ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎలా జీవించామన్నదే ముఖ్యం. ఈ కోవకు చెందిన వాడే భారత స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్. ‘నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వతంత్రం, నా ఇల్లు జైలు..’ అంటూ కోర్టులో చెప్పిన ఆ మాటలు 15 ఏళ్ల ప్రాయంలోనే ఈ దేశంపై ఆజాద్కున్న నిబద్ధతకు నిదర్శనం. ఆజాద్ సహచరుల్లో కొంతమంది ఆయనతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ రాసిన వ్యాసాలను ఇలా పుస్తక రూపంలో తీసుకురావడం గొప్ప విషయం. వాళ్లు ఎప్పుడో రాసిన వ్యాసాలను తెలుగులోకి అనువదించి ఈ తరానికి అందించిన రచయిత నిర్మలానంద కృషి ప్రశంసనీయం.
ఆనాటి విప్లవ సహచరులు ఆజాద్తో తమ అనుబంధాన్ని ఇందులో ప్రస్తావించారు. ఆజాద్ జీవిత కథనంతా వారి మాటల్లో వ్యక్తపరిచారు. సంస్కృతం చదువుకునేందుకు తల్లిదండ్రులకు చెప్పకుండా బెనారస్ చేరుకున్న ఆజాద్ ‘సహాయ నిరాకరణ సంస్కృత విద్యార్థి’ సంఘంలో చేరి సంఘ కార్యక్రమాల్లో పాల్గొని 15 బెత్తం దెబ్బల శిక్షను అనుభవించాడు. అప్పటివరకు గాంధీజీ ఆలోచనలకు ఆకర్షితుడైన ఆజాద్.. చౌరీచౌరా ఘటన తర్వాత గాంధీ ఉద్యమాన్ని ఆపేయడంతో నిరాశకు గురయ్యాడు. ఆ తర్వాత దేశ స్వాతంత్య్రం కోసం విప్లవ పంథాను అనుసరించడంలో భాగంగా హిందూ రిపబ్లికన్ అసోషియేషన్లో చేరాడు. కాకోరి కేసులో ప్రధాన నిందితుడిగా ఆజాద్ రహస్య జీవితాన్ని అనుభవించినా తన సహచరులను ఎన్నడూ వీడలేదు. అసెంబ్లీ బాంబు కేసు తీర్పులో భగత్సింగ్, బటుకేశ్వర్ దత్తులను కాపాడుకునేందుకు ఆజాద్ ఎంతో ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలోనే తనకు అత్యంత సన్నిహితుడైన చరణ్ వోహ్రా మృతి చెందడం చూసి గంభీరమైన ఆ యువతేజం ఒక్కసారిగా దుఃఖిస్తుంది.
ఆజాద్కు విప్లవం ఎంత ముఖ్యమో విప్లవకారులన్నా ఎనలేని ప్రేమ. అందుకే జైల్లో ఉన్న భగత్సింగ్, ఇతర సహచరులను కాపాడుకునేందుకు గాంధీజీని కలిసి వేడుకుంటాడు. అయినా గాంధీజీ, కాంగ్రెస్ ఆజాద్ విజ్ఞప్తిని నిరాకరించిన తీరు ఎంతో నిరాశను కలిగిస్తుంది. ఆజాద్ కోసం ప్రాణమిచ్చే సహచరులున్నారు, ప్రాణాలు తీసే మిత్రద్రోహులూ ఉన్నారు. తన సహచరుడు వీరభద్ర తివారీ చేసిన ఆ ద్రోహం కారణంగానే ఆల్ఫ్రెడ్ పార్క్లో పోలీసులకు తటస్థపడతాడు ఆజాద్. ఆంగ్లేయుల చేతిలో ప్రాణాలు వదలొద్దని తనను తాను కాల్చుకొని అమరత్వాన్ని పొందుతాడు. తన యవ్వన ప్రాయాన్ని ఈ దేశానికి అంకితం చేసి ఆజాద్ అస్తికలతో 45 ఏళ్ల తర్వాత శోభాయాత్ర నిర్వహిస్తారు ఆయన సహచరులు. ఆజాద్ అమరుడైన చోటును చూసి ఆయన ఉద్యమ సహచరులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురవుతారు. ‘అక్కడున్న ఆజాద్ విగ్రహం మాకేదో విప్లవ సందేశం ఇస్తుంది. మేమంతా సిద్ధంగా ఉన్నాం. మాలోపల చైతన్యం ఉద్వేగం పొంగసాగాయి’ అనే మాటాలు పాఠకులకు ఉత్తేజాన్నిస్తాయి. ఆజాద్ అస్తికలు బనారసీ బాగ్లోని మ్యూజియంలోనే ఉన్నా ఆయన ఆలోచనలు మాత్రం మన ఆచరణలో ఉన్నాయి. స్వేచ్చ అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదని, అన్యాయానికి ఎదురొడ్డి నిలబడే ధైర్యమని నిరూపించిన విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్.. నిరంతర స్ఫూర్తి.