Jaya Senapati katha | జరిగిన కథ : గణపతిదేవుని పట్టమహిషి సోమలదేవి రెండోసారి గర్భం దాల్చింది. దాంతో రాజ్యమంతటా.. ‘మళ్లీ ఆడపిల్లే పుడితే ఎలా!?’ అనే చర్చ జరుగుతున్నది. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆసేతుహిమాచలం దృష్టిలో కాకతీయ రాజ్య వారసత్వ అంశం ప్రముఖమైంది. చివరికి ఫలితం వచ్చింది. సోమలదేవి మగపిల్లవాణ్ని ప్రసవించినట్లు.. కాబోయే చక్రవర్తి పేరు ‘రుద్రమదేవుడు’ అనే వార్త వినిపించింది.
కాకతీయ సామ్రాజ్య పట్టమహిషి సోమలదేవి మగబిడ్డకు జన్మనివ్వడంతో.. రాజ్యమంతా ఆనంద కోలాహలం కనిపిస్తున్నది. ఒకరోజు నామకరణం.. మరొకరోజు అన్న ప్రాశన.. ఇంకోరోజు ఉయ్యాలలో వేయడం..
ప్రజలంతా ఆనందపుటుయ్యాలలో ఊగారు. తూగారు. పరవశించారు.
“బావుంది”..
“బావుంది బావుంది”..
“ఓహో”..
“అహో”..
“నేనూ ఇదే అనుకున్నాలే”..
“ఇదికాక మరేమీ పెడతారు?”..
“ఒరే శుక్రా.. తండ్రిగారి పేరు మహాదేవుడు అని పెట్టకుండా ‘రుద్రదేవుడు’ అని పెద్దతండ్రి గారి పేరు పెట్టారేమిట్రా చక్రవర్తి??”.
దీర్ఘంగా ఆలోచించి అన్నాడు శుక్ర..
“తండ్రి సరదావీరుడు. పెద్దతండ్రి మహావీరుడు. పైగా సామ్రాజ్య ద్రష్ట, స్రష్ట. కాకతీయ సామ్రాజ్యం మరింత విస్తరించాలని మన గణపతిదేవుల అభి
ప్రాయంగా కనిపిస్తున్నది”..
శుక్ర అభిప్రాయం నచ్చింది జాయపకు.
జాయప.. నాట్యకత్తెలైన యువతులతో శిల్ప భంగిమలు రూపొందిస్తున్నాడన్న వార్త శిల్పవర్గాలలో, నాట్యవర్గాల్లో బాగా ప్రచారమైంది. రాచనగరులో కూడా ఈ వినూత్న విధానం తెలిసి ఆస్థాన స్థపతి కానోజు.. గుండాయామాత్యునికి కబురు పంపాడు. జాయపను తోడ్కొని రాచనగరుకు రమ్మన్నాడు.
రాచనగరుకు ఎప్పుడు వెళ్లినా జాయప చూపులన్నీ అంతఃపుర ప్రాంగణం వైపే. కానోజు స్థపతి జాయపను అభినందించి, కొత్త రాజధానిలో నిర్మితమవుతున్న ఇతర దేవాలయాల స్థపతులతో కూడా చర్చించి.. అన్ని దేవాలయాల శిల్ప చిత్రీకరణలో సహకరించాల్సిందిగా ఆదేశించాడు.
గుండయామాత్యుడు సంతోషించి..
“తప్పకుండా చేస్తాడు. గురుకుల సహకారం జాయపకు పూర్తిగా ఉంటుంది” అన్నాడు.
అయితే జాయప కొంచెం తటపటాయించి..
“ఈ సంగతి చక్రవర్తులకు తెలియజేస్తారా..?” అని అడిగాడు.
కానోజు స్థపతి, గుండయామాత్యుడు ముఖాలు చూసుకుని నవ్వారు గట్టిగా.
“ఊ.. జాయప కూడా పెద్దవాడయ్యాడు. రాజ
కీయాలు మాట్లాడుతున్నాడే! తప్పకుండా చక్రవర్తులవారి దృష్టికి తీసుకెళ్తాను. సరేనా!?” అన్నాడు కానోజు స్థపతి నవ్వుతూ.
ఆ సమయంలోనే రాచనగరులో మరో నాట్య
ప్రదర్శన ఏర్పాటుచేశారు గుండయామాత్యుడు, నీలాంబ. ప్రదర్శన సందర్భంగా జాయపకు అక్కలపై బెంగ తీవ్రమైంది.
‘మరోసారి రాచనగరులో ప్రదర్శన ఇవ్వబోతున్న వేళనైనా అక్కలు కనిపిస్తారా.. లేదా? అక్కలను చూడాలి.. కానీ ఎలా?’..
అప్పుడొక ఆలోచన కలిగింది. వెంటనే చౌండసేనాని ఇంట ప్రత్యక్షమయ్యాడు.
చౌండయ, మైలాంబిక ఆప్యాయంగా జాయపను ఆహ్వానించారు. పద్మాక్షి పెళ్లి ముచ్చట్లు అచ్చట్లు ఇంకా ఆ ఇంట ప్రతిధ్వనిస్తున్నాయి. జాయప అన్యమనస్కంగా ఉండటం ఇద్దరికీ స్పష్టమవుతున్నది.
చౌండ ఆప్యాయంగా భుజంపై చేయివేసి అడిగాడు..
“ఏమి జాయపా! రేపు చక్రవర్తుల ముంగిట మంచి నాట్యప్రదర్శన ఇవ్వబోతూ విచారంగా ఉన్నావేం?”.
“అక్కల పరిస్థితి ఏమిటి? ఇలా ఎంతకాలం? అక్కలను బంధ విముక్తులను చేసి ద్వీపానికి పంపేది ఎప్పుడు బాబయ గారు?!”..
ఎలాంటి బెదురూ లేకుండా ధైర్యంగా అడిగాడు జాయప.
జాయప ఇంతకాలం ఎవ్వరితోనూ తన అక్కల గురించి చెప్పకపోవడం, వారికోసమే అతను అనుమకొండలో ఉండటం, ఇటీవల వివాహ సందర్భంగా వచ్చిన పినచోడుణ్ని తన తండ్రిగా ఎవ్వరికీ చెప్పకపోవడం, ఆయన కూడా గౌరవంగా పిల్లల యోగక్షేమాలు ప్రస్తావించి వదిలివేయడం.. చౌండ గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పెద్దవాడైన జాయపకు వివరించాల్సిన సమయం వచ్చిందని చౌండ భావించాడు.
“నేను తప్పు చేశానో ఒప్పు చేశానో.. మీ అక్కలను రాజధానికి తీసుకొచ్చాను. కాబట్టి వారి బాధ్యత నాదే. అలాగే రాజధానిలో ఒంటరిగా తిరుగుతున్న నీ బాధ్యత కూడా నాదిగానే భావించాను. చిన్నది అనుకున్న అంశం.. రానురానూ పెద్దదయ్యింది. వాళ్లు పెళ్లీడు కొచ్చారు. నా కూతురి పెళ్లి చేసిన నేను.. నీ అక్కల సంగతి మరచిపోలేదు. కానీ, నాకే తెలియని పీటముడి పడిపోయింది. మీ అక్కల సంగతి చక్రవర్తికి తెలిసిపోయింది. ఇప్పుడే వెలనాడు సమస్య తిరిగి రాజుకుంటున్నది. మనపై యుద్ధం చేయలేక వెలనాడు నుంచి పారిపోయి ప్రోలునాడులో దాగిన పృథ్వీశ్వరుడు పిష్టపురంలో చేతులు ముడుచుకుని కూర్చోలేదు. మీ నాయనగారిని పదవీభ్రష్టుని చేసి, వెలనాడును తిరిగి స్వాధీనం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చక్రవర్తి వివిధ మార్గాల ద్వారా వాణ్ని నిరోధిస్తూనే ఉన్నారు. వాడి కదలికలు వేగులు ప్రతిక్షణం కనిపెట్టి మనకు చేరవేస్తున్నారు. ఇటీవల చక్రవర్తి.. ‘పినచోడుడు మన సామంతుడేనా? నమ్మి రాజ్యం కట్టబెట్టాం. నమ్మకస్తుడేనా?’ అని అడిగారు”.. ఆశ్చర్యపోయాడు జాయప. తన తండ్రి నిజాయతీపై చక్రవర్తికి అనుమానమా? ఎందుకొచ్చింది?
“మీ నాయనగారు ఉత్తమ పాలకుడు. వెలనాడును, ద్వీపరాజ్యాన్ని మీ తండ్రి ఎంతో ప్రజానురంజకంగా పరిపాలిస్తూ చెల్లించాల్సిన కప్పాలు, పన్నులు రోజురోజుకూ పెంచి మరీ చెల్లిస్తున్నారు”..
జాయప ముఖంలో ప్రశ్న.
‘మరేమిటి సందేహం??’..
“అదే అడిగాను. ‘పినచోడుడు పృథ్వీశ్వరుడికి బంధువు.. నీకు తెలుసా?’ అన్నారాయన”..
ఆపి జాయపవైపు చూసి..
“పృథ్వీశ్వరుడు మీ కుటుంబ బంధువట. నీకు తెలుసా జాయపా?” అన్నాడు చౌండ.
అయోమయంగా చూశాడు జాయప. జాయప ముఖంలోకి చూస్తున్న చౌండకు అర్థమైంది.. జాయపకు తెలియదని.
“కానీ, చక్రవర్తికి తెలిసింది. పృథ్వీశ్వరుడికి మీ అమ్మగారు బంధువు. స్వయంగా మేనకోడలు. అక్క కూతురు”.. వివరించాడు చౌండ.
జాయప నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇది అతనికి తెలియని విషయం. అంతా గందరగోళంగా ఉంది.
అయితే?.. ఇందులో సమస్య ఏమిటో అతని
కళాకారుడి బుర్రకు తట్టలేదు.
చౌండ వివరించాడు.
“పృథ్వీశ్వరుడు మీ నాయనగారిని బంధుత్వంతో లొంగదీసుకుని ఇద్దరూ కలిసి వెలనాడును స్వతంత్ర రాజ్యంగా ప్రకటించే అవకాశం ఉంది కదా?”..
కోపంతో చివ్వున లేచాడు జాయప.
“మా నాయనగారు ఎప్పటికి.. ఎప్పటికీ అలా చెయ్యరు..” అన్నాడు ముక్కుపుటాలు ఎగరేస్తూ. చిన్నగా నవ్వి.. భుజాలు పట్టి జాయపను కూర్చోబెట్టాడు చౌండ.
“అవకాశం ఉంది కదా జాయపా! అవకాశం ఉంది. ఆలోచించు.. ఉంది”. మంచినీరు ఉన్న కోర అందించాడు. తాగాడు జాయప.
ఈ రాజ్యతంత్రాలు.. ఎత్తులు – పైఎత్తులు.. అతనికి కొత్తగా ఉన్నాయి.
‘ఏమో.. తండ్రిగారు కూడా మహారాజే! ఇలాంటి అవకాశం దొరికితే ఎందుకు వదులుకుంటాడు?!’..
“కాబట్టి.. ‘పినచోడుని కూతుళ్లను తీసుకొచ్చి, ఇక్కడ బంధించి మంచిపని చేశావు చౌండ!’ అన్నారు చక్రవర్తి”.. వివరణ పూర్తిచేశాడు చౌండ. పూర్తిగా అర్థమైంది జాయపకు. కోరలోని నీరంతా గటగటా తాగాడు.
“రాజ్యాల మధ్య నిశ్శబ్ద యుద్ధాలు జరుగుతుంటాయి జాయపా! పృథ్వీశ్వరుడు బతికున్నంత కాలం నిద్రపోడు. యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాడు. మనం కూడా యుద్ధ సన్నాహాల్లోనే ఉన్నాం. అన్నీ నిశ్శబ్దంగా జరిగిపోతున్నాయి. ఈ యుద్ధంతోనే మీ అక్కలకు బంధవిముక్తి.. అప్పటివరకూ ఎవ్వరం ఏమీ చెయ్యలేం”.. పూర్తిగా అర్థమై.. నవనాడులు కుంగిపోయాయి జాయపకు. అక్కలు ఇప్పట్లో బయటికి రావడం అసాధ్యం. మ్లానమైన ముఖంతో ముడుచుకుపోయాడు. ఏదో సాధించగలను అనుకున్నాడు తను.. ప్చ్! దారులు మూసుకు పోయాయి.
“యుద్ధం జరగాలి. జరుగుతుందో లేదో తెలియదు. జరిగితే జయాపజయాల మీద ఆధారపడి నా అక్కల బతుకు ఆధారపడి ఉంది. అవునా?!” అన్నాడు. అతణ్ని అనునయిస్తున్నట్లు భుజంపై చెయ్యి వేసింది మైలాంబిక.
“యుద్ధాలు చాలా భయంకరమైనవి జాయపా! ఎత్తులు – పైఎత్తులు మరింత సున్నితమైనవి. కొంచెం ఓపిక పట్టాలి.. తప్పదు!” అన్నది.
“రాజ్యాల మధ్య నిశ్శబ్ద యుద్ధాలు జరుగుతుంటాయి జాయపా! పృథ్వీశ్వరుడు బతికున్నంత కాలం నిద్రపోడు. యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాడు. మనం కూడా యుద్ధ సన్నాహాల్లోనే ఉన్నాం. అన్నీ నిశ్శబ్దంగా జరిగిపోతున్నాయి. ఈ యుద్ధంతోనే మీ అక్కలకు బంధవిముక్తి.. అప్పటివరకూ ఎవ్వరం ఏమీ చెయ్యలేం”..
కన్నీరు మెల్లగా అతని బుగ్గలపై జారడం వాళ్లు చూశారు. మైలాంబ అప్పుడు చిన్న ఉపాయం చెప్పింది.
“స్వామీ.. జాయప అక్కలపై బెంగగా ఉన్నట్లున్నాడు. వీలైతే ఒక్కసారి జాయపకు వారిని కలిసే అవకాశం కల్పించకూడదూ?!” అన్నది అభ్యర్థిస్తున్నట్లు. ఈ సలహా చౌండకు, జాయపకు కొంత ఊరట కలిగించింది. కాసేపు ఆయన ఏమి చెబుతాడోనని ఇద్దరూ ఊపిరి బిగబట్టి చూశారు.
సాలోచనగా అన్నాడు చౌండ..
“ఒక్క సహాయం చెయ్యగలను. రేపు మీ నాట్య ప్రదర్శన వద్దకు మీ అక్కలను రప్పించగలను. కానీ, నువ్వు పలకరించకూడదు. ఇప్పటిలాగే వాళ్లెవ్వరో తెలియనట్లే ప్రవర్తించాలి”..
ఇద్దరూ ఏమీ అనలేకపోయారు.
మళ్లీ ఆయనే అన్నాడు..
“ఇప్పటివరకు ఉన్న వాతావరణం మరి కొంతకాలం ఉండటమే ఉభయులకూ శ్రేయోదాయకం. తెలిస్తే మళ్లీ కొత్త సందేహాలు, కొత్త అంశాలు తెరమీదకు వస్తాయి. అసలే యుద్ధాంశాలు మీ కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి తేనెతుట్టెను కదల్చవద్దు. ఇప్పటికి అక్కలను చూసి సంతృప్తి పడు. కానీ, ఒక్క వాగ్దానం చేస్తున్నాను జాయపా! మీ అక్కలను క్షేమంగా తలగడదీవి కోటకు చేర్చే బాధ్యత నాది”..
దృఢంగా, స్పష్టంగా అన్నాడు మహాయోధుడు, యుద్ధతంత్ర నిపుణుడు చౌండసేనాని.
మైలాంబ ఉత్సాహంగా లేచి జాయప భుజాలుపట్టి..
“హమ్మయ్య! మండలేశ్వరులు చౌండసేనాని మాట శిలాశాసనం. కొద్ది రోజుల్లోనే మీ అక్కలు, నువ్వు.. ద్వీపరాజ్యంలో మీ కుటుంబంతో హాయిగా గడిపేరోజులు రాబోతున్నాయి జాయపా! ఊరడిల్లు!” అన్నది.
నిజంగానే కొంచెం ఊరడిల్లాడు జాయప.
మరునాడు ‘కాళీయ మర్దనం’ నాట్య ప్రదర్శన అద్భుతం.. అమోఘం. సాక్షాత్తూ చక్రవర్తి గణపతిదేవుడే అప్రతిభుడయ్యాడు. చిన్నికృష్ణునిగా జాయప నాట్యవిన్నాణం మహోన్నతం. ఆహూతుల హర్షధ్వానాలమధ్య ఆయన జాయపను చేతి సైగతో దగ్గరికి పిలిచాడు. వచ్చిన జాయపను ఆయన అలా చూస్తూ ఉండిపోయాడు. ఆయన చూపుల్లో దిగ్భ్రమ..‘ఏమిటీ వీడిలో ఉన్న అయస్కాంత శక్తి.. వీడు ఎదిగిన విధానం అనితర సాధ్యం. నాట్యకౌశలంలో వికసించిన శాస్త్రవిన్నాణం. ప్రేక్షకులను కట్టిపడేసే అభినయ ముగ్ధత.. శరీర విన్నాణంలో మోహనత్వం.. అన్నిటినీ మించి ఈరోజు మనిషి మొత్తంలో తొణికిసలాడుతున్న చైతన్యపు మైమరపు. కాకతీయ వారసుడు పుట్టాడన్న ఆనందంతో రాజ్య ప్రజలున్నారని.. ముఖ్యంగా రాజధాని అనుమకొండ పురవాసుల సంబరాలు అంబరాన్ని చుంబిస్తున్నాయని వేగుల వార్తల సారాంశం. అది జాయపలో కనిపిస్తున్నది!’ అని అనుకున్నాడాయన. కానీ, జాయప అత్యద్భుత ప్రదర్శనకు కారణం మరొకటున్నదని.. నారాంబ, పేరాంబ ఈ ప్రదర్శనకు హాజరై, ప్రేక్షకుల్లో కూర్చుని తమ్ముని శాస్ర్తోక్తమైన నాట్య ప్రదర్శన తిలకించారని.. ఎన్నో ఏళ్ల తర్వాత జాయప తన అక్కలను దగ్గరగా చూశాడని.. అక్కలకు తననాట్యం చూపినప్పటి సంభ్రమం అతని నాట్యంలోని అద్భుతానికి కారణమని ఆయనకు తెలియదు.
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284