పల్లె తెలంగాణ సంప్రదాయ వేడుక బతుకమ్మ పండుగ. అడవి తల్లి ఒడిలో విరిసిన పూలన్నీ తాంబాలంలోకి చేరేసరికి నిండు ముత్తయిదువులా వెలిగిపోతుంది. తంగేడు పూల అంచుతో, గునుగుపూల కొంగుతో, కట్లపూల చెంగుతో చీరకట్టిన గౌరమ్మ.. కొప్పున సీతజడపూలు తురుముకున్నట్టుగా కనువిందు చేస్తుంది. తెలంగాణలో తొమ్మిది రోజులు సంబురంగా జరిగే ఈ తీరొక్క పూల పండుగ.. వేర్వేరు చోట్ల విభిన్న రీతుల్లో సందడి చేస్తుంది. బతుకమ్మ పండుగకు దగ్గరి పోలికలు ఉన్న పూల పండుగ ముచ్చట్లు ఇవి.
సంప్రదాయ ‘కదంబం’
సంప్రదాయాలను కాపాడటంలో ఆది వాసులు ముందుంటారు. పండుగలు, జాతరలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. వారి వేడుకల్లో ‘కరమ్ పండుగ’ ఒకటి. దీన్నే కర్మ పండుగ అని కూడా అంటుంటారు. ఏటా భాద్రపద పౌర్ణమిని పురస్కరించుకొని కరమ్ వేడుకను ఘనంగా చేసుకుంటారు. పండుగలో భాగంగా అడవిలోకి వెళ్లి కదంబ వృక్షం కొమ్మలు, ఆకులు, పూలు, పండ్లను కోసుకొస్తారు. వాటిని తమ నివాస ప్రాంతాల్లోనే ఒకచోట కొలువుదీరుస్తారు. ఆ కొమ్మలకు పూజలు చేస్తారు. చుట్టూ చేరి ఆట
పాటలు, నృత్యాలతో కృతజ్ఞతలు తెలియజేస్తారు. వారం ముందుగానే వెదురుబుట్టల్లో వరి, గోధుమ, మక్కలు తదితర తొమ్మిది రకాల విత్తనాలు వేసి, మొలకలు వచ్చాక వాటిని పూజలో ఉంచుతారు. పెండ్లికాని యువతీయువకులు ఈ పండుగలో పాలుపంచుకోవడం వల్ల వివాహం జరుగుతుందని ఆదివాసుల నమ్మకం. ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, బీహార్, పశ్చిమ్బెంగాల్ రాష్ర్టాల్లోని గిరిజనులు ఈ పండుగ జరుపుకొంటారు.
‘బాలల’ పండుగ
సమస్త జీవజాలాన్నీ నిరంతరం పరవశింపజేసే ప్రకృతి సంతసించేది వసంతం అడుగిడినప్పుడే. ఆమని రాకతో మానులన్నీ కొత్త చిగుళ్లు తొడుగుతాయి. కొమ్మలన్నీ రకరకాల పూలతో పులకించిపోతాయి. ఆ పూలన్నిటినీ ఏర్చికూర్చి ఒక్కటిగా పేర్చి చేసుకునే వేడుక ఫూల్ దేయీ! ఉత్తరాఖండ్లో వసంత రుతువు రాకను పురస్కరించుకొని ఏటా మార్చి-ఏప్రిల్ నెలల మధ్య ఈ పండుగను చేసుకుంటారు. పండుగ నాడు ఉదయాన్నే పిల్లలంతా బుట్టలు పట్టుకొని ఊరి పొలిమేరలకు చేరుకుంటారు. అందిన పూలన్నిటినీ తుంచి, బుట్టలో వేస్తూ మురిసిపోతారు. ఈ పూలన్నిటినీ ఇంటికి తీసుకెళ్లి పెద్దలకు అందజేస్తారు. పిల్లల పట్టుదలకు మెచ్చి పెద్దలు బెల్లం కానుకగా ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం. పిల్లలు సేకరించిన పూలను రాశిగా పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. పాటలతో వసంతానికి స్వాగతం పలుకుతారు. పర్యావరణం ప్రాధాన్యాన్ని ఈ తరానికి తెలియజేయడమే ఫూల్ దేయీ పండుగ ఆంతర్యం.
అమ్ముకుట్టి.. పూల ముగ్గెట్టి
పడమటి కనుమల్లో పచ్చలపేరులా ఉంటుంది కేరళ రాష్ట్రం. ప్రకృతి రమణీయతకు పట్టుగొమ్మలా ఉండే మలయాళ సీమ ఓనం వేళలో శోభాయమానంగా వెలిగిపోతుంది. మలయాళ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పూల జాతర చేస్తారు. ఆగస్టు-సెప్టెంబర్ మాసాల్లో పదిరోజులపాటు ఓనం ఉత్సవాలు రోజుకో రీతిగా సాగుతాయి. అందులో భాగంగా పూలను రంగవల్లులుగా పేర్చే సందడి చూడముచ్చటగా ఉంటుంది. పూలను, పూల రెక్కలను ముగ్గులుగా పేర్చి, మధ్యలో దీపాన్ని ఉంచి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు కేరళీయులు. కొత్త దుస్తులు, పిండివంటలు షరా మామూలే! మొత్తానికి ఓనం వేళ మలబారు తీరంలోని ఇళ్లన్నీ పూలబారులతో నందనవనాలను తలపిస్తాయి.
ప్రకృతి ఆరాధనలో..
రకరకాల సంప్రదాయ పండుగలకు నెలవు రాజస్థాన్. రుతుపవనాలకు స్వాగతం పలుకుతూ శ్రావణ శుక్ల తదియ నాడు హరియాలీ తీజ్ వేడుక జరుగుతుంది. ఆడపడుచులంతా సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. గోరింటాకు పండిన చేతులను ఒకరికొకరు చూపుతూ మురిసిపోతారు. పండుగలో భాగంగా పార్వతీదేవిని ప్రకృతికి ప్రతీకగా భావించి పూల పల్లకిలో ఊరేగిస్తారు. ఆ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో కొలువుదీరుస్తారు. ఆ చెంతనే పచ్చటి కొమ్మలను ఒకచోట పేర్చి, మహిళలంతా వాటి చుట్టూ కూర్చుని పాటలు పాడతారు. సంప్రదాయ నృత్యరీతులను ప్రదర్శిస్తారు. బతుకమ్మలో కనిపించే పూల సందడి కనిపించకపోయినా.. తీజ్ వేడుక ప్రకృతి ఆరాధన ప్రధానంగా సాగుతుంది. రాజస్థాన్తోపాటు పంజాబ్, బీహార్, ఉత్తరాఖండ్ తదితర రాష్ర్టాల్లోనూ వర్షరుతువులో తీజ్ పండుగ సంబరంగా జరుపుకొంటారు.