జరిగిన కథ : ధనికరాజ్యం వెలనాడును ఓడించిన కాకతీయ సైన్యాలు.. ఆ తర్వాత ద్వీపరాజ్యంపై దండెత్తాయి. వెలనాడు ధనాగారాన్ని స్వాధీనం చేసుకొన్నాయి. వెలకట్టలేని సంపదతోపాటు సంపన్నమైన ద్వీపరాజ్యాన్నీ పొందిన కాకతీయ ప్రభువు.. ఓడిన పినచోడుడినే ద్వీపరాజ్యానికి సామంతుడిగా ప్రకటించాడు. అదే సమయంలో పినచోడుని కవల పిల్లలైన నారాంబ, పేరాంబను బందీలుగా రాజధానికి తీసుకుపోవడానికి నిర్ణయించాడు మల్యాల చౌండ. కాకతీయ సైన్యాల వెంట పినచోడుని ప్రియపుత్రికలు బందీలుగా వెళ్తుండగా.. వారి తమ్ముడు జాయప ఎవరికీ తెలియకుండా పల్లకిలోకి ఎక్కాడు. దారిలో కాకతీయుల చతురంగ బలగాల మధ్య స్వేచ్ఛగా తిరిగాడు. మల్లరుద్రుడు ఏర్పాటు చేసిన విందు సందర్భంగా.. తన నాట్య కౌశలాన్ని, దండరాసకం, దొమ్మరి కళలనూ, పామరరంజకమైన విన్యాసాలనూ ప్రదర్శించాడు. దాంతో అక్కడున్న వారంతా జాయప నాట్యానికి, పాటకు, ఆటకు దాసోహం అయ్యారు. అతణ్ని వింతగా చూస్తూ.. ‘ఈ బాలుడు మానవమాత్రుడు కాదు. దైవాంశ సంభూతుడు’ అంటూ చేతులు జోడించారు. అప్పుడే అక్కడికి వచ్చిన చౌండ సేనాని.. ఆనందంతో జాయపను ఎత్తుకున్నాడు. తన మత్తగజంపై ఎక్కించుకొని.. అనుమకొండకు దారి తీశాడు చౌండ సేనాని.
కాకతీయ విజయ సేనాసారథి మల్యాల చౌండయ సేనాని మహామత్తగజంపై.. అలంకరించిన అంబారీలో అనుమకొండ పుర ప్రవేశం చేశాడు. పక్కనే చిన్నారి జాయప. అలా జాయప.. ఉత్తరోత్తరా తను మహత్తర పాత్ర పోషించబోయే అనుమకొండ పురంలోకి ప్రవేశించాడు.ఆరోజు.. సంధ్యవేళ. అనుమకొండ ఊరు ఊరంతా చౌండ నాయకునికి స్వాగతం చెప్పడానికి వచ్చేసింది. ఆ అంబారీ అంతటి ఎత్తున స్వాగత స్థూపం నిర్మించి, అందులో కాకతీయ సామ్రాట్టు గణపతిదేవుడి తరఫున స్వాగతం చెప్పడానికి వచ్చేసిన మహాప్రధాని గంగాధర మంత్రి, సకల సేనాధిపతి రేచర్ల రుద్ర సేనాని నిల్చుని ఉన్నారు. మహాగజం కోటలోకి ప్రవేశించగానే జయజయ ధ్వానాల మధ్య చౌండను నిలువెత్తు పుష్పమాలలతో సత్కరించి, స్వాగతం పలికారు. వెంటనే వందిమాగధుల అభినందనల మధ్య పరిచారికలు పుష్పవర్షం కురిపించారు.ఈ హడావుడిలో మెల్లగా మత్తగజాన్ని దిగి జనంలో కలిసిపోయాడు జాయప.అంతకు ముందురోజు నతవాడి రాజ్యపు విందూ, విలాసాలలో తేలియాడిన కాకతీయ సైన్యం.. మరునాడు ఉదయమే బయల్దేరలేక పోయింది. ఉదయం అందరికీ ఫలహారాలు, తినుబండారాలు కూడానతవాడి ప్రభువే ఏర్పాటుచేస్తే.. అవికూడా స్వీకరించి ఆనక తాపీగా కదిలింది సైనిక పటాలం.
మరో రెండురోజుల తర్వాత సంధ్యవేళకు కాకతీయ రాజ్య సరిహద్దులలోకి ప్రవేశించాక సైనికదళాలు విడిపోవడం ప్రారంభమైంది. తమతమ దళపతుల అనుమతితో సైనికులు తమ మండలాలకు, ఊళ్లకు వెళ్లిపో సాగారు. సేనానులు, నాయకులు, దళపతులు, సమాహర్తలు, అధీకృతులు, అనుమకొండ, ఓరుగల్లు ప్రాంత నివాసులైన సైనికులు, ఇతర ముఖ్యులు మాత్రమే అనుమకొండ పురం లోపలికి ప్రవేశించారు. అపూర్వ ఘట్టంగా ఆ స్వాగత సంరంభం సాగింది. విజయులై వచ్చిన సైనికుల కుటుంబాలలో వారివారి పరస్పర ఉద్వేగ ఆలింగనాలతో అనుమకొండ పురవీధులు పులకించిపోయాయి. అదే సందర్భంగా పెద్దపెట్టున వర్షం కురిసి ప్రకృతి తన స్వాగతాన్ని తెలిపింది. అనుమకొండపురం పరిసరాలు ఆనందోత్సాహాల మధ్య పరవశిస్తుండగా, ఈ సందడికి ఆవలగా చిన్నగా కురుస్తున్న వర్షంలో.. కార్తికమాసపు పలుచని చలిరాత్రి వేళ.. చిన్నారి జాయప తన బుడిబుడి అడుగులతో ఒంటరిగా అనుమకొండ పురవీధులలో నిశ్శబ్దంగా నడుస్తున్నాడు.
పోనుపోనూ సంబురాల కోలాహలం దూరం అవుతున్నది. అనుమకొండ వీధులు నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా ఉన్నాయి. ద్వీప రాజకుమారుడైన జాయప ఎప్పుడూ అంతఃపురం దాటినవాడు కాదు. సాధారణ పురాలు, గ్రామాలు ఎలా ఉంటాయో ఆ చిన్నారికి తెలియదు. రాచభటుల మధ్య అమ్మానాన్నలతో ఏ గుడికో, బంధుమిత్రుల ఇంట జరిగే వేడుకలకో వెళ్లడం మాత్రమే అనుభవం ఉన్నవాడు.
అలాంటివాడు ఈరోజు ఇలా ఒంటరిగా రాత్రివేళ తనకు అస్సలు పరిచయం లేని ఓ రాజధాని నగరపు రాచవీధులలో జంకూగొంకూ లేకుండా అటూ ఇటూ చూసుకుంటూ ముందుకు పోతున్నాడు. చిన్నచిన్న మిద్దెలు, పెంకుటిళ్లు, పూరిళ్లు, అక్కడక్కడా బాట పక్కన స్తంభాలపై ఆముదపు కాగడాలు, ఇళ్ల ముందు బర్రెలు, ఆవులు, గొర్రెలు, కుడితి తొట్టెలు, గడ్డి
వాములు, అరుగులపై నులక మంచాలలో నిద్రిస్తున్న వ్యక్తులు.. అక్కడక్కడా కుక్కలు.. కొన్ని మొరుగుతుంటే కొన్ని పడుకొని ఉన్నాయి.
అటు ఇటు చూస్తూ పోతుండగా ఆవలగా చిన్న సందులాగా ఉంది. అక్కడ ఓ పిల్లాడు.. సరిగ్గా తన ఈడువాడు ఏడుస్తున్నాడు. గట్టిగా గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు చాలాదూరం వరకూ జాలిగా వినిపిస్తున్నది. దిగ్భ్రమతో అక్కడ ఆగాడు జాయప. ఆ పిల్లవాడు జాయపను చూసి మరింత గుక్కపట్టి ఏడ్చాడు. జాయప ఇంకా దగ్గరికెళ్లి బాధగా, అనునయంగా, ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడా పిల్లవాడు కళ్లు తుడుచుకుని ముక్కు ఎగబీల్చి..“మీ నాన్న బతికే ఉన్నాడా?!” అని అడిగాడు.ఏమీ అర్థం కాలేదు జాయపకు.మళ్లా ఆ పిల్లవాడే అన్నాడు..“నువ్వు ఏడవడం లేదంటే.. మీ నాన్న బతికే ఉన్నాడు కదూ!”..అప్పుడే లోపలినుంచి ఓ ఆడపిల్ల.. బహుశా అతనికంటే పెద్దది బయటికొచ్చింది. ఆవలగా ఆ గుడిసె గుమ్మం, లోపలినుంచి దీపపు గుడ్డివెలుగు. అక్కడ మరోవ్యక్తి. ఆ వ్యక్తి ఓ మహిళగా, ఈ పిల్లలకు తల్లిగా పోల్చాడు జాయప.అప్పుడన్నాడు ఆ పిల్లవానితో జాయప..“నాన్న?. మీ తండ్రిగారు.. ఏమైంది??”.“చచ్చిపోయిండు..” టక్కున చెప్పాడా పిల్లవాడు.“ఎక్కడ? ఎలా? ఎప్పుడు?” అడిగాడు జాయప.అప్పుడా ఆడపిల్ల ముందుకొచ్చి ఆరిందాలా చెప్పింది.“రాజుగోరు యుద్ధానికి రమ్మంటే మా నాన్న పోయిండు. గాడ చచ్చిపోయిండు”.. చెబుతూనే బావురుమంది.
వెంటనే ఆ పిల్లవాడు, లోపల వాళ్లమ్మ.. ముగ్గురూ గట్టిగా గుండెలు అవిసేలా ఏడ్చారు.మతిపోయింది చిన్నారి జాయపకు. ఇది ఏమాత్రం తెలియని ఊహాతీతమైన అనుభవం.
“నాపేరు జాయప..” అన్నాడు.అతని మంత్రం పనిచేసింది. వాళ్లు ఏడుపు ఆపేసి తమ పేర్లు చెప్పారు. అది ‘గోపయ’ అనే సైనికుని కుటుంబం. అతని భార్య రుక్కమ, కూతురు చుక్కమ, కొడుకు భైరవ. నిజానికి గోపయ చెప్పులు కుట్టుకునే వృత్తిదారుడు. యుద్ధసమయంలో అవసరమైతే ప్రతిపౌరుడినీ సైన్యంలోకి రావాల్సిందిగా శాసనపత్రం జారీచేస్తారు. అలా గోపయ యుద్ధానికి వెళ్లాడు. కానీ చనిపోయాడు. చనిపోయిన సైనికుల వివరాలు యుద్ధం జరుగుతుండగానే యుద్ధవేగుల ద్వారా రాజధానికి చేరుతాయి. ఆయా కుటుంబాలకు తెలియజేసి, వారికి పూర్తి ఆసరా ఏర్పాటుచేస్తారు. తదనంతరం వారి వీరోచిత యుద్ధ విన్యాసాలను రాజ్యమంతటా దండోరా వేసి చెప్పి.. తగిన బిరుదు, గౌరవ పరిహారం ప్రకటిస్తుంది రాజ ప్రభుత్వం.గోపయ వీరమరణం పొరపాటున నమోదు కాలేదు. ఆయన బతికే ఉన్నాడని.. యుద్ధంలో గెలిచారు కాబట్టి విజయవంతంగా తిరిగి వస్తున్నాడని కుటుంబసబ్యులు సంబురంగా ఎదురు చూస్తున్నారు. అతను రాలేదు. మరణ వార్త ఇప్పుడే తెలిసింది. బతుకులు కుప్పకూలిపోయిన వారి బాధ వర్ణనాతీతం.
ఈ వివరాలు తెలిసినా అర్థం చేసుకునే వయసులేని జాయపకు వారి దుఖాన్ని అర్థం చేసుకుని స్పందించే హృదయం ఉంది. వారు ఏడుస్తుంటే తనకూ ఏడు పొచ్చింది. కారణం.. తనకు అమ్మ, నాన్న గుర్తొచ్చారు. అక్కలు ఏమయ్యారో.. వారి పల్లకి ఎటు వెళ్లిందో తెలియదు. జాయప కూడా వారితో కలిసి బిగ్గరగా ఏడ్చాడు. వాళ్లు ఆశ్చర్యపోయారు. “ఎందుకు బిడ్డా.. ఏడుస్తున్నవు?” అన్నది గోపయ భార్య రుక్కమ. చుక్కమ, భైరవ కూడా కళ్లు తుడుచుకుంటూ జాయపవంక ఆశ్చర్యంగా చూశారు. “మీ తండ్రిగారు చనిపోయారు కదా!”.. ఏడుపు ఆపి అన్నాడు జాయప. వాళ్లు ముగ్గురూ జాయప వంక విచిత్రంగా చూశారు.‘ఎవరీ పిల్లవాడు? చూస్తే ఈ ఊరివాడిలా లేడు. మాటకూడా తేడాగా ఉంది!’. అనుకుంటూ.. ఏం చెయ్యాలో తోచక మళ్లీ ఏడ్చారు. జాయప కూడా వాళ్లతో గొంతు కలిపి ఏడుస్తూనే ఇంట్లోకి వివరంగా చూశాడు. విజయంతో తిరిగొస్తున్న గోపయ కోసం ఇంటిని చక్కగా అలికి, ముగ్గులుపెట్టి.. మంచి వంటలుచేసి ఎదురుచూస్తున్నారు. ఆనందం కాస్తా విషాదం అయ్యింది. అలాంటి విచిత్రవేళ ఆ ఇంటికి వచ్చిన జాయపకు ఈ విశ్లేషణ అర్థం కాలేదు కానీ.. ఈ విషాదమూ, దానికి ముందున్న సంతోషమూ అర్థమైంది. చటుక్కున..“ఆకలవుతున్నది” అన్నాడు.
ముగ్గురూ ఏడుపు ఆపారు. రుక్కమ లేచి కంచు పళ్లెరంలో వరి అన్నం, రెండు కూరలు, పాలతాలికలు వడ్డించి..“తిను బిడ్డా.. యాడ, ఎప్పుడు తిన్నవో!?” అన్నది.జాయప ఆ పళ్లెం చుక్కమ ముందుకు తోసి, రుక్కమను అనుకరిస్తూ..“తిను బిడ్డా.. యాడ, ఎప్పుడు తిన్నవో!?” అన్నాడు.ముగ్గురూ ఆ విషాద కొలనులో తామరలు వికసించినట్లు.. మందస్మితులయ్యారు. రుక్కమ తనపిల్లలకు కూడా వడ్డించింది. జాయప వంక విచిత్రంగా చూస్తూ తమ దుఃఖాన్ని తాత్కాలికంగా మరిచి అందరూ భోజనం చేశారు.నీటితో నిండిన కళ్లు, ఏడ్చిఏడ్చి ఎర్రగా మారిన రెప్పలు.. ఉబికి వస్తున్న నీటినిపట్టి ఆపిన కనుకొలకులు.. తుడిచి తుడిచి మాసికలు తెలుస్తున్న లేత బుగ్గలు.. అయినా అన్నీ మరచి వాళ్లు భోజనం చేసేలా చేసినవాడు చిన్నారి జాయప. అతని వల్ల తమ జీవితాలు చరిత్రలో నిలిచిపోబోతున్నాయని అప్పుడు వారికి తెలియదు.
మత్తి భానుమూర్తి