ఎంతోమంది ఎన్నోరకాల వ్యాపారాలు చేస్తుంటారు. కానీ, కొందరే చరిత్రలో నిలిచిపోతారు. కారణం, ఆ వ్యాపారంలో ఓ భాగమైన సామాజిక బాధ్యత. ఆ కోవకు చెందిన వ్యక్తే సైరస్ పూనావాలా. ఐదున్నర దశాబ్దాల క్రితం సీరమ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించి రకరకాల వ్యాధులకు టీకాలు తయారు చేస్తున్నారు. ఈ ‘వ్యాక్సిన్ కింగ్’ జీవితంలో ఎన్నో మలుపులు.
ప్రపంచంలోని 170 దేశాల్లో 65 శాతం మంది పిల్లలు కచ్చితంగా ఒక్కసారైనా సీరమ్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటారని అంచనా. ప్రస్తుతం, ప్రపంచంలోనే అత్యధిక కరోనా వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తున్న సంస్థగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రికార్డుకెక్కింది. నెలకు ఏడు కోట్ల డోసులను అందించడమంటే మాటలు కాదు. త్వరలోనే ఆ సంఖ్య పది కోట్లకు చేరనుంది. ఈ అశ్వవేగం వెనుక ఓ గుర్రాల కథా ఉంది.
సామాన్యుల కోసం..
సైరస్ పూనావాలా 1941లో పుణెలో జన్మించారు. బిషప్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు. యూనివర్సిటీ ఆఫ్ పుణెనుంచి పుట్టా అందుకొన్నారు. చదువు పూర్తి కాగానే తమ కుటుంబ వ్యాపారమైన గుర్రాల పెంపకంలో పాలు పంచుకొన్నారు. సైరస్ తండ్రి సోలీ పూనావాలాకు గుర్రాలంటే ఇష్టం. ఆయన అశ్వశాలలో వందలాది మేలు రకం అశ్వాలు ఉండేవి. కానీ, ఈ వ్యాపకాన్ని ఓ వ్యాపారంగా కొనసాగించడం సైరస్కు ఇష్టం లేదు. అందుకే, ఇరవై ఏండ్ల వయసులో ఫ్రెండ్స్తో కలిసి కార్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారు. హై ఎండ్ కార్ల తయారీపై ప్రయోగాలు చేశారు. ప్రొటోటైప్ స్పోర్ట్స్ కార్ మోడల్నూ తయారుచేశారు. కొంతకాలానికి అది మొహమొత్తింది. సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. అలా, 1966లో సీరమ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించి వ్యాక్సిన్ల తయారీకి పూనుకున్నారు.
మొదలైందిలా..
మొదట సైరస్ తమ అశ్వశాలలోని గుర్రాల రక్తంలోంచి సీరమ్ తీసి వ్యాక్సిన్ తయారీ మొదలుపెట్టారు. రెండేండ్లలోనే సీరమ్ సంస్థ ధనుర్వాతం టీకాను తయారుచేసింది. తర్వాత, తన పరిధిని విస్తరించి డిఫ్తీరియా, టిటానస్ వంటి వ్యాధులపై యుద్ధం ప్రకటించింది. శక్తిమంతమైన వ్యాక్సిన్లను తయారు చేసింది. పాముకాటు నుంచి రక్షించే యాంటీ స్నేక్ సీరమ్నూ తయారుచేసింది. క్రమంగా, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీగా ఎదిగింది సీరమ్. మొత్తం 150 దేశాలకు ఈ సంస్థ వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తున్నది.
ఒడుదొడుకులెన్నో
ప్రారంభంలో సైరస్ పూనావాల ఎన్నో అవరోధాలను అధిగమించారు. ముఖ్యంగా, నిధుల సేకరణలో చాలా ఇబ్బంది పడ్డారు. తన దగ్గరున్న గుర్రాలను అమ్మగా వచ్చిన పన్నెండు వేల డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. ఆ సమయంలో మన దేశంలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. అందులోనూ టీకాల తయారీలో పాశ్చాత్య దేశాలదే పెత్తనం. ఈ అవరోధాలను తట్టుకోవడానికి ‘ధర’ను అస్త్రంగా సంధించారు. సాధ్యమైనంత అగ్గువలో టీకాలు అందించారు. ప్రస్తుతం, సీరమ్ పగ్గాలను ఆయన కొడుకు అదాన్ పూనావాల చేపట్టారు. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకొన్నారు.