తొలి మానవుడు తన జ్ఞాపకాలను రాతిపై చిత్రించాడు. ఆధునిక మానవుడిగా మారుతున్న చారిత్రక పరిణామక్రమంలోని ఆవిష్కరణలన్నీ రాసుకుంటూపోయాడు. ఆ అనుభవాల నమోదులోనూ ఎన్నో మార్పులొచ్చాయి. అలాంటి ముచ్చటగొలిపే విశేషాలెన్నో ఉన్న జ్ఞానభాండం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం – పరిశోధనా సంస్థ. వెయ్యేళ్ల తెలుగు సాహితీ వైభవాన్ని చాటే ఈ సంస్థ స్వర్ణోత్సవ సంబురం జరుపుకొంటున్నది. ప్రాచీన సాహిత్యంలోని పురాణాలే కాదు వైజ్ఞానిక విశాషాలు ఎన్నో ఉన్నాయనడానికి రుజువులున్న విజ్ఞాన నిలయం.. ఈ గ్రంథాలయం!
– నాగవర్ధన్ రాయల
TSOMLRI | విజ్ఞానభాండాలు ప్రాచీన గ్రంథాలు. తమ కాలపు విశేషాలను భవిష్యత్ తరాలకు చేరవేయడానికి కిందటి తరాలవాళ్లు ఎన్నో రచనలు చేశారు. తాతలు అందించిన ఆ వారసత్వాన్ని అపురూపంగా చూసుకుంటూ తర్వాతి తరాలు కాపాడుకుంటూ వచ్చాయి. తాళపత్రం మూడు వందల ఏళ్లకు శిథిలమైపోతుంది. దానికంటే మెరుగైనది కాగితం. ఆ కాగితం రెండు, మూడింతలు ఎక్కువ కాలం ఉంటుంది. ఆ తర్వాత?.. ఇలా శిథిలమైపోతున్న జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు వాటిని ఎత్తి రాస్తూ గతాన్ని వర్తమానానికి అందిస్తూ పోయాడు మనిషి. ఆ గతాన్ని రేపటి కోసం భద్రపరచడమే కాదు ఆ వారసత్వ రచనల్లోని విజ్ఞానాన్ని విశ్లేషించేందుకు పరిశోధనలూ చేస్తున్నారు. సీపీ బ్రౌన్ అందించిన వేమన పద్యాలు అలాంటివే. నేడు పుస్తక రూపంలో ఉన్న పురాణాలు, కావ్యాలు, నీతి శాస్ర్తాలు, ఆధ్యాత్మిక చింతన, తత్వ, వైద్య, ఖగోళ, గణిత విషయాలెన్నో ఎత్తిరాస్తూ కాపాడుకుంటేనే మనకు దక్కాయి. ఎవరో ఒకరు పూని కాపాడిన వారసత్వ సంపదను రేపటి కోసం నిలుపుకొనేందుకు ఏర్పాటైనదే ప్రాచ్య లిఖిత గ్రంథాలయం. ఎన్నో రంగాలకు చెందిన వేల గ్రంథాలను సేకరించి, పరిష్కరించి, ప్రచురించి, సంరక్షిస్తున్నది ‘తెలంగాణ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం – పరిశోధనాలయం’. స్వర్ణోత్సవాలు జరుపుకొంటున్న ఈ భాండాగారంలో బంగారం కన్నా విలువైన రాతప్రతులెన్నో ఉన్నాయి. వాటిలో ఎన్ని విశేషాలున్నాయో దీని స్థాపన, నిర్వహణ, లక్ష్యాల్లో అన్ని విశేషాలున్నాయి!
ఆరో నిజాం మహబూబ్ ఆలీఖాన్ పాలనా కాలంలో ఆధునిక ఐరోపా తరహా పాలన, వ్యవస్థలు, సంస్థల ఏర్పాటు ప్రారంభమైంది. ఆ ప్రభావంతో ఆసఫియా లైబ్రరీ (నేటి స్టేట్ లైబ్రరీ) స్థాపించారు. ఈ గ్రంథాలయంలో నిజాంలు సేకరించిన రాతప్రతులను భద్రపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత 1 నవంబరు 1975న ‘ఆంధ్రప్రదేశ్ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం – పరిశోధన సంస్థ’ను ప్రభుత్వం నెలకొల్పింది. ఆసఫియా లైబ్రరీలో భద్రపరిచిన 20 వేల రాతప్రతులతోపాటు ఇతర ప్రాంతాల గ్రంథాలయాల నుంచి సేకరించిన మరికొన్ని రాతప్రతులతో ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ గ్రంథాలయాన్ని కొన్నాళ్లకు స్టేట్ లైబ్రరీ నుంచి రాజ్యాభిలేఖ గ్రంథాలయం (తార్నాక)కు మార్చారు. రత్న బజార్ షాపింగ్ కాంప్లెక్స్ (అబిడ్స్)కు తరలించారు. పరిశోధనలకు అనువుగా ఉండేలా 1996లో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని శాశ్వత భవనానికి ఈ సంస్థ మారింది. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం – పరిశోధనా సంస్థ’ పేరుతో ఏర్పాటైన ఈ సంస్థ రాష్ట్ర విభజన తర్వాత ‘తెలంగాణ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం – పరిశోధనా సంస్థ’గా ఏర్పడింది.
ప్రాచ్యం అంటే ప్రాచీనం అని అర్థం. ప్రాచ్య లిఖితం అంటే ప్రాచీన కాలానికి సంబంధించిన అరుదైన లిఖిత ప్రతులు అని అర్థం. కనీసం 75 సంవత్సరాల పాతవై ఉండాలి. వాటికి సామాజిక ప్రయోజనం ఉండాలి. ఈ ప్రమాణాల ఆధారంగా చేసుకుని అరుదైన రాత ప్రతులను ఈ సంస్థ పరిరక్షిస్తున్నది. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం – పరిశోధన సంస్థ’లో 47 అంశాలకు సంబంధించిన 24 వేల రాతప్రతులను భద్రపరిచారు. 16 భాషల్లో ఉన్న ఈ ప్రాచ్య లిఖిత గ్రంథాల్లో తాళపత్ర గ్రంథాలు, కాగితంపై లిఖించినవే కాకుండా తోలుపై చేసిన రచనలూ ఉన్నాయి! ఈ గ్రంథాలయంలో 17 వేల గ్రంథాలు ఉర్దూ, అరబిక్, పారశీక భాషల్లో ఉన్నాయి. 7 వేల గ్రంథాలు సంస్కృతం, తెలుగు, కన్నడ, మరాఠీ భాషలకు చెందినవి.
భారతీయ విద్యా విధానంలో చారిత్రక విషయాలకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల ప్రాచ్య లిఖిత గ్రంథాల అవసరం చాలామందికి తెలియదు. భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మనదేశంలోని తాళపత్రాలు, పురాతన రాతప్రతులపై దృష్టి సారించారు. నేడు మనం చదువుతున్న వాల్మీకి రామాయణం, మహాభారతాలు, మరెన్నో పురాణాలను బ్రిటిష్ పరిశోధకులు సేకరించి, పరిశీలించి, ప్రచురించినవే. మనదేశంలో అనేక రకాల రామాయణ కావ్యాలు ప్రచారంలో ఉండేవి. రకరకాల రామాయణాల్లోంచి వాల్మీకి రామాయణాన్ని ప్రామాణీకరించడం కోసం రామాయణ తాళపత్రాలెన్నిటినో పరిశీలించారు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ‘మహాభారతం’ రూపొందించడం కోసం బ్రిటిష్ పాలకులు 1200 రాతప్రతులను సేకరించి, ఎత్తిరాయించారు. ‘తాళపత్రాలు వేల సంవత్సరాలపాటు మనలేవు. కాబట్టి ప్రాచీన సాహిత్యాన్ని కాపాడుకునేందుకు ఎత్తి రాస్తూ ఉండేవాళ్లు. అలా రాసే క్రమంలో కొన్ని శ్లోకాలను మూల సాహిత్యానికి చేర్చేవారు. ఇలాంటి మార్పులు జరిగిన వాటిని గుర్తించి, మూల రచన ఏదో తేల్చేందుకు సేకరించిన రాతప్రతులను పోల్చారు. అందుకోసం అన్ని తాళపత్రాలనూ ఎత్తి రాయించారు. వాటిల్లో ఏ పదాలు తప్పుగా చేరాయి. ఏ పదాలు సరైనవో గుర్తించి.. పరిష్కరించారు. అలా మూల మహాభారత కథను ప్రచురించారు. నేపాల్ రామాయణ గాథలు భారతదేశంలో ప్రచారంలో ఉన్న ఎన్నో రామాయణాలకు భిన్నంగా ఉంటాయి. అలాంటి రామాయణాలెన్నిటినో సేకరించి వాల్మీకి రామాయణం ప్రచురించారు’ అని ఈ సంస్థలోని సంస్కృత విభాగంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్న డాక్టర్ గీతా భవాని చెబుతున్నారు.
ప్రాచీన రచనలపట్ల బ్రిటిష్ వారితోపాటు పూర్వం భారతదేశాన్ని ఏలిన మొఘల్ పాలకులు కూడా పురాతన భారతీయ సాహిత్యం పట్ల ఆసక్తి ప్రదర్శించారు. అక్బర్ చక్రవర్తి పాలనా కాలంలో సంస్కృత గ్రంథాలను పారశీక భాషలోకి అనువదించడం మొదలైంది. 16వ శతాబ్దం నుంచి మూడు వందల సంవత్సరాల పాటు పారశీ రాజభాషగా చెలామణిలో ఉంది. ఆ కాలంలో సంస్కృత గ్రంథాలను విరివిగా అనువదించారు. ధర్మశాస్ర్తాలు, రాజనీతి, ఆయుర్వేద గ్రంథాలే కాకుండా మతగ్రంథాలనూ సంస్కృతం నుంచి పారశీకంలోకి అనువదించారు. ఇస్లాం మత అవలంబీకులైన మొఘల్ పాలకుల కాలంలో వైదిక గ్రంథాలైన వేదాలు, మహాభారతం, రామాయణం మతం, తత్వం, గణితం తదితర శాస్ర్తాలకు సంబంధించిన గ్రంథాలు సంస్కృతం నుంచి పారశీక భాషలోకి అనువాదమయ్యాయి. ఆ తర్వాత పాలకులైన జహంగీర్, షాజహాన్ కూడా అక్బర్ మార్గాన్నే అనుసరించారు. మొఘలుల పాలనలో భారతీయ సాహిత్యం ఉర్దూ, అరబిక్, పర్షియన్ భాషలలోకి విస్తృతంగా అనువాదమైంది. షాజహాన్ పెద్దకొడుకు దారా షికో సంస్కృత సాహిత్య అనువాదాన్ని బాగా ప్రోత్సహించాడు. రామాయణ పారశీక భాషానువాదం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందట. కలం పట్టుకుని పేజీలు నింపినంత తేలికగా ఆనాడు గ్రంథ రచన సాగిపోలేదు. అందమైన చేతిరాత. అక్షరాల్లో పొల్లుపోని సంస్కరణ, రాతకు దీటైన రంగులతో అందమైన చిత్రీకరణ, చేవ్రాలుకు సరిహద్దులుగా నిలిచిన ముచ్చటైన పుస్తక రచనకు ఏండ్లకాలమే పడుతుంది.
పుస్తకం హస్త భూషణం అన్నారు. చేతిలోని పుస్తకం అందంగా ఉంటేనే కదా అది ఆభరణమయ్యేది. మొఘలులు ఆ పుస్తకానువాదాల సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కథలకు తగిన అందమైన చిత్రాలను గీయించారు. నాణ్యమైన రంగులు ఉపయోగించడం వల్ల వందల ఏండ్లు గడిచినా చెక్కు చెదరకుండా ఉన్నాయి. చేతితో తయారు చేసిన కాగితంపై చిత్రించిన రామాయణ, మహాభారత చిత్రాలే కాదు అక్షరాలూ చూపరులను ఆకట్టుకుంటాయి. అద్భుతమైన అక్షరాల కోసం కలిగ్రఫీ (చేతిరాత)లో ఆరితేరిన వాళ్లను నియమించుకున్నారు. స్వర్ణాక్షరాలతో, స్వర్ణ, వర్ణ చిత్రాలతో పుటలను అలంకరించారు. సమకాలీన ప్రపంచంలో కలిగ్రఫీలో ప్రఖ్యాతి గాంచిన వాళ్లను మొఘల్ పాలకులు నియమించుకుని అనువాద ప్రక్రియ కొనసాగించారు. బంగారం లాంటి రచనలు, బంగారు పుస్తకాలను మనకు వారసత్వంగా అందించారు. ఇలాంటి పుస్తకాలెన్నో ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఉన్నాయి. ఒకే కాగితం చుట్టపై పూర్తి సంస్కృత భగవద్గీత, నక్షత్రాకారంలో కత్తిరించిన జింక చర్మంపై ఖురాన్ వంటి అరుదైన గ్రంథాలు ఇందులో ఉన్నాయి.
తెలుగులో తొలి కావ్యం మహాభారతం. నన్నయ, తిక్కన, ఎర్రన రాసిన మహాభారత పర్వాలన్నీ ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఉన్నాయి. కవిత్రయం రాసిన కావ్యాల అసలు ప్రతులు అందుబాటులో లేకున్నా వాటిని నకలు తాళపత్ర గ్రంథాలు ఇందులో భద్రంగా ఉన్నాయి. వీటి తీరుగానే తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైన రచనలెన్నో ఈ గ్రంథాలయ పరిరక్షణలో ఉన్నాయి. అప్పకవి రచించిన ఛందోగ్రంథం ‘అప్పకవీయం’ను తాళపత్రాలపై ఎత్తిరాసిన గ్రంథం, నన్నయ రాసిన ‘ఆంధ్రశబ్ద చింతామణి’ నకలు తాళపత్ర గ్రంథం, పాల్కురికి సోమనాథ విరచిత ‘వృషాధిప శతకము’ను కాగితంపై ప్రతిలేఖన గ్రంథం, తాళపత్రాలపై తిరిగి రాసిన వేమన పద్యాలు, భాస్కర శతకం, బద్దెన నీతిశాస్త్రం (కాగితం), కాగితంపై ఎత్తిరాసిన ఏకామ్రనాథుడి ‘ప్రతాపరుద్ర చరిత’, పంచతంత్ర కథలు మొదలైనవెన్నో ఉన్నాయి. ఇవేకాకుండా ఆయుర్వేద గ్రంథాలు, వైద్య చికిత్సా పద్ధతులు, వ్యవసాయం, వృత్తులు మొదలైన తెలుగు గ్రంథాలెన్నిటినో పరిశోధకుల అధ్యయనం కోసం పరిరక్షిస్తున్నారు. ఆయుర్వేద విభాగంలో ఉన్న కూరగాయల గుణములు, జ్వర విధానము, సుఖరోగ చికిత్సా సంగ్రహం లాంటి ప్రతులు పరిశీలిస్తే.. వాటిలోని విషయాలు నేటి ఆధునిక చికిత్సా పద్ధతులకు ఏమాత్రం తీసిపోవు. గణితశాస్త్రం, తత్వశాస్త్రం, పురాణాలు, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రెండు వేలకుపైగా తెలుగు గ్రంథాలు ఉన్నాయిక్కడ.
ప్రాచీన రాతప్రతులను సేకరించడం, వాటిని సంరక్షించడం, పరిశోధకులకు వాటిని అందుబాటులో ఉంచడం ప్రాచ్య లిఖిత గ్రంథాలయం – పరిశోధనా సంస్థ లక్ష్యాలు. ప్రాచీన రాతప్రతులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ సంస్థ సర్వే చేస్తుంది. ఆ రచన, రచయిత, కాలాన్ని గుర్తించి నమోదు చేస్తుంది. తాళపత్ర గ్రంథాలు కలిగిన వారిని ఒప్పించి సేకరిస్తుంది. ఇక్కడ ఆ తాళపత్రాలను కీటకాల బారినుంచి కాపాడేందుకు రసాయనాలతో శుద్ధి చేస్తారు. వాటి జీవిత కాలం పెంచేందుకు ఏడాదికోసారి లెమన్ గ్రాస్, సిట్రానిల్లా ద్రావణాలను తగుపాళ్లలో కలిపి పైపూతగా పూస్తారు. ఇవి ఏడాదిపాటు కీటకాల బారిన పడకుండా కాపాడతాయి. ప్రాచీన గ్రంథాల విషయ సూచికను రూపొందించి పరిశోధకులకు అందుబాటులో ఉంచుతారు. పండితులు, పరిశోధకుల సహకారంతో ప్రతి లేఖనం చేయించడం, పరిష్కరించడం, ప్రచురించడం కూడా ఈ సంస్థ విధి.
మనిషి ఎంత దూరం వలసపోయాడో అంతదూరం తన వారసత్వాన్ని తీసుకుపోయాడు. ఒక ప్రాంతంలో లిఖితమైన గ్రంథాలు మరో ప్రాంతానికి పరిచయమై జ్ఞాన వ్యాప్తి జరిగింది. ఆ ప్రాచీన వైజ్ఞానిక చరిత్రకు ఆనవాళ్లే కాదు ఆధారాలుగా ఈ ప్రాచ్యలిఖిత గ్రంథాలు దోహదపడతాయి. పశ్చిమ దేశాలతో భారతదేశానికి ఉన్న చారిత్రక అనుబంధాన్ని చెప్పే కథలు, గాథలు, చరిత్ర, మత విశ్వాసాలు, తత్వం, న్యాయం, రాజనీతితోపాటు జానపద గాథలెన్నో చెప్పే గ్రంథాలెన్నో నిండిపోయిన జ్ఞానభాండం ఇది. అందుకే దేశ విదేశాల నుంచి వచ్చే పరిశోధకులకు ఈ రాతప్రతులను అందుబాటులో ఉంచుతున్నారు. ఇక్కడిదాకా రాలేని పరిశోధకులకు ప్రాచీన గ్రంథాలను ఆన్లైన్లోనే అందిస్తున్నారు. ఇరాన్, ఇరాక్, అమెరికా నుంచి ఎక్కువ మంది పరిశోధకులు ఈ రాతప్రతులను అధ్యయనం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. విదేశీ పరిశోధకుల కోసం పరిశోధనాలయంలో డిజిటలైజేషన్ కార్యక్రమం చేపట్టి వందలాది గ్రంథాలను డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చారు. తాళపత్ర గ్రంథాల గురించి విద్యాసంస్థల్లో అవగాహన కల్పించడం, మౌఖిక సాహిత్యాన్ని కూడా ప్రచురించడం ఇటీవల కాలంలో ఈ సంస్థ చేపట్టిన నూతన కార్యక్రమాలని రీసెర్చ్ స్కాలర్ మెట్టు వెంకటనారాయణ చెప్పారు. సిల్మా నాయక్ రచించిన ‘నల్లగొండ జిల్లా బంజారా మౌఖిక కథలు’, రాజారాం రచించిన ‘బంజారా నోటి కథలు’ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం ప్రచురించినవే.
ప్రాచ్య గ్రంథాలయ – పరిశోధనా సంస్థకు వడ్లమూడి గోపాలకృష్ణ మొదటి సంచాలకులుగా నియమితులైనారు. ఆచార్య జయధీర్ తిరుమలరావు, ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం సంచాలకులుగా ఉన్న కాలాన్ని ఈ సంస్థకు స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆచార్య జయధీర్ తిరుమలరావు 2005 ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, పరిశోధన సంస్థకు సంచాలకులుగా నియమితులయ్యారు. ఆయన సారథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం రాతప్రతులను గుర్తించి, సేకరించేందుకు సర్వే నిర్వహించారు. మండలం ఒక యూనిట్గా తీసుకుని ఒక సర్వేయర్ని, జిల్లాకు ఒక కో ఆర్డినేటర్ని నియమించి అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించారు. అయిదేళ్లలో ఈ సర్వే పూర్తయింది. 2010లో సంస్థకు సంచాలకులుగా ఉన్న ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం నేతృత్వంలో జాతీయ పాండు లిపి సంస్థ (నేషనల్ మాన్యుస్క్రిప్ట్ మిషన్)తో కలిసి రాతప్రతుల పరిరక్షణ కోసం అనేక కార్యశాలలు నిర్వహించారు. ఈ పదేళ్ల కాలంలో 70 పుస్తకాలను ప్రచురించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఆయుష్ శాఖ అనుబంధ సంస్థ)తో యునానీ రాతప్రతులను ప్రచురించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉర్దూ, అరబిక్, పారశీకలో ఉన్న 500కుపైగా యునానీ వైద్య రాత ప్రతులను డిజిటల్ రూపంలో అందించారు. అవన్నీ పుస్తక రూపంలో అందుబాటులోకి రానున్నాయి. రాతప్రతులు రక్షించుకుందాం. ఘనమైన వారసత్వాన్ని
చాటుకుందాం.
మన రాతప్రతులపట్ల మనకంటే విదేశీయులే ఎక్కువ అభిమానం చూపారు. మన భాషలు నేర్చుకుని వాటి సారాన్ని తెలుసుకున్నారు. ప్రాచీన భారతీయులు సముపార్జించిన జ్ఞానంతో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. మనం వీటిని కాపాడుకోవడమే కాదు కొత్త ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ చైతన్యం కోసమే విద్యాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అన్ని విజ్ఞాన శాస్ర్తాలు ప్రాచీన రాతప్రతుల్లో ఉన్నాయి. ఆ విశేషాలను నేటి తరానికి చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వర్ణోత్సవాల సందర్భంగా ఐటీ శాఖ సహకారంతో మాన్యుస్క్రిప్ట్ వెబ్సైట్ రూపొందిస్తున్నాం. సంస్థ సేకరించిన రాత ప్రతులన్నీ డిజిటల్ రూపంలో ప్రపంచానికి అందుబాటులో ఉంచుతాం.
– డాక్టర్ పాలెపు సుబ్బారావు,
సంచాలకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం – పరిశోధనా సంస్థ
కాలాన్ని బట్టి తప్పొప్పులు మారిపోతూ ఉంటాయి. ఒకనాటికి తప్పు కానిది ఈనాటికి తప్పు కావొచ్చు. ఒకనాడు ఒప్పుగా చెలామణీ అయినది నేడు తప్పుగా శిక్షార్హమవ్వొచ్చు. ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలంటే ప్రాచీన గ్రంథాల్లోని న్యాయశాస్ర్తాలను తిరగేస్తే తెలుస్తుంది. ఆనాటి న్యాయాన్యాయాల గురించి వివరించే సంస్కృత, పారశీక, తెలుగు రాతప్రతులు ఈ పరిశోధనాలయంలో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘ముఖ్తసర్-అల్-కఫి’. ఇది అయిదో శతాబ్దం నాటి న్యాయశాస్ర్తాన్ని వివరిస్తుంది. క్రీ. శ. 1026లో ప్రాచీన అరబ్బీ, నష్క లిపిలో ముగ్గురు పండితులు ఈ గ్రంథాన్ని ప్రతిలేఖనం చేశారు.
ప్రపంచంలోనే గొప్ప కలిగ్రాఫర్లలో ఒకడిగా యాకుత్ అల్ ముస్తమి ప్రసిద్ధుడు. అందమైన చేతిరాతతో ఆయన రూపొందించిన మూడు ఖురాన్లు నేటికీ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి తెలంగాణ ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో భద్రంగా ఉంది. తులుత్, నష్క లిపిలో యాకుత్ అల్ ముస్తమి 1262లో ఈ ఖురాన్కు నకలు రాశాడు.
జింక చర్మంపై ఎత్తిరాసిన ఖురాన్ ఇది. 400 ఏండ్ల క్రితం దీనిని రచించారు. నక్షత్రాకారంలో కత్తిరించిన జింక చర్మంపై నష్క లిపిలో ఖురాన్ను పొందుపరచారు.
చేతితో తయారుచేసిన పొడవైన కాగితంపై సూక్ష్మమైన అక్షరాలతో ఈ ఖురాన్ను లిఖించారు. నష్క లిపిలో ఎత్తి రాసిన ఈ ఖురాన్ 300 ఏళ్ల నాటిది! తిలకం సీసా పరిమాణంలో ఉండే చిన్న డబ్బాలో ఈ కాగితపు చుట్ట ఇమిడిపోతుంది.
ప్రఖ్యాత తత్వవేత్తల ఆలోచనలు, శాస్త్రవేత్తల పరిశోధన విశేషాలు, వారి జీవిత చరిత్రలను తెలిపే గ్రంథం ఇది. అబ్దుల్లా అలీ అల్ తబీబ్ 1696లో బరహంపూర్లో దీనిని రాశాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు ఈ గ్రంథాన్ని బహూకరించాడు. ఇప్పటికీ ఈ పుస్తకం ఏమాత్రం శిథిలం కాలేదు.
నేటి తరం మేల్కొనాలి మన రాతప్రతులపట్ల మనకంటే విదేశీయులే ఎక్కువ అభిమానం చూపారు. మన భాషలు నేర్చుకుని వాటి సారాన్ని తెలుసుకున్నారు. ప్రాచీన భారతీయులు సముపార్జించిన జ్ఞానంతో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. మనం వీటిని కాపాడుకోవడమే కాదు కొత్త ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ చైతన్యం కోసమే విద్యాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అన్ని విజ్ఞాన శాస్ర్తాలు ప్రాచీన రాతప్రతుల్లో ఉన్నాయి. ఆ విశేషాలను నేటి తరానికి చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వర్ణోత్సవాల సందర్భంగా ఐటీ శాఖ సహకారంతో మాన్యుస్క్రిప్ట్ వెబ్సైట్ రూపొందిస్తున్నాం. సంస్థ సేకరించిన రాత ప్రతులన్నీ డిజిటల్ రూపంలో ప్రపంచానికి అందుబాటులో ఉంచుతాం.
– డాక్టర్ పాలెపు సుబ్బారావు, సంచాలకులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం – పరిశోధనా సంస్థ