Deepawali | పల్లెటూళ్లలో దీపావళి సందడి తక్కువే! అసలు ఈ పండుగే.. డబ్బున్నవాళ్లది! అలాంటి ధనవంతులు పల్లెల్లో అరుదు! డబ్బు సంపాదించడానికి పట్నాలకు వెళ్తారో, సంపాదించాక ఊరిని వదిలేస్తారో గానీ.. ఓ మాదిరి ఎగువ మధ్యతరగతి వాళ్లు, బీదవాళ్లు తప్ప.. డబ్బున్నవాళ్లు ఉండరు.
తెలంగాణలో బతుకమ్మ, దసరా పెద్ద పండుగలు. ఎంతటివాళ్లయినా బాగా జరుపు కొంటారు. ఆ తరువాత ఇరవై రోజులకే వచ్చే దీపావళిని ఘనంగా చేసుకోవడానికి పల్లెజనాల దగ్గర ఏమీ మిగలదు. మాకు దీపావళికి ప్రత్యేకంగా కొత్తబట్టలేవీ కొనేవారు కాదు. ఉన్నవే మళ్లీ వేసుకునేవాళ్లం. ఇప్పుడు ఎన్ని కొత్తబట్టలున్నా.. ఆ ఆనందం రాదు.
నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున నాలుగు గంటలకే మమ్మల్ని లేపేవారు. మేం మొహాలు కడుక్కునే సరికే అయ్యగారు (పురోహితుడు) వచ్చి ఉండేవాడు. ఆశీర్వచన మంత్రం చదివేవాడు. మేం నాన్నను కూచోబెట్టి మంగళహారతి పట్టేవాళ్లం. నాన్న పళ్లెంలో డబ్బులు వేయగానే అమ్మకు ఇచ్చి దాచిపెట్టమనేవాళ్లం. మాడకు చమురుతో అంటి, బియ్యప్పిండితో చేసిన పిడచలను నాన్నకూ, మాకూ చుట్టూ తిప్పేవారు. ఆ తరువాత మేం అదే మంగళహారతి పట్టుకొని పశువుల కొట్టానికి వెళ్లి.. ఆవులకూ, ఎద్దులకూ బొట్టుపెట్టి, మంగళహారతి పట్టి పిడచలను తట్టలో వేసి వాటితో తినిపించేవాళ్లం.
దీపావళికి మూడు రోజుల ముందుగానే.. ‘దుందుభి’ని తయారుచేయించేవాడు నాన్న. అదేదో వాద్యం అనుకునేరు. ఒక పాడవాటి కర్రకు ఓ చివర చిన్నచిన్న కట్టెపుల్లలు గుత్తిగా కట్టి, వాటికి నిప్పు అంటించేవారు. నాన్న మధ్యలో మమ్మల్ని పొదివి పట్టుకుని నిలబడి.. ఆ వెలుగుతున్న కాగడా కర్రను చుట్టూ తిప్పేవాడు. అలా చేస్తే పీడ తొలగి పోతుందని అమ్మ చెప్పింది.
నాన్న మమ్మల్నెప్పుడూ ఆడపిల్లలని వేరేగా చూడలేదు. అందుకే, మేం ఏ వివక్షా ఎరుగం. ఎందుకో దీపావళి పటాకుల విషయంలో మాత్రం.. “ఆ పటాకులు ఎందుకు దండుగ! మంచిగ దీపాలు ముట్టియ్య రాదుండి. బాగుంటయి. ఆడపిల్లలు ఆ బాంబులు కాల్చి చేతులు కాల్చుకునుడు ఎందుకు?!” అనేవాడు. మేం ఎలాగైనా నాన్నను ఒప్పించే కళలో ఆరితేరిన వాళ్లం గనుక.. మొత్తానికి పటాకులు కొనడానికి ఆలస్యంగానైనా గ్రాంటు సంపాదించేవాళ్లం. ఈలోగా అదృష్టదేవత మా నానమ్మ రూపంలో మమ్మల్ని ఆదుకునేది. నానమ్మకు దీపావళి పటాకుల్లో పెద్ద శబ్దం చేసే బాంబులు తప్ప మిగతావన్నీ ఇష్టం. ముఖ్యంగా చిచ్చుబుడ్లు, కాకరపుల్లలూ, భూచక్రాలూ, విష్ణుచక్రాలూ ఆమెకు ప్రీతిపాత్రమైనవి.
నాన్న ఇచ్చిన వంద రూపాయలతో బజారుకు వెళ్లి బాంబులు తప్ప మిగతా పటాకులు తెచ్చుకుని ఇద్దరం పంచుకునేవాళ్లం. చెరో పిస్టల్, అందులోకి చుట్టచుట్టిన పూర్నీల రీళ్లు కొనేవాళ్లం. పిస్టల్లో దాన్ని బిగించి కాలుస్తూ ఉంటే.. ‘టప్ టప్’ అని పేలుతూ ఆ రీల్ ముందుకు జరిగేది. “అరేయ్! భూషణం.. నిన్ను ఇప్పుడే కాల్చేసి మంచిని గెలిపిస్తానురా!” అని ఓ గోడతో నేనూ, “అరేయ్ నాగరాజూ! నిన్ను ఈ పిస్టల్తో పైకి పంపించి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తానురా!” అని ఓ గుంజతో అక్కా.. “చూస్కో పాపారావు!”.. “కాస్కో భుజంగరావు”.. ఇలాంటి డైలాగ్స్తో ఆడీఆడీ, మాకున్న సినిమా పరిజ్ఞానాన్ని గుమ్మరించేవాళ్లం.మా ఇంటి ముందు బోలెడు మంది పిల్లలు గుమిగూడి పటాకుల కోసం ఆశగా చూసేవారు. “పాపం! కొన్ని వాండ్లకు ఇయ్యరాదుండే!” అనేది అమ్మ. మేం త్యాగాల రేవులో రాగాల పడవల్లా మాకున్న వాటిలోంచే కొన్ని ఇచ్చేవాళ్లం.
పెద్ద చిచ్చుబుడ్లు కాంతి పూలతో భలే అందంగా వెలిగేవి. ఇప్పటికీ అన్నిట్లోకీ అవే నచ్చుతాయి. కొన్నాళ్లకు విమానాలూ, రాకెట్లూ, చేర్ పటాకులు కూడా కొని కాల్చేవాళ్లం. ఓ సీసాలో రాకెట్ను ఉంచి వత్తి అంటిస్తే.. అది జువ్వుమని ఆకాశంలోకి వెళ్లి, అక్కడ టప్పుమని పూలు వెదజల్లడం ఎంతో బాగుండేది. మా బావ (తరువాతి రోజుల్లో నా భర్త) మా ఇంటికి వచ్చి సుతిలి బాంబులూ, లక్ష్మీ బాంబులూ, ఆటంబాంబులూ అంటూ బోలెడు పట్టుకొచ్చి.. ఏ మాత్రం భయం లేకుండా కాల్చేవాడు. మమ్మల్నీ కాల్చమనేవాడు గానీ, మాకు ఆ బాంబుల అతి సౌండ్ నచ్చేది కాదు.
మా ఇంట్లో దీపావళికి లక్ష్మీ పూజ కూడా చేసేవాళ్లం కాదు. కొన్నాళ్లపాటు లక్ష్మణాచారి అనే అయ్యగారు ప్రతి దీపావళికి మా ఇంటికి వచ్చి రెండు మూడ్రోజులుండి వెళ్లేవాడు. ఆయన వంటతోబాటు లడ్డూ, మైసూర్ పాక్ లాంటి స్వీట్లు చేసేవాడు. లక్ష్మీ పూజలప్పుడు సంభావనల కోసం వ్యాపారస్తుల ఇళ్లకు వెళ్లి వచ్చి మా ఇంట్లోనే భోజనం చేసేవాడు.
పత్రికల ప్రత్యేక సంచికల గురించి చెప్పుకోకుండా దీపావళి సంబురాలు పూర్తికానట్లే! అప్పట్లో అన్ని పత్రికలూ దీపావళికి ప్రత్యేక సంచికలు తీసినా.. యువ, జ్యోతి, ఆంధ్రజ్యోతి మటుకు విడిగా సుమారు మూడొందల పేజీలతో ఎంతో అందంగా ప్రత్యేక సంచికలు విడుదల చేసేవి. అప్పటికే ఇరవై నుంచి యాభై రూపాయలకు ఒక్కో స్పెషల్ ఉన్నా.. అమ్మ అన్నిటినీ కొనేది. మంచి కథలు, కవితలు, కార్టూన్లు, బొమ్మలు, ఇంటర్వ్యూలు, శీర్షికలతోబాటు.. ఒక్కోసారి అగర్బత్తీ పాకెట్, మరోసారి సెంట్ సాచే, ఇంకోసారి చిన్నసబ్బు.. ఇలాంటి శాంపిల్స్తో ఎంతో బాగుండేవి అవి! దాచుకుని ఓ నెలపాటు చదివేవాళ్లం!!
-నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి