రాముడి జీవిత గాథను చిత్రిస్తూ వాల్మీకి మొదలుకొని ఇప్పటివరకు వివిధ భాషలలో, విభిన్న దృష్టికోణాలతో రామాయణాలు అనేకంగానే వచ్చాయి. ఒక్కొక్క పుస్తకానిది ఒక్కో ప్రత్యేకత. అలా మరో ప్రత్యేకతను చిత్రిస్తూ డా.ప్రభాకర్ శిశిల రచించిన కన్నడ నవల ‘ముక్కు’. శూర్పణఖ ముక్కు నేపథ్యమే రామ, రావణ యుద్ధానికి ప్రధాన కారణంగా చూపిస్తూ సాగే ఈ నవలను వేలూరి కృష్ణమూర్తి ‘రామరాజ్యంలో… సీత’ పేరుతో తెలుగులో అనుసృజన చేశారు. సీత, శూర్పణఖ దృష్టితో సాగే ఈ ఇతివృత్తం శ్రీరాముడి పితృవాక్య పరిపాలన, ఏకపత్నీ వ్రతం విలువలను ప్రశ్నిస్తుంది. అవి మానవీయ విలువలకు విరుద్ధంగా రాముడు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలుగా పేర్కొంటుంది. నవల ముగింపు అధ్యాయంలో రాముడిని కలలో తాటక, కైక, శంభుకుడు, వాలి, శూర్పణఖ, రావణుడు, సీత ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం, చివరికి శ్రీరాముడు సరయూ గర్భంలోకి వెళ్లిపోవడాన్ని రచయిత హృద్యంగా చిత్రించారు. శూర్పణఖ ప్రధాన పాత్రగా సాగే ఈ నవలలో సీతను 21వ శతాబ్దానికి ప్రతినిధిగా నిలపడం గమనార్హం.
రామరాజ్యంలో… సీత
పేజీలు: 176 వెల: 150
రచన: డా. ప్రభాకర్ శిశిల (కన్నడం)
అనుసృజన: వేలూరి కృష్ణమూర్తి
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు: పాలపిట్ట బుక్స్,
ఫోన్: 98487 87284, నవోదయ,
నవతెలంగాణ, నవచేతన, ప్రజాశక్తి,
అనేక బుక్ సెంటర్లు.
–హర్ష