పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం వల్ల సంక్షోభ సమయంలో దేశానికి సమర్థ నాయకత్వం లభించింది. ఆర్థిక సంస్కరణలు అమలయ్యాయి. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయింది. అదే సమయంలో భారత్ ఓ ఆధ్యాత్మిక నాయకుడిని కోల్పోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి పీవీ సన్యాసం స్వీకరించి ఉంటే, మనకు మరో ‘జగద్గురువు’ లభించేవారేమో!
త్రివిక్రమ రామానంద భారతి స్వామి వారి నుంచి పీవీకి ఆధ్యాత్మిక సంకేతాలు అందాయి. సర్వసంగ పరిత్యాగానికి సిద్ధపడ్డారు. అపార పుస్తక సంపదనంతా ‘రామానంద తీర్థ ఫౌండేషన్’కు అప్పగించారు. పిల్లలకు చెప్పాల్సిన నాలుగు మంచి మాటలేవో చెప్పే ఉంటారు. జీవిత భాగస్వామి అప్పటికే మరణించారు. ఆయనెప్పుడూ తామరాకుమీద నీటి బిందువే కాబట్టి, సన్యాసాశ్రమానికి ముందు పని కట్టుకుని తెంచుకోవాల్సిన బంధాలేవీ మిగిలి ఉండక పోవచ్చు. మహా అయితే, ఆ ధోవతి రంగు మారేది. కమండలం చేతి కొచ్చేది. దండం పట్టేవారు. ఉత్థాన పతనాల్ని, జయాపజయాల్ని, ప్రశంసలనూ పరాభవాలనూ సమానంగా చూసిన ఆ స్థితప్రజ్ఞుడు త్వరలోనే కుర్తాళం పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సమాచారం ఆత్మీయులకూ, వారి ఆత్మీయులకూ చూచాయగా తెలిసింది. దేశ నాయకుడు ఆధ్యాత్మిక నాయకుడిగా బాధ్యతలు స్వీకరించే ముహూర్తమూ దగ్గర పడింది.
స్వధర్మ సంస్థాపన..
తమిళనాడు తిరునల్వేలి జిల్లా చిత్రానదీ తీరంలో ఉంది ఆధ్యాత్మిక శక్తి కేంద్రమైన ‘కుర్తాళం పీఠం’. ఇక్కడ విశ్వామిత్రుడు తపస్సు చేశాడంటారు. శివ చిదానంద సరస్వతీ స్వామి ఈ క్షేత్రంలో పీఠం నెలకొల్పారు. ఆయన మౌని. అన్నీ అనుకున్నట్టు జరిగి వుంటే, స్వభావరీత్యా మౌని అయిన పీవీ నరసింహారావు కుర్తాళం పీఠాధిపత్యం స్వీకరించేవారు. ఆ ఘట్టంతో భారతదేశానికి ఆధ్యాత్మిక స్వర్ణయుగం ప్రారంభమయ్యేది. ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు, రామకృష్ణులు, వివేకానందులు, కంచి పరమాచార్యుల తర్వాత .. అంతటి శక్తిమంతుడైన ఆధ్యాత్మిక నాయకుడు భారతదేశానికి లభించేవాడు. పీవీ కర్మయోగి. పెండ్లి, పిల్లలు, పదవులు, రాజకీయాలు.. ఐహిక జీవితానికి దూరం కాకుండానే ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపారు. ఆయన సాలోచనగా కండ్లు మూసుకున్న ప్రతి రెప్పపాటు సమయమూ ఓ తపస్సే! భారతీయ, పాశ్చాత్య ఆధ్యాత్మిక ధోరణులమీద ఆయనకు అపారమైన పట్టు.
సాధికారికంగా టిప్పణి రాయగల పాండిత్యం. ఆయనే కనుక, సన్యాసాశ్రమం స్వీకరించి ఉంటే, సనాతన ధర్మానికి సంబంధించి అమూల్య గ్రంథాలు ప్రాణం పోసుకునేవి. మతానికి, ధర్మానికి, సేవకు, పూజకు సమకాలీన నిర్వచనాలు లభించేవి. ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్న శైవ, వైష్ణవ, శ్రీవైష్ణవ ఆచార్యులను ఒక వేదికమీదికి తెచ్చేవారు. స్వధర్మ సంస్థాపనకు శ్రీకారం చుట్టేవారు.కానీ, ఇవేవీ జరుగలేదు. అంతలోనే, ఢిల్లీనుంచి పిలుపొచ్చింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించమంటూ అధిష్ఠానం అభ్యర్థించింది. దేశానికి ‘సమర్థుడైన ప్రధాని’ లభించాడు. కానీ, ఓ ఆధ్యాత్మిక నాయకుడు అవతరించక ముందే, అంతర్ధానమయ్యాడు. పునరపి జననం, పునరపి మరణం. ఏమో, అసంపూర్ణంగా మిగిలిపోయిన మహత్కార్యాన్ని పూర్తి చేయడానికి పీవీ నరసింహారావు త్వరలోనే జగద్గురువులుగా అవతరించ నున్నారేమో!
‘విశ్వ’ భారతం
పీవీ ఆధ్యాత్మిక నాయకత్వాన్ని చేపట్టక పోవడం వల్ల భారతదేశం వైదిక ధర్మాన్ని ప్రపంచం నలుమూలలకూ చాటే అవకాశాన్ని కోల్పోయింది. మన ధర్మం విశ్వవ్యాప్తం కాలేక పోవడానికి ఒక ప్రధాన కారణం భాష! చాలామంది పీఠాధిపతులకు ఒకటి రెండు భాషలకు మించి తెలియవు. పీవీకి ఆ పరిమితి లేదు. ప్రపంచంలోని ఏ ప్రధాన దేశానికి వెళితే ఆ భాషలో మాట్లాడేవారు. భారతీయ ధర్మం గురించి అనర్గళంగా ఉపన్యసించే వారు. ఆయన అనుగ్రహ భాషణ ఒక గ్రంథానికో, ఒక సిద్ధాంతానికో పరిమితమయ్యేది కాదు. మన నమ్మకాలూ ఆచారాలకు సంబంధించి పాశ్చాత్యులు చేస్తున్న విమర్శలకు దీటైన జవాబు ఇచ్చేవారు.