‘నేలను నమ్ముకుంటే పిడికెడు అన్నం అయినా పుడుతుంది’ అన్న పెద్దల మాట ఆ గ్రామవాసులకు శిలాశాసనం. అందుకే తరాలు మారినా సాగుబడిలోనే జీవనం కొనసాగిస్తున్నారు. “మేం ఎప్పటికీ కర్ష‘కులమే” అని సగర్వంగా చాటుతున్నారు. అందరూ చిన్నకారు రైతులే. వారికి తెలిసింది రెండే! ఒకటి పంట, రెండోది పాడి. చేలో పసిడి పంటలు పండిస్తారు. ఇంట్లో పాడిపరిశ్రమ నిర్వహిస్తారు. బయట నుంచి పాలు కొనరు, పండించిన పంటలతోనే సర్దుకుపోతారు. తాతల నాటి నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం డేగలమడుగు వాసులు.
కొత్తగూడెం జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డేగలమడుగు. ఈ గ్రామంలో 95 కుటుంబాలున్నాయి. ఒకప్పుడు సింగభూపాలెం చెరువు కింద గ్రామం ఉండేది. క్రమేపి చెరువులో నీరు పెరగడంతో నాయకులగూడెం పక్కనే ఉన్న డేగలమడుగుకు తరలింది. నాటి నుంచి ఆ కుటుంబాలన్నీ వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తూ అక్కడే స్థిరపడ్డాయి. తాతల కాలం నుంచి వ్యవసాయాన్ని నమ్ముకొని లాభసాటిగా మార్చుకున్నారు గ్రామస్థులు. పండుగలొచ్చినా.. జాతరలొచ్చినా ఊరంతా కలిసి చేసుకోవడం సంప్రదాయం.
అండగా రైతుబంధు
సాగుబడిలో కొత్త అక్షరాలు దిద్దుతున్నారు ఈ రైతులు. మార్కెట్లో డిమాండ్ను బట్టి పంటలను మారుస్తూ లాభాలు గడిస్తున్నారు. వరితోపాటు పత్తి, టమాట, జొన్న, మక్కజొన్న ఇతర ఆకుకూరలు సాగు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకారం తోడుకావడంతో వీరి సేద్యానికి అసాధ్యమంటూ లేకుండా పోయింది. రైతుబంధు రూపంలో పెట్టుబడి కష్టాలు తీరాయి. దీనికి తోడు పక్కనే సింగభూపాలెం చెరువు ఉండటంతో మోటార్ల ద్వారా సాగునీరు అందుతున్నది. ఫలితంగా సాగు సస్యశ్యామలంగా మారింది. ఈ గ్రామస్తులు ఇతర పనులకు వెళ్లరు. పంటపొలాలే వారి కార్యక్షేత్రం. వాళ్లే రైతులు, వాళ్లే రైతు కూలీలు. ఒకరికొకరు చేదోడువాదోడుగా నిలుస్తూ వ్యవసాయాన్ని ఫలసాయంగా మార్చుకున్నారు.
ఇంటింటికీ పాడి
రైతు అంటేనే పాడి, ఆ తర్వాతే పంట. ఆ సంప్రదాయానికి డేగలమడుగు మారుపేరుగా నిలిచింది. ప్రతీ రైతు కుటుంబానికి పాడి గేదెలు ఉంటాయి. మేకలను సైతం పెంచుతున్నారు. ప్రతి ఇంటి పెరట్లో కొట్టం ఉంటుంది. కుటుంబసభ్యులంతా కలిసి పాడిపనులు సమర్థంగా చూసుకుంటారు. పాల ఉత్పత్తులను విక్రయించి అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. పశువుల వ్యర్థాల నుంచి సహజ ఎరువును తయారు చేసుకుంటున్నారు. ఇలా శ్రమైక జీవనానికి నిదర్శనంగా కనిపిస్తుంది డేగలమడుగు. ఊరంతా పచ్చగా కళకళలాడుతూ దర్శనమిస్తుంది. తరాలు మారుతున్నా వ్యవసాయాన్ని వదులుకునేది లేదన్న వారి నిశ్చయం అభినందనీయం.
భూమిని నమ్ముకున్నాం
భూమిని నమ్ముకుని బతుకుతున్నాం. నాకు ఐదెకరాల పొలం ఉంది. తెలంగాణ వచ్చాక రైతుబంధు కూడా వస్తున్నది. కష్టపడి సాగు చేసుకొని మన పంట మనం తినడం కన్నా ఆరోగ్యం ఏముంటుంది. ఇంతకన్నా సంతోషం ఎక్కడ దొరుకుతుంది. ఒకరికి ఒకరు తోడుగా ఉంటాం.
–కాగితపు వెంకటేశ్వరరావు , కొత్తగూడెం