుగెత్తింది. అక్కడ చేంతాడంత క్యూ ఉంది. ఇద్దరు ముగ్గురి వంతు కాగానే ఏటీఎం ఖాళీ. ఉసూరుమని కూలబడగానే ఇంకెక్కడో ఏటీఎంలో డబ్బు నింపుతున్నారని విని అక్కడికి పరుగు.
ఎండాకాలంలో నీళ్లకోసం పడిన కష్టాలు
గుర్తొచ్చినాయి.
ఊర్లోని బావులు, చేతి పంపులన్నీ ఎండిపోయిన కాలంలోనే వ్యవసాయ భూముల్లో సాగునీళ్లకు కరెంటు మోటార్ల వాడకం మొదలైంది. అప్పట్లో మోటార్లకు కరెంటు రాగానే పొలాలకు నీళ్లకోసం మోటారు వేసి ఉంటారు కాబట్టి.. ఊరివాళ్లంతా పొలోమని బిందెలు చేతబట్టుకుని పడుతూ లేస్తూ కిలోమీటరు దూరం పరుగెత్తి, ఉరుకులు పరుగుల మీద నీళ్లు తెచ్చుకునేవాళ్లు. ఒక మోటార్ ఆడకపోతే అక్కడికి దగ్గర్లో ఉండే ఇంకొక మోటర్ దగ్గరికి, అక్కడా లేదంటే మరొక మోటార్ దగ్గరికి.. నడుస్తున్న మోటార్ ఆఫ్ కాకముందే చేరుకోవాలని బిందెలు పట్టుకుని పోటీల మీద పరుగెత్తేవాళ్లు.
ఇప్పుడు తన లెక్క (డబ్బు) తను తీసుకోవడానికి ఊరంతా పరుగులు తియ్యాల్సి రావడంతో ఏడుపొచ్చింది. మూడు రోజులు అదే విధంగా గడిచింది. రోజురోజుకూ గంటగంటకూ ధైర్యం దిగజారిపోతూ ఉంది. నాలుగో రోజు.. ఏ దేవుడో తన మొర ఆలకించినట్లు నగదు నిల్వలున్న ఏటీఎంలోకి ప్రవేశం లభించింది. దేవుడిని మొక్కుకుని ఏటీఎం కార్డు బయటికి తీసి తన వెనకున్న అతనికి ఇచ్చి..
“ఇది ఎట్ట వాడాల్నో నాకు తెలవదు! ఎప్పుడూ వాడిన్దాన్ని గాదు. ఇప్పుడంటే పానమ్మిందికొచ్చి ఇట్టొచ్చినా. రోంత లెక్క తీసిస్చావా సారూ?” అని అడిగింది.
అతను పిన్ అడిగి, ఏటీఎం కార్డును స్లాట్లో పెట్టాడు.
పిన్ వెరిఫికేషన్ తర్వాత..
“ఎంత గావాల?” అని అడిగాడు.
“పదైదు నూర్లు!” అని చెప్పింది. అతను వింతగా చూశాడు. మాట్లాడకుండా 1500 ఎంటర్ చెయ్యగానే, స్క్రీన్ మీద ఏదో మెసేజ్ కనిపించింది. ఇంగ్లీషు కాబట్టి.. అదేమిటో ఆమెకు అర్థం కాలేదు.
అతను వివరించాడు..
“అమ్మా! ఇప్పుడు ఐదు నూర్ల నోట్లు, వెయ్యి రూపాయల నోట్లు లేవుగదా? నూర్రూపాయల నోట్లకు దేశంలో కొరతొచ్చింది. ఇందులో రెండువేల నోట్లే ఉండాయి. కాబట్టి రెండువేల రూపాయలకు తక్కువైతే రావు”..
నాలుగు రోజులనుంచి ఎదురవుతున్న పరిణామాల వల్ల మెదడు మొద్దుబారిపోయి, బాహ్యస్మృతి కోల్పోయినదానిలా ఆమె రెండువేల రూపాయలే తియ్యమని చెప్పింది. అతను అమె చెప్పినట్లే 2000 ఎంటర్ చేసి..
“ఇన్సఫీషియంట్ బ్యాలన్స్!” అని చదివాడు.
“ఏమ్మా! నీ అకౌంట్లో ఎంతుంది?” అని అడిగాడు.
“ఉంటే ఒక పదైదు.. పదారు నూర్లుంటాది నాయనా!” అని చెప్పింది.
“ఇప్పుడు ఏటీఎంలో రెండువేల కంటే తక్కువ తీసుకోవడానికి లేదు. నీ అకౌంట్లోనేమో అంత డబ్బు లేదు. బ్యాంకుకు పోయి అడిగి చూడు” అని సలహా ఇచ్చాడు.
బ్యాంకుకు పోయి చూస్తే అదొక పెద్ద తిరునాళ్లలా ఉంది. రద్దయిన నోట్లు డిపాజిట్ చెయ్యడానికి కౌంటర్ల చుట్టూ గోలగోలగా ఫోన్లలోనూ, ఎదుటి మనుషులతోనూ మాట్లాడుతూ.. ఇసుకేస్తే రాలనట్లు కిక్కిరిసిపోయిన జనం. అక్కడ ఒకరిద్దరిని అడగబోయినా పట్టించుకునే స్థితిలో ఎవరూ లేరు. ఇంకెవరిని ఏమడగాలో తెలియక తిరిగి వెనక్కి వచ్చేసింది.
దిగులుగా ఇల్లు చేరుకుంది. మగతగా పడుకుని ఉన్న కూతురికి, ఆమె వచ్చినట్లయినా తెలుసో లేదో అర్థం కావడం లేదు. బలవంతంగా లేపి కూర్చోబెట్టి గంజి తాగించింది. కూతురి పరిస్థితి చూస్తూంటే దిగులుగా ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే ఏమవుతుందోనని భయం కూడా వేసింది.
మరుసటిరోజు పొద్దున్నే ఏమైతే అదైందని కూతుర్ని వెంటబెట్టుకుని ఆసుపత్రికి బయల్దేరింది. అప్పటికి జ్వరం మొదలై వారం రోజులు దాటింది. తనవంతు రాగానే కన్సల్టేషన్ రూములో డాక్టర్కు రెండు చేతులెత్తి నమస్కారం చేసి.. పరిస్థితి వివరించింది. డాక్టర్ సానుభూతితో విన్నాడు.
“నగదు లేకపోతే పోయింది.. పేటీఎం ఉందా?” అని అడిగాడు.
“ఏటీఎం కారటుంది”.
“ఏటీఎం గాదు. పేటీఎం!”.
“అదేందో తెల్దు సారూ. నా కాడ ఏటీఎం కారటు, ఆదార్ కారటు ఇయ్యే ఉండాయి”.
“పేటీఎం అనేది కార్డు గాదు. ఫోన్లో ఉంటాది. అదుంటే అకౌంట్లో నుంచి ఎవురికైనా లెక్క పంపియ్యచ్చు”.
“అదేందో కూడా నాకు దెలియదు. ఇప్పుడు ఏటీఎంలో ఇరక్కపోయినట్లు దాంట్లో కూడా లెక్క ఇరక్కపోతే?”.
డాక్టరు నవ్వాడు.
“అది నా పోన్లో బెట్టను ఐతాదా?”.. అంటూ ఫోన్ తీసి చూపించింది.
“నీది స్మార్ట్ఫోన్ కాదే? దీంట్లో పేటీఎం కుదరదు. ఏం చేద్దాం..? సరే! నా ఫీజు సంగతి తర్వాత చూసుకోవచ్చు. పాపను బెంచి మీద పడుకోబెట్టు” అని పరీక్ష చేసి చూశాడు.
టైఫాయిడ్, మరికొన్ని రోగనిర్ధారణ రక్త పరీక్షలు రాసిచ్చాడు.
పరీక్షలు రాసిచ్చిన చీటీ తీసుకుని, కూతుర్ని ఎత్తుకుని ల్యాబ్కు బయల్దేరింది. ల్యాబ్ కౌంటర్లోని వ్యక్తికి చీటీ అందిస్తూ..
“డాక్టరు ఈ పరీచ్చలు రాసిచ్చినాడు. గానీ నా డబ్బంతా బ్యాంకీలోనే ఉండాది. బిల్లెట్లా కట్టాలో తెల్డం లేదు” అని చెప్పింది.
వాళ్ల దగ్గర స్వైపింగ్ మెషీన్ లేదు. వాళ్ల దగ్గరే కాదు, ఒక మాదిరి పేరున్న ఆసుపత్రుల్లో, ల్యాబుల్లో, ఇతర షాపుల్లో ఎక్కడా ఇంకా కార్డు పేమెంట్లకు మారలేదు.
బిల్లు కట్టకపోతే టెస్టులు చెయ్యడం కుదరదని చెప్పారు. వాళ్లకు సాయపడాలనే ఉన్నా.. టెస్టులకయ్యే ఖర్చు చేతినుంచి పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అదైనా పదో ఇరవయ్యో కాదు కాబట్టి. మళ్లా ఈసురోమని ఆసుపత్రికి తిరుగుముఖం పట్టింది.
“ఈ పరీచ్చలు నా పానం మిందికొచ్చినాయి సారూ! అయ్యి లేకుండా మాత్తర్లు, మందులు రాసియ్యలేవా?” అని దీనంగా అడిగింది.
“టెస్టుల్లేకుండా మందులివ్వగలిగితే ఏ డాక్టరైనా ఈ ఖరీదైన పరీక్షలెందుకు రాయిస్తారమ్మా? ఈ జ్వరం ఎందుకొచ్చిందో, మామూలు పారాసిటమాల్ మాత్రలకు ఎందుకు తగ్గడం లేదో తెలుసుకుంటే తప్ప సరైన మందు ఇవ్వలేం. ఏం జ్వరమో కేవలం లక్షణాలను బట్టి కనుక్కోలేనప్పుడే పరీక్షలు రాయిస్తాం. అవసరమైన మందుకు బదులు వేరే మందులు వాడటమంటే.. ఏ ఊరికి పోతుందో తెలియని బస్సెక్కి మీ ఊరికి పోవాలనుకున్నట్లే! అన్ని మందులూ ఇచ్చి చూద్దామంటే.. అన్ని మందులు ఒకేసారి వాడితే శరీరం తట్టుకోలేదు. వాటిలో కొన్ని మందులు రోగం లేనప్పుడు వాడటం ప్రమాదం కూడా!” అని చెప్పాడు డాక్టర్.
ఇంకేమనాలో తెలియక చివరిసారి గట్టిగా నిట్టూర్చి.. అప్పటికే కొనప్రాణంతో ఈడిగిలపడి ఉన్న కూతుర్ని భుజాన వేసుకుని ఊరి దారిపట్టింది. కూతురి ఒళ్లు మెల్లగా చల్లబడటం.. ఇల్లు చేరేవరకూ ఆమె గమనించనే లేదు.
త్రివిక్రమ్
త్రివిక్రమ్ స్వస్థలం కడప జిల్లా పడిగెలపల్లె. ఎంసీఏ చేసి, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఇంటర్నెట్లో యూనికోడ్ తెలుగువ్యాప్తికి విశేషంగా కృషిచేసిన తొలితరం తెలుగు బ్లాగర్లలో ఈయన ఒకరు. అదే లక్ష్యంతో ఏర్పడిన ‘ఈ-తెలుగు’ సంస్థకు వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా, తెలుగు వికీపీడియా నిర్వాహకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘పొద్దు’ తెలుగు వెబ్ మాగ
జైన్కు వ్యవస్థాపక సంపాదకుడిగా, ‘ఈమాట’ సహ సంపాదకుడిగా
వ్యవహరించారు. ఇంటర్నెట్లో సొంత పేరుతోనూ, ‘సుగాత్రి’ కలం పేరుతోనూ విభిన్న అంశాల గురించి విస్తృతంగా వ్యాసాలు రాశారు. కథకుడిగా ‘అద్దంలో మూట’ కథే.. మొదటిది. అంతకుముందు చందమామలో శాస్త్ర జ్ఞానం – లోక జ్ఞానం సింగిల్ పేజీ కథ, చతురలో మినీ కథల రూపంలో కొన్ని హాస్య రచనలు ప్రచురితమయ్యాయి.
-త్రివిక్రమ్,99010 65406