తెలంగాణ జానపదాల్లో ‘చిందు భాగవతం’ ప్రత్యేకమైంది. పల్లెపల్లెలో దేదీప్యమానంగా వెలుగొందిన కళారూపమిది. నిరక్షరాస్యులైన ప్రజలకు రామాయణం, మహాభారతం, భాగవత పురాణాలు వినిపించింది. చారిత్రక గాథలతోపాటు వినోదాన్నీ, విజ్ఞానాన్నీ పంచింది. ఆశ్రిత కులాల్లో చిందు భాగవతులు ఒకరు. వీరు ప్రదర్శించే జానపద కళారూపమే చిందు యక్షగానం లేదా చిందు భాగవతం. ఎక్కువగా పగటిపూట ప్రదర్శనలిస్తారు కాబట్టి పగటి భాగోతం, పగటి వేషాలు అని కూడా పిలుస్తారు. నాట్యంలో లయబద్ధంగా అడుగులు వేయడాన్ని ‘చిందు’ అంటారు. ప్రదర్శనలో చిందుకు ప్రాధాన్యమిస్తూ కథ చెబుతారు. అందుకే ఈ కళారూపానికి ‘చిందు భాగవతం’ అనే పేరు. కళాకారులను చిందోళ్లు, సిందోళ్లు అని వ్యవహరిస్తారు. వీరు ఊరూరా తిరుగుతూ తమ పోషకుల కుల పురాణాలను, గోత్రాలను, వంశ వృక్షాలను, బిరుదులనూ వీరగాథల్లా గానం చేస్తుంటారు. వీటితోపాటు రామాయణ, మహాభారత, భాగవతాలను ఇతివృత్తంగా చేసుకొని కథలు చెబుతారు. స్థానికంగా బహుళ ప్రచారంలో ఉన్న చెంచులక్ష్మి, ఇతర కథలను కూడా ప్రదర్శిస్తారు. తమ కులదేవతను ప్రసన్నం చేసుకోవడానికి భాగవత నాటకాన్నే ‘పూజావిధానం’గా ప్రదర్శించడం మరో విశేషం.
స్వయంగా తయారీ..
చిందు కళాకారులు ధరించే అద్దాల బిళ్లలు, ముచ్చి రేకులు అతికించిన కిరీటాలు, వివిధ రకాల ఆభరణాలు, దుస్తులు.. కండ్లు మిరుమిట్లు గొలిపేలా ఉంటాయి. వీటన్నిటినీ వారే స్వయంగా తయారు చేసుకొంటారు. బూరుగు, పొనికి చెట్ల కర్రల నుంచి ఆభరణాలను రూపొందిస్తారు. స్త్రీల చీరలనే పురుషులు పంచెలుగా ధరిస్తుంటారు.
ప్రదర్శనా విధానం
ఈ ప్రదర్శన నృత్యంతో ఆరంభమై ఎల్లమ్మ సాక్షాత్కారంతో ముగుస్తుంది. బృందంలో ఉన్న ప్రతి కళాకారుడూ కాళ్లకు గజ్జెలు ధరించి, చిందు నృత్యం చేస్తాడు. అందరికీ అర్థమయ్యే భాషలో ప్రదర్శించడం ‘చిందు కళ’ ప్రత్యేకత. వీరి వచనాలు, పద్యాలు, పాటలు, హాస్యాలు, సామెతలు, పొడుపు కథలు ప్రేక్షకులకు ఆనందాన్నిస్తాయి. ప్రదర్శనకు ముందు తాము ఉపయోగించే పెట్టెతోపాటు, వినాయకుడు, సరస్వతిని ప్రార్థిస్తారు. పురుషులు, మహిళలు కలిసి ప్రదర్శన చేయడం, ఒక్కోసారి పురుషులు స్త్రీ పాత్రలు, మహిళలు పురుష పాత్రలు ధరించడం ఈ కళారూప విశేషం. చిందు భాగవతంలో మృదంగం, తబలా ముఖ్య వాయిద్యాలు. కాంభోజి, సావేరి, మోహన రాగాలు ప్రధానంగా కనిపిస్తాయి.
చిందు ఎల్లమ్మ
చిందు కళ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు చిందు ఎల్లమ్మ. ఆమె స్వస్థలం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అమ్దాపూర్. అసలు పేరు సరస్వతి. నాలుగేండ్లకే కళారంగ ప్రవేశం చేసి, 56 కథలను, యక్షగానాలుగా ప్రదర్శించింది. ‘చిందు’ కళనే ఇంటి పేరుగా.. తను అభినయించిన ‘ఎల్లమ్మ’ పాత్ర పేరునే పేరుగా మార్చుకొని, జీవితాన్ని చిందు కళా ప్రదర్శనకు అంకితం చేసిన కళాకారిణి. ‘ఎల్లమ్మ వేషం కట్టి చిందేసి ఆడుతుంటే కండ్లనిండా చూడాలె. గొంతెత్తి పాడుతుంటే చెవుల నిండా వినాలె’ అనే నానుడి జనబాహుళ్యంలో ఉన్నది.
ఇవీ నాటకాలు..
చిందు నాటకాలు ఒకప్పుడు దాదాపు 75 వరకూ ఉండేవి. ప్రస్తుతం 50 మాత్రమే ప్రచారంలో ఉన్నాయి. ఎల్లమ్మ కథ, సతీ సావిత్రి, చెంచులక్ష్మి, అల్లీరాణి, బాలనాగమ్మ, మాంధాతచరిత్ర, రామాంజనేయ, సతీ అనసూయ, భక్త ప్రహ్లాద, వీరాభిమన్యు, గంగా-గౌరీ సంవాదం, మోహినీ రుక్మాంగద, సారంగధర, సుందరకాండ, మైరావణ ముఖ్యమైనవి. రెండు లేదా మూడు భాగోతాలను ప్రదర్శించిన తరువాత జాంబపురాణం చెప్పి తీరాలన్నది నిబంధన. చిందు కళాకారులు ప్రస్తుతం నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. వీరిలో చిందుల ఎల్లమ్మ, చిందుల శ్యాం, చిందుల గోపాల్ బృందాలు అంతర్జాతీయ ఖ్యాతి పొందాయి.
-అరవింద్ ఆర్య ,7997 270 270